logo

రెవెన్యూ వినతులే ఎక్కువ

విజయవాడ కలెక్టరేట్‌లోని పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో కలెక్టర్‌ ఎస్‌.డిల్లీరావు నేతృత్వంలో సోమవారం నిర్వహించిన స్పందన కార్యక్రమంలో మొత్తం 81 వినతులు స్వీకరించారు.

Published : 21 Mar 2023 04:48 IST

ప్రజా సమస్యలు తెలుసుకుంటున్న కలెక్టర్‌ డిల్లీరావు. వేదికపై జేసీ శ్రీవాస్‌ నుపుర్‌, డీఆర్వో మోహన్‌కుమార్‌

ఎన్టీఆర్‌ కలెక్టరేట్‌, న్యూస్‌టుడే : విజయవాడ కలెక్టరేట్‌లోని పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో కలెక్టర్‌ ఎస్‌.డిల్లీరావు నేతృత్వంలో సోమవారం నిర్వహించిన స్పందన కార్యక్రమంలో మొత్తం 81 వినతులు స్వీకరించారు. వీటిలో రెవెన్యూ శాఖకు సంబంధించి ఎక్కువగా 25 వినతులు అందాయి. పోలీస్‌ శాఖకు 16, మున్సిపల్‌ 14, ఏపీ ఎస్పీడీసీఎల్‌  4, వైద్య శాఖ 3, వ్యవసాయ, పంచాయతీ రాజ్‌, విద్య, గృహ నిర్మాణ సంస్థ, గ్రామ/వార్డు సచివాలయాలు, సర్వే శాఖలకు రెండేసి, పౌర సరఫరాలు, డీఆర్డీఏ, డ్వామా, ఐసీడీఎస్‌, ఆర్టీసీ, ఉపాధి కల్పన, రిజిస్ట్రేషన్‌ శాఖలకు ఒక్కొక్క అర్జీ చొప్పున వచ్చాయి. జేసీ శ్రీవాస్‌ నుపుర్‌ అజయ్‌, జిల్లా రెవెన్యూ శాఖ అధికారి మోహన్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

ఉద్యోగాల పేరిట మోసం

విజయవాడ సూర్యారావుపేట పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ‘డైల్‌’ ఇనిస్టిట్యూట్‌ను ఏర్పాటు చేసి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాల్లోనూ, విదేశాల్లోనూ ఉద్యోగాలను ఇప్పించే పేరిట నిరుద్యోగుల నుంచి సొమ్ము వసూలు చేసి, బోర్డు తిప్పేసిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని, బాధితులు స్పందనలో ఫిర్యాదు చేశారు. తాము చెల్లించిన డబ్బును ఇప్పించాలని కోరారు.

ధాన్యం డబ్బు కోసం..

కొండపల్లి శాంతినగర్‌లోని బీఎస్‌ ఆగ్రో మిల్లుకు ధాన్యం తోలిన తమకు ఇంకా సొమ్ము జమ కాలేదని జి.కొండూరు మండలం కవులూరుకు చెందిన పలువురు రైతులు మరోసారి స్పందనలో ఫిర్యాదు చేశారు. 24 గ్రామాలకు చెందిన వారు సదరు మిల్లుకు ధాన్యం విక్రయిచారని, కొందరికే చెల్లింపులు చేస్తున్నట్టు తెలిపారు. 40 నుంచి 50 వరకు బియ్యం లోడులు బయటకు వెళ్లినా.. తమకు డబ్బులు మాత్రం ఇవ్వడం లేదని వినతి పత్రంలో పేర్కొన్నారు.

2019 నాటి సొమ్ము అందలేదు

తమకు 2019 సంవత్సరం రబీలో కొణతమాత్మకూరు సొసైటీ ద్వారా జగ్గయ్యపేట మండలం అనుమంచిపల్లి మిల్లుకు ధాన్యం తోలగా, డబ్బులు జమ కాలేదని.. నందిగామ మండలం దాములూరుకు చెందిన చింతోటి కృష్ణారావు ఫిర్యాదు చేశారు. తనకు రూ.2.20 లక్షల వరకు రావాల్సి ఉందని, గ్రామంలో మరో ఇద్దరు రైతులదీ ఇదే పరిస్థితి అని వివరించారు.

అమ్మను చూసే వారు లేరు..

విజయవాడ గ్రామీణ మండలం నున్న మామిడి పాకల ప్రాంతానికి చెందిన సాతులూరి వెంకటేశ్వరమ్మ (90)కు నలుగురు కుమారులు, ఇద్దరు కూతుళ్లు. ఆడ పిల్లలు పెళ్లిళ్లు అయి వెళ్లిపోగా, నలుగురు కొడుకులు ఉన్నా.. తనను చూడడం లేదని కలెక్టర్‌కు తన గోడు వెళ్లబోసుకుంది. సబ్‌ కలెక్టర్‌ కార్యాలయంలో వృద్ధ తల్లిదండ్రుల సంరక్షణ విభాగంలో ఫిర్యాదు చేయాలని జిల్లా అధికారుల నుంచి సూచనలు వచ్చాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు