logo

ఎందుకీ నిర్లక్ష్యం?

తెదేపా వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి దివంగత ఎన్టీఆర్‌ 1987లో పేదలకు నాణ్యమైన ఉన్నత విద్యను అందించాలనే ఉద్దేశంతో పామర్రు మండలం నిమ్మకూరులో నందమూరి లక్ష్మయ్య వెంకట్రావమ్మ సంస్మరణ గురుకుల వృత్తి విద్యా పాఠశాల, కళాశాల భవనాలు శిథిలావస్థకు చేరి నిర్లక్ష్యానికి గురయ్యాయి.

Published : 01 Jun 2023 05:19 IST

కూలడానికి సిద్ధంగా గురుకుల కళాశాల భవనాలు
చోద్యం చూస్తున్న అధికారులు

శిథిలావస్థలో బాలుర వసతి గృహం వెనుకభాగం

నిమ్మకూరు(గ్రామీణ పామర్రు), న్యూస్‌టుడే: తెదేపా వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి దివంగత ఎన్టీఆర్‌ 1987లో పేదలకు నాణ్యమైన ఉన్నత విద్యను అందించాలనే ఉద్దేశంతో పామర్రు మండలం నిమ్మకూరులో నందమూరి లక్ష్మయ్య వెంకట్రావమ్మ సంస్మరణ గురుకుల వృత్తి విద్యా పాఠశాల, కళాశాల భవనాలు శిథిలావస్థకు చేరి నిర్లక్ష్యానికి గురయ్యాయి. రాష్ట్రంలో ఎంతోమందికి విద్యాబుద్ధులు నేర్పిన ఈ చదువుల గుడి గోడలు బలహీనమై శ్లాబ్‌ పెచ్చులూడుతుండటంతో విద్యార్థులు, అధ్యాపకులు భయబ్రాంతులకు గురవుతున్నారు. పెను ప్రమాదం సంభవించకముందే అధికారులు నూతన భవనాలకు నిధులు మంజూరు చేసి నిర్మాణాలు చేపట్టాలని పలువురు కోరుతున్నారు.

ఇంటర్మీడియట్‌ విద్య కోసం 1987 నుంచి 1989 వరకు ఎన్టీఆర్‌ గృహ సముదాయంలో తరగతి గదుల నిర్వహణ, విద్యార్థులకు భోజన వసతి సౌకర్యాలు అందించారు. ఆతరువాత 1990 నుంచి 1992 వరకు ఈ గురుకులానికి సుమారు రూ.3 కోట్ల వ్యయంతో 16.5 ఎకరాల స్థలంలో పక్కా భవనాలు ఏర్పాటు చేశారు. దీంతో 5వ తరగతి నుంచి ఇంటర్‌ వరకు విద్య, వసతి, భోజన సదుపాయాలు అందుబాటులోకి వచ్చాయి. రాష్ట్రం మొత్తం మీద ఉన్న గురుకుల కళాశాలల్లో ఇంటర్మీడియట్‌ ఒకేషనల్‌ కోర్సు ఉన్నది నిమ్మకూరులోనే కావడంతో కోస్తాంధ్రా, రాయలసీమకు చెందిన 13 జిల్లాల నుంచి విద్యార్థులు ఇక్కడకువచ్చి విద్యాబుద్ధులు నేర్చుకుంటున్నారు. ఇప్పటి వరకు 18 బ్యాచ్‌లు పూర్తవగా దాదాపు 5,600 మంది చదువుకున్నారు. వాటిలో 14 బ్యాచ్‌లు నూరు శాతం ఉత్తీర్ణత సాధించడం విశేషం. ప్రస్తుతం సుమారు 300 మంది విద్యార్థులు చదువుతున్నారు.

పెచ్చులూడుతున్న శ్లాబ్‌తో ప్రమాదకరంగా తరగతి గది

మూత పడిన గదులు: కళాశాల భవన సమదాయాల్లో కొన్ని గదుల శ్లాబులు పెచ్చులూడటం, గోడలు పగుళ్లివడంతో ఎవర్నీ అందులోకి వెళ్లనీయకుండా ఆరు గదులకు గత ఏడాదే తాళాలు వేశారు. అప్పట్లో సిబ్బంది విశాంతి గది పైకప్పు పెచ్చులూడటంతో ఓ అధ్యాపకురాలికి గాయాలయ్యాయి. బాలుర వసతి గృహ భవనం గోడలు బీటలు వారి పైకప్పు ఇనుప చువ్వలు బయటకు కన్పిస్తున్నాయి. దీంతో ఏడాది కిందట ఓ ఇంజినీర్‌ సందర్శించి భవనాల స్థితిగతులు పరిశీలించారు. వీటిలో కొన్ని కూలేందుకు ఆస్కారం ఉందని కళాశాల బాధ్యులకు సూచించారు.

కార్యరూపం దాల్చని ప్రతిపాదనలు: కళాశాలలో దెబ్బతిన్న కొన్ని భవనాలను అధికారులు నాడు-నేడులో గుర్తించారు. వాటి మరమ్మతులకు సుమారు రూ.70 లక్షలతో ప్రతిపాదనలు చేశారు. కానీ ఇంతవరకు నిధులు మంజూరు కాలేదు. కొద్ది రోజుల్లో విద్యా సంవత్సరం ఆరంభం కానుంది.

ఇప్పటివరకు ఎలాంటి మరమ్మతులు చేపట్టలేదు. కొత్త భవనాల ఊసేలేదు. సంబంధిత శాఖ అధికారులు వీటిపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని