logo

రెవెన్యూ వినతులే అధికం

విజయవాడలోని కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజా వినతుల స్వీకరణ స్పందన కార్యక్రమంలో మొత్తం 101 వినతి పత్రాలు స్వీకరించారు.

Published : 31 Jan 2023 04:15 IST

ప్రజల సమస్యలు వింటున్న కలెక్టర్‌ డిల్లీరావు. వేదికపై శ్రీవాస్‌ నుపుర్‌, మోహన్‌కుమార్‌

ఎన్టీఆర్‌ కలెక్టరేట్‌, న్యూస్‌టుడే : విజయవాడలోని కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజా వినతుల స్వీకరణ స్పందన కార్యక్రమంలో మొత్తం 101 వినతి పత్రాలు స్వీకరించారు. వీటిలో అధికంగా రెవెన్యూ శాఖకు 38 అర్జీలు అందాయి. పోలీసు శాఖకు 18, మున్సిపల్‌ 11, విద్యుత్తు, పీఆర్‌లకు ఐదేసి, సర్వే శాఖకు 4, వైద్య, దేవాదాయ శాఖలకు నాలుగేసి, డీఆర్డీఏ, విద్య, మార్కెటింగ్‌ శాఖలకు రెండేసి, రిజిస్ట్రేషన్లు, గనులు, విభిన్న ప్రతిభావంతులు, ఉపాధి కల్పన, అగ్నిమాపక, ఐసీడీఎస్‌, సీఆర్డీఏ, అటవీ, ఆర్‌ అండ్‌ బీ, మైనార్టీ శాఖలకు ఒక్కొక్క అర్జీ చొప్పున అందాయి. కలెక్టర్‌ ఎస్‌.డిల్లీరావు నేతృత్వంలో జాయింట్‌ కలెక్టర్‌ శ్రీవాస్‌ నుపుర్‌ అజయ్‌, జిల్లా రెవెన్యూ శాఖ అధికారి కె.మోహన్‌కుమార్‌ తదితరులు వినతులు స్వీకరించారు.

బావి స్థలం ఆక్రమించి నిర్మాణం

వత్సవాయి మండలం భీమవరం గ్రామంలో గిలకల బావి స్థలాన్ని ఆక్రమించి.. గది నిర్మాణం చేపట్టడంపై మూడు వినతులు వచ్చాయి. గ్రామ పంచాయతీతో పాటు, స్థానికులు దీనిపై పోరు సల్పుతున్నారు. హిందువుల ఖర్మ కాండలకు, ముస్లింల పీర్లకు సదరు స్థలాన్ని వినియోగిస్తారని.. అక్కడ ఒక వ్యక్తి గది నిర్మించడం వల్ల రోడ్డుపై కార్యక్రమాలు నిర్వహిస్తుండడంతో ట్రాఫిక్‌కు అంతరాయం కలుగుతోందని విన్నవించారు.

వత్సవాయి మండలం పెదమోదుగుపల్లిలో తనకు 2.26 ఎకరాల భూమి ఉండగా, 2.08 ఎకరాలు మాత్రమే ఉందని చెబుతున్నారని, న్యాయం చేయాలని కోరుతూ.. కె.సుశీల విన్నవించారు.

విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకం

ఓపెన్‌ స్కూల్‌కు సంబంధించి 19 మంది విద్యార్థులకు ప్రవేశ ఫీజు చెల్లించే వెసులు బాటు కల్పించాలని కోరుతూ.. జగ్గయ్యపేటకు చెందిన కరిసే మధు వినతి పత్రం సమర్పించారు. దీనిపై విద్యా శాఖాధికారులకు వినతి పత్రాలు సమర్పిస్తున్నా.. సమస్య పరిష్కారం కావడం లేదని, విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఫీజు చెల్లించే అవకాశం కల్పించాలని కోరారు.

విజయవాడ గ్రామీణ మండలం ప్రసాదంపాడులో సింగిల్‌ బెడ్‌ రూమ్‌ అపార్టుమెంట్ల నిర్మాణ ఒప్పందంలో తనకు అన్యాయం జరిగిందని, న్యాయం చేయాలని కోరుతూ.. బిల్డరు సతీష్‌ విన్నవించారు. తాను ఆర్థికంగా నష్టపోయానని, ఒప్పందం ప్రకారం తనకు రావాల్సిన అపార్టుమెంట్ల కోటా ఇప్పించాలని కోరారు.


అక్కడ ఉండలేం.. ఇక్కడ వద్దంటున్నారు..

గంపలగూడెంలో జగనన్న ఇళ్ల కింద ఇచ్చిన స్థలాల్లో విద్యుత్తు, తాగునీరు తదితర సదుపాయాలు లేక పోవడంతో అక్కడకు వెళ్లలేని పరిస్థితి ఏర్పడిందని నెమలి చిట్టిబాబు విన్నవించారు. ప్రస్తుతం తాము ఉంటున్న పాఠశాల స్థలాన్ని ఖాళీ చేయమంటున్నారని, స్థలాలు వినియోగంలోకి వచ్చే వరకు ప్రత్యామ్నాయం చూపాలని కోరారు.

పూర్వం నుంచి తమ కుటుంబ ఆధీనంలోని 15.22 ఎకరాల భూమిని, 2012లో అటవీ శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారని, తిరిగి ఇప్పించాలని కోరుతూ.. ఎ.కొండూరు మండలం రేపూడి తండాకు చెందిన భరోత్‌ పీక్లానాయక్‌ (73) విన్నవించారు.

విజయవాడ గ్రామీణ మండలం గొల్లపూడికి చెందిన ఎర్రమాసు సాంబశివరావు తనకు సంబంధించిన 57 సెంట్ల భూమి సమస్యను పరిష్కరించాలని కోరారు. సేల్‌ కమ్‌ జీపీ ద్వారా సదరు భూమిని పొందానని, అడంగల్‌, 1బి కోసం దరఖాస్తు చేస్తే రావడం లేదని, గతంలో పట్టా ఎలా ఇచ్చారో తెలియజేయాలని విన్నవించారు.

ప్రైవేటు రైతు బజారు ఖాళీకి ఆదేశం

కృష్ణలంక పాత బస్‌ షెల్టర్‌లోని ప్రైవేటు కూరగాయల మార్కెట్‌ నిర్వహణపై, కృష్ణలంక నూతన రైతు బజారుకు చెందిన రైతులు, దుకాణదారులు రెండో సారి స్పందన తలుపు తట్టారు. ముఖ్యంగా మహిళలు.. సదరు సమస్యపై జేసీకి విన్నవించారు. ప్రైవేటు రైతు బజారును మూసి వేయించాలని కలెక్టర్‌ ఆదేశించారు. ఈ విషయమై ఏడీఎంతో చర్చించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు