logo

అక్రమాలపై.. నోరు విప్పండి

‘జిల్లా నుంచి పెద్దఎత్తున ఇసుక హైదరాబాద్‌కు తరలిపోతోంది. అక్రమ తవ్వకాలు జోరుగా సాగుతున్నాయి. మట్టి తవ్వకాలకు కొదువలేదు. రోజుకో అవినీతి వెలుగు చూస్తోంది. మీరేం చేస్తున్నారు.

Updated : 25 Mar 2023 04:35 IST

జిల్లా నేతలకు చంద్రబాబు హితవు
ఈనాడు, అమరావతి

‘జిల్లా నుంచి పెద్దఎత్తున ఇసుక హైదరాబాద్‌కు తరలిపోతోంది. అక్రమ తవ్వకాలు జోరుగా సాగుతున్నాయి. మట్టి తవ్వకాలకు కొదువలేదు. రోజుకో అవినీతి వెలుగు చూస్తోంది. మీరేం చేస్తున్నారు. అవినీతిపై పోరాటం చేయకుండా మౌనంగా ఉంటే ఎలా..? ప్రజల్లోకి ఎలా వెళతాం.. ఎన్నో ప్రజా సమస్యలు ఉన్నాయి.. వాటిపై దృష్టి సారించాలి..’ అంటూ ఎన్టీఆర్‌, కృష్ణా జిల్లాల తెదేపా నేతలకు అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు చురకలంటించారు. నేతల పనితీరుపై ఆయన కొంత అసంతృప్తి వ్యక్తం చేశారు. కేవలం పార్టీ సంస్థాగత నిర్మాణం మాత్రమే కాకుండా వివిధ అవినీతి అక్రమాలపై దృష్టి సారించాలని సూచించారు. అధికార పార్టీ వైఫల్యాలను ఎప్పటికప్పుడు ఎండగట్టాలని సూచనలు చేశారు. అవినీతి జరుగుతున్నా.. కృష్ణా జిల్లా నేతలు చూస్తూనే ఉన్నారని అసంతృప్తి వ్యక్తం చేశారు. తెదేపా జోన్‌ 3 సమీక్ష సమావేశం శుక్రవారం మంగళగిరిలోని సీకే కన్వెన్షన్‌ హాలులో జరిగింది. వివిధ అంశాలపై రెండు జిల్లాల్లో ఇన్‌ఛార్జులకు, యూనిట్‌, క్లస్టర్‌, సెక్షన్‌ ఇన్‌ఛార్జులకు అవగాహన కల్పించారు. శిక్షణ ముగించే సమయంలో చంద్రబాబు ప్రసంగిస్తూ.. కృష్ణా జిల్లా నేతల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘కృష్ణా జిల్లాలో ఇసుక సమస్య తీవ్రంగా ఉంది. సామాన్యులకు ఇసుక అందే పరిస్థితి లేదు. అక్రమంగా తవ్వకాలు చేస్తున్నారు. రాజధానికి తరలిస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో ఇసుక రీచ్‌ల నుంచి పెద్దఎత్తున దోపిడీ జరుగుతోంది. ఇంత జరుగుతున్నా.. మీరేం చేస్తున్నా’రంటూ.. ఇన్‌ఛార్జులు, మాజీ ఎమ్మెల్యేల వైపు చూస్తూ తీవ్రంగా ప్రశ్నించారు. కార్యకర్తలతో కలిసి ఇసుక దోపిడీపై పోరాటాలు చేయాలని ఆదేశించారు. ఇసుకకే కాదు.. అవినీతి సమస్యలన్నింటిపై గట్టిగా పోరాటం చేయాలని హితవు పలికారు. ‘బందరు పోర్టు కోసం ఎన్నో రోజులు పోరాడాం. మన హయాంలో శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించాం. నాలుగేళ్లుగా నిర్మాణం చేయకుండా ఇప్పుడు శంకుస్థాపన అంటూ వైకాపా నేతలు హడావుడి చేస్తున్నారు’ దీనిపై ఆందోళనలు చేసి ప్రజలకు ఫలాలు అందించేలా కృషి చేయాలని’ వివరించారు.

మైలవరం ప్రథమ స్థానం...

ఓటర్ల జాబితా పరిశీలనలో మైలవరం ప్రథమ స్థానంలో నిలిచింది. దీనిపై అభినందనలు తెలిపారు. దొంగ ఓట్లను నిరోధించాలని చంద్రబాబు సూచించారు. మైలవరం స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు. గత ఎన్నికల్లో ఓటర్ల జాబితాను సరి చూసుకోకపోవడం వల్లనే ఓడిపోయామని నేతలు అభిప్రాయపడ్డారు. ఆధార్‌ అనుసంధానం ద్వారా అక్రమాలను అరికట్టాలని హితబోధ చేశారు. ‘ఇదేం ఖర్మ’ రాష్ట్రానికి అన్ని గ్రామాల్లో నిర్వహించాలని నిర్ణయించారు. గుడివాడకు చెందిన ఎన్‌ఆర్‌ఐ, తెదేపా నాయకుడు వెనిగండ్ల రాముతో చంద్రబాబు ప్రత్యేకంగా ముచ్చటించారు. నియోజకవర్గంలో చేస్తున్న సేవా కార్యక్రమాలను అడిగి తెలుసుకున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని