logo

వైకాపాలో భగ్గుమన్న విభేదాలు

ఎన్టీఆర్‌ జిల్లా తిరువూరులో వైకాపాలో వర్గ విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. పురపాలక సంఘం ఛైర్మన్‌ పదవి మార్పిడి వ్యవహారం వర్గ పోరును రాజేసింది.

Published : 01 Jun 2023 05:19 IST

కౌన్సిల్‌ సమావేశానికి అధికారపక్ష సభ్యుల గైర్హాజరు

తిరువూరు, న్యూస్‌టుడే: ఎన్టీఆర్‌ జిల్లా తిరువూరులో వైకాపాలో వర్గ విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. పురపాలక సంఘం ఛైర్మన్‌ పదవి మార్పిడి వ్యవహారం వర్గ పోరును రాజేసింది. ఛైర్మన్‌ పదవికి సంబంధించి రెండేళ్ల ఒప్పందం అమలు చేయకపోవడంతో పురపాలక సంఘం సమావేశం వేదికగా ఛైర్‌పర్సన్‌ గత్తం కస్తూరిబాయి వ్యతిరేక వర్గీయులు తమ అసమ్మతిని తెలియజేశారు. స్థానిక పురపాలక సంఘం కార్యాలయంలో బుధవారం ఛైర్‌పర్సన్‌ అధ్యక్షతన ఉదయం 11 గంటలకు సమావేశం ఏర్పాటు చేశారు. మొత్తం 20 మంది సభ్యులకుగాను అధికార పార్టీకి చెందిన 17 మందిలో ఛైర్‌పర్సన్‌తో కలిసి ఎనిమిది మంది మాత్రమే సమావేశానికి హాజరయ్యారు. పురపాలిక మార్గదర్శకాల మేరకు కోరం ఉండాలంటే 11 మంది సభ్యులు రావాల్సి ఉంది. సమావేశ మందిరం బయట నిరీక్షిస్తున్న ముగ్గురు ప్రతిపక్ష (తెదేపా) సభ్యులను సమావేశ మందిరంలోకి రావాలని ఛైర్‌పర్సన్‌ పలుమార్లు కోరినా వారు నిరాకరించారు. కోరం పూర్తయితేనే తాము సమావేశానికి హాజరవుతామని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో అధికార పక్ష సభ్యులు తమ సభ్యులకు ఫోన్‌ చేసి రావాలని విజ్ఞప్తి చేసినా వారి నుంచి కూడా స్పందన రాలేదు. మధ్యాహ్నం 12 గంటల వరకు నిరీక్షించినా అధికార పార్టీకి చెందిన మిగిలిన తొమ్మిదిమంది సభ్యులు రాకపోవడంతో చేసేది లేక  ఛైర్‌పర్సన్‌ సమావేశాన్ని వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. దీనిపై ప్రతిపక్ష తెదేపా ఫ్లోర్‌ లీడర్‌ షేక్‌ అబ్దుల్‌హుస్సేన్‌, సభ్యులు నాళ్లా సురేంద్ర, జీడిమళ్ల సత్యవతి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. తాగునీటి ఎద్దడి, పడకేసిన పారిశుద్ధ్యంతో పట్టణవాసులు ఇబ్బందులు పడుతుంటే పదవుల కోసం అధికార పక్ష సభ్యులు కొట్టుకోవడం సిగ్గుచేటన్నారు. మరోవైపు పురపాలిక కమిషనర్‌ దీర్ఘకాలిక సెలవుపై వెళ్లగా మేనేజరు, శానిటరీ ఇన్‌స్పెక్టర్‌, ఏఈ, టీపీవో పోస్టులు ఖాళీగా ఉండటంతో పాలన పడకేసిందని మండిపడ్డారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని