logo

న్యాయం కోసం వెళ్లిన న్యాయవాదిపై అక్రమ కేసు

న్యాయం కోసం పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లిన న్యాయవాదిపైన విజయవాడ భవానీపురం పోలీసులు అక్రమ కేసు నమోదు చేయడాన్ని నిరసిస్తూ బెజవాడ బార్‌ అసోసియేషన్‌(బీబీఏ) సభ్యులు సోమవారం విధులకు గైర్హాజరయ్యారు.

Published : 21 Mar 2023 04:48 IST

విజయవాడలో రోడ్డెక్కి ఆందోళన

నినాదాలు చేస్తున్న న్యాయవాదులు, చిత్రంలో బీబీఏ ప్రధాన కార్యదర్శి గంధం శ్రీనివాస్‌ తదితరులు

విజయవాడ న్యాయవిభాగం, న్యూస్‌టుడే : న్యాయం కోసం పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లిన న్యాయవాదిపైన విజయవాడ భవానీపురం పోలీసులు అక్రమ కేసు నమోదు చేయడాన్ని నిరసిస్తూ బెజవాడ బార్‌ అసోసియేషన్‌(బీబీఏ) సభ్యులు సోమవారం విధులకు గైర్హాజరయ్యారు. ప్రదర్శనలు నిర్వహించి, రోడ్డుపై బైఠాయించి ఆందోళనలు చేశారు. భవానీపురానికి చెందిన ఓ న్యాయవాది కుమార్తె(10) స్థానికంగా ఉన్న పార్క్‌లో ఆడుకుంటుండగా.. ఓ వ్యక్తి అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో న్యాయవాది రాత్రి 10 గంటల సమయంలో భవానీపురం పోలీస్‌ స్టేషన్‌కు ఫిర్యాదు చేయడానికి వెళ్లారు. ఆయన్ని పోలీసులు రాత్రి 11.00 గంటలకు వరకు కూర్చోబెట్టి, ఎఫ్‌.ఐ.ఆర్‌ కట్టకుండా దిశ పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేయాలని సూచించారు. ఈలోపు నిందితుడు రాత్రి 11.00 గంటల తర్వాత పోలీస్‌ స్టేషన్‌కు వచ్చి సదరు న్యాయవాదిపై తప్పుడు ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు విచారించకుండానే న్యాయవాదిపై కేసు నమోదు చేశారు. ఈ విషయాన్ని న్యాయవాది, బీబీఏ కార్యవర్గ సభ్యులకు చెప్పగా.. వారు పోలీస్‌ కమిషనర్‌కు ఫోన్‌లో తెలిపారు. దీనిపై తగు చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చి, ఆ మాట నిలబెట్టుకోకపోవడంతో న్యాయవాదులు బీబీఏ హాలులో సోమవారం ఉదయం సమావేశమయ్యారు. భవానీపురం సీఐ ఉమర్‌, ఏఎస్‌ఐ గంగాధర్‌లను తక్షణమే సస్పెండ్‌ చేయాలని, బాధిత కుటుంబానికి రక్షణ కల్పించాలని డిమాండ్‌ చేశారు. న్యాయస్థానాల ప్రాంగణం నుంచి ర్యాలీగా అయిదో నెంబరు రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. ఒక్కసారిగా వందల సంఖ్యలో న్యాయవాదులు రోడ్డుపైకి రావడంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. దాదాపు ఐదు గంటల పాటు న్యాయవాదులు ఆందోళన చేపట్టారు.

సీఐపై చర్యలకు పోలీస్‌ కమిషనర్‌ హామీ.. నగర పోలీస్‌ కమిషనర్‌ కాంతి రాణా టాటాను సోమవారం కలవగా.. భవానీపురం సీఐపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారని బీబీఏ ప్రధాన కార్యదర్శి గంధం శ్రీనివాస్‌ తెలిపారు. న్యాయవాదిపై పెట్టిన కేసు తీసివేస్తామని హామీ ఇచ్చారని పేర్కొన్నారు. పోలీసులపై చర్యలు తీసుకునే వరకు న్యాయవాదులు తమ విధులకు గైర్హాజరై.. ఆందోళనలు కొనసాగిస్తామని ఆయన వెల్లడించారు.

కేసు అమానుషం.. బాధితుడైన న్యాయవాదిపై కేసు నమోదు అమానుషమని ఇండియన్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ లాయార్స్‌(ఐఏఎల్‌) జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర బార్‌ కౌన్సిల్‌ సభ్యుడు చలసాని అజయ్‌కుమార్‌ ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

సెలవుపై భవానీపురం సీఐ?

ఈనాడు, అమరావతి: భవానీపురం సీఐ ఉమర్‌ సెలవుపై వెళ్లినట్లు తెలిసింది. న్యాయవాదుల ఆందోళన నేపథ్యంలో విషయం పెద్దది కాకుండా ఉండేందుకు సీఐను సెలవుపై పంపించినట్లు సమాచారం.  ఈ నేపథ్యంలో స్టేషన్‌లో జరుగుతున్న వ్యవహారాలు, సీఐ గురించి రహస్యంగా విచారణ నిర్వహిస్తున్నట్లు తెలిసింది. సున్నితమైన అంశం పెద్దది కాకుండా చూడడంలో వైఫల్యం చెందినట్లు అంచనా వేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని