logo

కొల్లు అరెస్టుతో పార్టీ శ్రేణుల్లో ఆగ్రహం

ప్రభుత్వ భూమిని వైకాపా కార్యాలయానికి కేటాయించడాన్ని ఖండిస్తూ మాజీ మంత్రి కొల్లు రవీంద్ర ఆధ్వర్యాన సోమవారం కలెక్టరేట్‌ వరకూ తలపెట్టిన నిరసన ర్యాలీకి అనుమతి ఇచ్చిన పోలీసులు ఆయనను అరెస్ట్‌ చేయడంతో ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి.

Published : 07 Feb 2023 03:26 IST

తెదేపా ర్యాలీని అడ్డుకున్న పోలీసులు
మచిలీపట్నంలో వివాదం

నల్లజెండాలతో కలెక్టరేట్‌కు ర్యాలీగా వెళ్తున్న కొల్లు రవీంద్ర,

కొనకళ్ల జగన్నాథరావు, పార్టీ నాయకులు, కార్యకర్తలు

మచిలీపట్నం(కోనేరుసెంటరు), న్యూస్‌టుడే: ప్రభుత్వ భూమిని వైకాపా కార్యాలయానికి కేటాయించడాన్ని ఖండిస్తూ మాజీ మంత్రి కొల్లు రవీంద్ర ఆధ్వర్యాన సోమవారం కలెక్టరేట్‌ వరకూ తలపెట్టిన నిరసన ర్యాలీకి అనుమతి ఇచ్చిన పోలీసులు ఆయనను అరెస్ట్‌ చేయడంతో ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. కళ్లెదుటే కోట్లాది రూపాయల విలువచేసే రెండు ఎకరాల ప్రజల ఆస్తిని అప్పనంగా వైకాపాకు కట్టబెట్టడాన్ని వ్యతిరేకిస్తూ పార్టీ ఆధ్వర్యంలో నల్లజెండాలతో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నగరవాసులు సైతం పాల్గొన్నారు. బస్టాండు సెంటరు వద్ద ఎన్టీఆర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నినాదాలు చేసుకుంటూ వెళ్తున్న ర్యాలీని జిల్లా కోర్టుసెంటరులో అడ్డుకున్నారు. అక్కడ రవీంద్ర మాట్లాడుతూ ఉండగా మైక్‌ను కట్‌ చేయడంతో తెదేపా కార్యకర్తలు పెద్దపెట్టున నినాదాలు చేశారు. కాస్త సద్దుమణుగుతుందనుకున్న సమయంలో వైకాపాకు కేటాయించిన స్థలం వైపు వెళ్లకుండా పోలీసులు అడ్డుకోవడంతో వివాదం మొదలైంది. పోలీసులు ఉద్దేశపూర్వకంగా అడ్డుకుంటున్నారన్న ఆగ్రహంతో ఒక్కసారిగా కార్యకర్తలు నాయకులు బారికేడ్లను తోసుకువెళ్లారు. ప్రభుత్వం ఇష్టానుసారం ప్రభుత్వ స్థలాలను వైకాపాకు కట్టబెట్టాలని చూస్తే సహించమని చావోరేవో తేల్చుకుంటామంటూ కార్యకర్తలు పట్టుబట్టడంతో మరింత ఉద్రిక్తత చోటు చేసుకుంది. కార్యకర్తలను చెదరగొట్టిన పోలీసులు నాయకులను అరెస్ట్‌ చేయడం.. ఒక స్టేషన్‌కు కాకుండా నాలుగైదు స్టేషన్లకు తిప్పడంతో పార్టీ శ్రేణుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఎక్కడకు తీసుకువెళ్తున్నారనే విషయాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ గూడూరు స్టేషన్‌కు తీసుకువెళ్లారని తెలియడంతో అక్కడికి చేరుకునేందుకు సిద్ధం కావడంతో ముందస్తుగా పోలీసులు అడ్డుకున్నారు.  రిమాండ్‌కు తరలిస్తున్నారన్న సమాచారంతో తదుపరి కార్యాచరణకై పార్టీ నాయకులు సమాలోచనలు చేస్తుండగానే న్యాయమూర్తి రవీంద్రను వ్యక్తిగత పూచీకత్తుపై విడుదల చేశారు. ఉదయం నుంచి నెలకొన్న సంఘటనలపై పార్టీ రాష్ట్ర కార్యాలయంతో పాటు రాష్ట్ర, జిల్లాకు చెందిన ముఖ్య నాయకులు ఎప్పటికప్పుడు ఏం జరుగుతోందనే సమాచారం తెలుసుకున్నారు. తోపులాట సందర్భంగా సృహ కోల్పోయి పడిపోయిన మహిళా నాయకురాలు త్రిపురను చికిత్సకై జిల్లా ఆస్పత్రికి తరలించగా అక్కడ సత్వర వైద్యసేవలు అందకపోవడాన్ని పార్టీ నాయకులు తప్పుపట్టారు. మొత్తం మీద ఉదయం నుంచి రాత్రి 10 గంటల వరకూ నగరంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

గూడూరు స్టేషన్‌ వద్ద రవీంద్రను కలిసిన దేవినేని ఉమ,

కాగిత కృష్ణప్రసాద్‌, తదితరులు


రాక్షస చర్యలకు భయపడేది లేదు

పోలీసులకు, పార్టీశ్రేణులకు మధ్య చోటు చేసుకున్న తోపులాటలో స్పృహ తప్పిపడిపోయిన మహిళా నాయకురాలు త్రిపురను పలువురు నాయకులు, కార్యకర్తలు ఆస్పత్రికి వెళ్లి ఆమెను పరామర్శించారు. పోలీసులు కొట్టడం వల్లే తాను స్పృహ కోల్పోయానని, ఇటువంటి రాక్షస చర్యలకు భయపడేదిలేదని బాధితురాలు పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని