logo

దళిత ప్రజాప్రతినిధులకు అవమానం

మండలంలోని లక్ష్మీపురంలో రూ.35 లక్షల వ్యయంతో నిర్మించిన విద్యుత్తు శాఖ కొత్త కార్యాలయ భవన ప్రారంభోత్సవంలో దళిత ప్రజాప్రతినిధులకు అవమానం జరిగింది.

Published : 01 Jun 2023 05:19 IST

విద్యుత్తు శాఖ కార్యాలయ ప్రారంభోత్సవంలో ఘటన

జడ్పీటీసీ సభ్యుడు రామచంద్రారెడ్డితో కలిసి కార్యాలయాన్ని ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే రక్షణనిధి

తిరువూరు, న్యూస్‌టుడే: మండలంలోని లక్ష్మీపురంలో రూ.35 లక్షల వ్యయంతో నిర్మించిన విద్యుత్తు శాఖ కొత్త కార్యాలయ భవన ప్రారంభోత్సవంలో దళిత ప్రజాప్రతినిధులకు అవమానం జరిగింది. బుధవారం సర్పంచి గొల్లమందల శ్రీనివాసరావు, ఎంపీటీసీ సభ్యురాలు మామిడి కోటేశ్వరి, ఎంపీపీ గద్దల భారతి లేకుండానే అధికారులు ఎమ్మెల్యే రక్షణనిధితో కార్యలయాన్ని ప్రారంభోత్సవం చేయించారు. ఏఎంసీ ఛైర్మన్‌ ఎస్‌.నాగనర్సిరెడ్డి, జడ్పీటీసీ సభ్యులు వై.రామచంద్రారెడ్డి, బి.లోకేశ్వరరెడ్డి, పీఏసీఎస్‌ ఛైర్మన్‌ టి.నవీన్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు. కాగా అధికారుల తీరుపై ముగ్గురు ప్రజాప్రతినిధులు మండిపడుతున్నారు. తమ గ్రామంలో ట్రాన్స్‌ఫార్మర్‌ సమస్యపై సాయంత్రం ఏఈకి తాను ఫోన్‌ చేస్తే, కార్యాలయ ప్రారంభోత్సవ హడావిడిలో ఉన్నామన్నారని, అదేంటి నాకు ఆహ్వానం లేదా అని అడిగితే, మీరూ రండని సమాధానం ఇచ్చారని సర్పంచి శ్రీనివాసరావు ఆవేదన వ్యక్తం చేశారు. తనకు సాయంత్రం 4 గంటలకు ఫోన్‌ చేసి ఎమ్మెల్యే వస్తున్నారు త్వరగా రమ్మని ఏఈ చెప్పారని, తాము వెళ్లే సరికి ప్రారంభోత్సవం పూర్తయిందని ఎంపీటీసీ సభ్యురాలు కోటేశ్వరి ఆవేదన వ్యక్తం చేశారు. చివరకు ఎంపీపీ భారతికి సాయంత్రం 3 గంటల తర్వాతే ఏఈ ఫోన్‌ చేసి సమాచారం ఇచ్చారన్నారు. దళిత ఎమ్మెల్యే ప్రాతినిధ్యం వహిస్తున్న ఎస్సీ రిజర్డ్వ్‌ నియోజకవర్గంలో తరచూ దళిత ప్రజాప్రతినిధులను అవమానించడం అధికారులకు పరిపాటిగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా సీఎం తిరువూరు పర్యటనలోనూ మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌ గత్తం కస్తూరిబాయికి ఇలాంటి అనుభవమే ఎదురైంది. బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని దళిత సంఘాల నాయకులు డిమాండ్‌ చేశారు. దీనిపై ఏడీఈ రామకృష్ణను న్యూస్‌టుడే వివరణ కోరగా ప్రజాప్రతినిధులను ఆహ్వానించే బాధ్యతను ఏఈకి అప్పగించినట్లు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని