logo

కూత లేదు.. కన్నీటి వెతలే

విజయవాడ మీదుగా విశాఖ, ఒడిశా వైపు వెళ్లే పలు రైళ్లు రద్దు చేశారు. విశాఖ నుంచి వచ్చే చెన్నై, బెంగళూరు రైళ్లు చాలా ఆగిపోయాయి.

Published : 04 Jun 2023 03:58 IST

విజయవాడ మీదుగా విశాఖ, ఒడిశా వైపు వెళ్లే పలు రైళ్లు రద్దు చేశారు. విశాఖ నుంచి వచ్చే చెన్నై, బెంగళూరు రైళ్లు చాలా ఆగిపోయాయి. దీంతో ప్రయాణికులు రోజంతా నిరీక్షించగా.. వేసవి వేళ వారి అవస్థలు వర్ణనాతీతం.

ఈనాడు- అమరావతి, భవానీపురం- న్యూస్‌టుడే

అంత్యక్రియలకు వెళ్లేదెలా: ఉదయ్‌కుమార్‌, విజయవాడ

మాది విజయవాడ.. మధురానగర్‌. మా దగ్గరి బంధువు చెన్నైలో చనిపోయారు. విషయం తెలియగానే బయలుదేరి రైల్వేస్టేషన్‌కు వచ్చేశాం. మేం ఎనిమిది మందిమి ఉన్నాం. మేం వెళితే తప్ప.. అంత్యక్రియలు నిర్వహించరు. ఏం చేయాలో తెలియక ఏదో ఒక రైలు వస్తుందని ఉదయం నుంచి ఎదురుచూస్తున్నాం. మధ్యాహ్నం వరకూ ఒక్క రైలూ రాలేదు. ఎంత ఆలస్యమైనా ఇక్కడే ఉండి రైలులోనే చెన్నై వెళతాం. మాకు ఇంకో దారి లేదు.

అత్యవసరమైనా ఆగిపోయా: కిషోర్‌ చంద్ర(కటక్‌)

మాది కటక్‌. ఎనికేపాడులో ఒక కంపెనీలో పని చేస్తున్నా. కుటుంబసభ్యులను పరామర్శించేందుకు అత్యవసరంగా వెళ్లాలి. అటువైపు వెళ్లే రైలు కోసం శనివారం ఉదయం నుంచి ప్రయత్నిస్తున్నా ఫలితం లేదు. గంటల తరబడి స్టేషన్‌లోనే వేచి ఉన్నాను. ఎప్పుడు వెళ్తానో తెలియని పరిస్థితిగా ఉంది.

ఉద్యోగంలో చేరేదెలా..

విఠల్‌, బసవరాజ్‌, ప్రజ్వల్‌(కర్ణాటక)

మేము కర్ణాటక వాళ్లం. నావికాదళంలో ఉద్యోగాలకు ఎంపికయ్యాం. భువనేశ్వర్‌లో ఉద్యోగానికి రిపోర్టు చేయాలి. కర్ణాటక నుంచి శుక్రవారం రాత్రి విజయవాడ వచ్చాం. ఆ సమయంలో ఏవిధమైన రైళ్లు లేవు. శనివారం ఉదయం స్టేషన్‌కు వచ్చే సరికి రైళ్లు పూర్తిగా రద్దవడంతో ఏం చేయాలో అర్ధం కావటం లేదు.  

బిడ్డను చూడాలని

నిపున్‌(ఒడిశా)

నేను విజయవాడలో కార్మికుడిని. మాది ఒడిశా రాష్ట్రంలోని కెందుకా ప్రాంతం. నా కుమార్తె లక్ష్మీ అస్వస్థతకు గురైందనే సమాచారం వచ్చింది. ఆమె ఆసుపత్రిలో ఉంది. తనను చూసేందుకు అత్యవసరంగా వెళ్లాలి. గంటల తరబడి వేచి ఉన్నా విశాఖ వైపు వెళ్లే రైళ్లేవి రావటం లేదు.

ఉదయం 10 గంటలకు బోసిపోయిన విజయవాడ రైల్వే స్టేషన్‌

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని