logo

దంపతుల బలవన్మరణం

ఆ దంపతులు తనువు చాలించాలని ముందే నిర్ణయించుకున్నట్లున్నారు. ఉదయాన్నే లేచి పనికి వెళ్లే వారిలా క్యారియర్‌లో భోజనం పెట్టుకొని ద్విచక్ర వాహనంపై బయలు దేరారు.

Published : 09 Feb 2023 01:19 IST

నాగేశ్వరరావు, శ్రీకళ (పాత చిత్రాలు)

వత్సవాయి, న్యూస్‌టుడే: ఆ దంపతులు తనువు చాలించాలని ముందే నిర్ణయించుకున్నట్లున్నారు. ఉదయాన్నే లేచి పనికి వెళ్లే వారిలా క్యారియర్‌లో భోజనం పెట్టుకొని ద్విచక్ర వాహనంపై బయలు దేరారు. చనిపోయేందుకు అనువైన ప్రదేశం కోసం వెతికి చివరికి నిర్మానుష్య ప్రాంతమైన సుబాబుల్‌ తోటను ఎంచుకున్నారు. వెంట తెచ్చుకున్న భోజనం చేసి పురుగుల మందు తాగారు. అనంతరం బంధువులకు వాట్సప్‌ కాల్‌ చేసి తాము చనిపోతున్నామని, తమ పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పి ఫోన్‌ స్విచ్ఛాఫ్‌ చేశారు. ఆందోళనకు గురైన బంధువులు తెలిసిన ప్రాంతాల్లో వెతికారు. వారిది తెలంగాణ కావడంతో అక్కడి పోలీసులకు సమాచారం ఇచ్చారు. మంగళవారం మొత్తం వెతికినా ఆచూకీ తెలియలేదు. బుధవారం నందిగామ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. సెల్‌టవర్‌ లోకేషన్‌ ఆధారంగా పోలీసులు మృతదేహాలను గుర్తించారు. ఘటనా స్థలానికి వచ్చిన బంధువులు మాట్లాడుతూ వారికి ఎటువంటి సమస్యలు లేవని, ఎందుకు తనువు చాలించాలనుకున్నారో తెలియదని చెప్పారు. వివరాల్లోకి వెళ్లే... తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లా మధిర మండలం మాటూరుకు చెందిన దంపతులు పుట్టా నాగేశ్వరరావు (36), శ్రీకళ (34) ఎన్టీఆర్‌ జిల్లా వత్సవాయి మండలం వేములనర్వ సమీపంలోని సుబాబుల్‌ తోటలో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన బుధవారం వెలుగులోకి వచ్చింది. వారికి పది, ఎనిమిది తరగతులు చదివే ఇద్దరు కుమారులున్నారు. రెండు నెలల కిందట తాపీ పనుల కోసమని నందిగామ మండలం అనాసాగరం వచ్చారు. అక్కడే ఉంటూ పనులు చేసుకుంటూ జీవిస్తున్నారు. ఏం జరిగిందో ఏమో మంగళవారం పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. నందిగామ పోలీసులు వచ్చి మృతదేహాలను పోస్టుమార్టం కోసం జగ్గయ్యపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేస్తున్నట్లు నందిగామ సీఐ కె. సతీష్‌ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని