logo

పొగాకు ఉత్పత్తుల వాడకంతో అనర్థం

పొగాకు ఉత్పత్తుల వినియోగంతో ఊపిరితిత్తులు దెబ్బతినడమే కాకుండా క్యాన్సర్‌ వంటి భయంకరమైన వ్యాధుల బారిన పడి ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందని కలెక్టర్‌ ఎస్‌.డిల్లీరావు పేర్కొన్నారు.

Published : 01 Jun 2023 05:19 IST

ర్యాలీలో కలెక్టర్‌ డిల్లీరావు, ఎమ్మెల్సీ రుహుల్లా, నగర మేయర్‌ రాయన భాగ్యలక్ష్మి, డీఎంహెచ్‌వో సుహాసిని తదితరులు

విజయవాడ పాతాసుపత్రి, న్యూస్‌టుడే : పొగాకు ఉత్పత్తుల వినియోగంతో ఊపిరితిత్తులు దెబ్బతినడమే కాకుండా క్యాన్సర్‌ వంటి భయంకరమైన వ్యాధుల బారిన పడి ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందని కలెక్టర్‌ ఎస్‌.డిల్లీరావు పేర్కొన్నారు. బుధవారం ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో విజయవాడ పాత ప్రభుత్వ ఆసుపత్రి నుంచి నిర్వహించిన అవగాహన ర్యాలీని కలెక్టర్‌ పచ్చ జెండా ఊపి ప్రారంభించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ.. ఊపిరితిత్తుల క్యాన్సర్‌ వ్యాధులకు కారణమైన పొగాకు, గుట్కా, ఖైనీ వంటి వాటికి దూరంగా ఉండాలన్నారు. వాటిపై ప్రజలను చైతన్యమంతం చేయాలని అధికారులకు సూచించారు. పొగాకు ఉత్పత్తులను వినియోగించే వారిలో అవయవాలు పాడై నిత్యం దేశ వ్యాప్తంగా సగటున 3500 మరణాలు సంభవిస్తున్నాయన్నారు. విద్యా సంస్థల సమీపంలో పొగాకు ఉత్పత్తుల విక్రయాలు చేయకూడదనే నిబంధనను జిల్లా వ్యాప్తంగా అమలు చేస్తున్నట్లు వివరించారు. యువతీయువకుల అలవాట్లను తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు గమనించాలని విజ్ఞప్తి చేశారు. పొగాకు ఉత్పత్తులకు బానిసలైన వారు మానుకునేందుకు అవసరమైన కౌన్సెలింగ్‌ జిల్లా ఆసుపత్రి, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఇవ్వనున్నట్లు చెప్పారు. ఆన్‌లైన్‌ ద్వారా కౌన్సెలింగ్‌ ఇవ్వడం జరుగుతుందని, ఇందుకు 18004252024 టోల్‌ఫ్రీ నంబర్‌ ఏర్పాటు చేశామని వెల్లడించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఎండీ రుహుల్లా, నగర మేయర్‌ రాయన భాగ్యలక్ష్మి, డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ ఎం.సుహాసిని, ఎన్‌టీపీఎస్‌ స్టేట్‌ నోడల్‌ అధికారి జి.శ్రీనివాసరెడ్డి, టోబాకో లీగల్‌ కన్సల్టెంట్‌ జి.శివ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని