logo

మెప్పించేలా.. మెరుగులు దిద్దుతూ..

అంతర్జాతీయ ప్రదర్శనకు ఎంపికైన పెడన పట్టణ భట్ట జ్ఞానకోటయ్య జడ్పీ విద్యార్థుల బృందం తమ సైన్సు ప్రాజెక్టుకు మెరుగులు దిద్దుతోంది.

Published : 06 Feb 2023 05:37 IST

అంతర్జాయ వేదికకు సిద్ధమవుతున్న విద్యార్థులు
న్యూస్‌టుడే, పెడన గ్రామీణం

అంతర్జాతీయ ప్రదర్శనకు ఎంపికైన పెడన పట్టణ భట్ట జ్ఞానకోటయ్య జడ్పీ విద్యార్థుల బృందం తమ సైన్సు ప్రాజెక్టుకు మెరుగులు దిద్దుతోంది. ఈ ఏడాది మే నెలలో అమెరికాలోని డల్లాస్‌లో జరగనున్న అంతర్జాతీయ ప్రదర్శనకు ఎంపికైన నమూనాను ప్రదర్శించటానికి దేశీయ సైన్సు అండ్‌ టెక్నాలజీ సంస్థ, ఇనీషియేటివ్‌ రీసెర్చి ఇన్నోవేటివ్‌ ఇన్‌ స్టెమ్‌(ఐఆర్‌ఐఎస్‌), సైంటిఫింక్‌ రివ్యూ కమిటీ మార్గదర్శకం చేస్తుంది. ఈ నెల 11 నుంచి 13 వరకు  విద్యార్థులకు, గైడ్‌ ఉపాధ్యాయిని కె.లక్ష్మీదేవీకి ఆన్‌లైన్లో తగు సూచనలు, సలహాలు ఇస్తారు. దీంతో ఈ ప్రయోగానికి మరింత మెరుగులు అద్దుతారు. అంతర్జాతీయ స్థానంలో గుర్తింపు సాధించటానికి ప్రయత్నం చేస్తున్నారు. విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మక శక్తిని వెలికి తీసేందుకు ప్రభుత్వం నిర్వహించే సైన్సు ప్రదర్శనలు దోహదం చేస్తున్నాయి. మొక్కలకు కింద భాగంలో ఉండే పాలిథిన్‌ సంచుల్ని నివారించి దాని స్థానంలో అతి తక్కువ ఖర్చుతో పర్యావరణ హితంగా కుండీలను తయారు చేసే నమూనాను బృందం రూపొందించింది.
ఎలా తయారు చేస్తారంటే..


తయారు చేసిన కుండీలో మొక్క

జీవశాస్త్ర ఉపాధ్యాయిని లక్ష్మీదేవి ప్రోత్సాహంతో తొమ్మిదో తరగతి విద్యార్థులు మణికంఠ, వినయ్‌లు స్మార్టు సొల్యూషన్‌ ఫర్‌ ఎకో సొల్యూషన్‌ ప్రాజెక్టును తయారు చేశారు.2021 నుంచి ఈ నమూనా డివిజన్‌ స్థాయి నుంచి అంచెలంచెలుగా అంతర్జాతీయ స్థాయికి ఎంపికైంది. ప్రాజెక్టులో మొక్క అడుగు భాగాన ప్లాస్టిక్‌ సంచికి బదులుగా కుండీని తయారు చేయటానికి వేరుశనగపొట్టు, వేపాకు, కొబ్బరి పీచు, మెంతులను ఉపయోగిస్తారు. వేరుశెనగ తొక్కలని, వేపాకును పౌడరుగా తయారు చేసి దీనికి  మెంతుల గుజ్జు కలపాలి.  కొబ్బరి పీచుతో కుండీ ఏ ఆకారంలో కావాలో  అలా తయారు చేసుకుని దానికి గుజ్జును, పౌడర్ని లేయర్లుగా పూస్తారు. ఇలా చేసిన తరువాత రెండు రోజులు ఆరబెట్టాలి. కుండీ తయారీలో మంచి ఫలితాలు వచ్చాయి. మొక్కకు అడుగు భాగాన పాలిథీన్‌ సంచి మట్టిలో కలవని పరిస్థితి. వాటి స్థానంలో కుండీలైతే పర్యావరణ హితంగా ఉంటాయని భావించి నమూనాకు రూపకల్పన చేశారు.


అదే నాకు ప్రేరణ: కొల్లాలి లక్ష్మీదేవి

వినయ్‌ కుమార్‌, దుర్గామణికంఠతో గైడ్‌ లక్ష్మీదేవి

ప్లాస్టిక్‌ వినియోగం వల్ల ఎన్ని అనర్థాలు కలుగుతున్నాయో స్వయంగా చూశాక ఏమైనా చేయాలన్న ఆలోచన వచ్చింది. మా అమ్మ దమయంతి, అత్త వెంకటరత్నం ముగ్గు బుట్టల్ని తయారు చేసేందుకు ఈ పద్ధతుల్ని  ఉపయోగించారు. అదే నాకు ప్రేరణ..దాని ఆధారంగా మొక్కల కుండీల్ని తయారు చేశాం.


పొదుపు సంఘాలతో కుండీలు తయారు చేయిస్తున్నాం

మేము పలు నర్సరీలను సందర్శించాం. ప్లాస్టిక్‌ వల్ల కలిగే అనర్థాల గురించి వారికి వివరిస్తే అర్థం చేసుకున్నారు. మేము తయారు చేస్తున్న కుండీలను మొక్కల అడుగు భాగంలో ఉంచి ఇస్తే బాగుంటుందని తెలిపాం. కుండీలు సరఫరా చేస్తే తీసుకుంటామని కొన్ని నర్సరీల వారు ముందుకు వచ్చారు.ఈ ఆలోచనను కొన్ని పొదుపు సంఘాల మహిళలకు చెప్పాం. వారు వీటిని  తయారు చేసేందుకు ముందుకు వచ్చారు.అంతర్జాతీయ స్థాయిలోనూ తగిన గుర్తింపు వస్తుందన్న ఆశాభావంతో ఉన్నాం.

వరద వినయ్‌ కుమార్‌, ఎన్‌ దుర్గామణికంఠ, 9వ తరగతి


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు