logo

Andhra pradesh news: సీఎం నా బామ్మర్దే... ఎవరేం చేస్తారో చూస్తా!

ప్రభుత్వం మనదే. సీఎం మనవాడే..అడిగే దమ్ము, ధైర్యం ఎవరికి ఉంటుందంటూ అధికార వైకాపా నాయకులు చేస్తున్న దౌర్జన్యం అంతా ఇంతా కాదు.

Updated : 08 Jun 2023 16:24 IST

వైకాపా నాయకుడి దౌర్జన్య కాండ
అనుమతులు లేవంటున్న అధికారులు

అనుమతులు లేకుండా తవ్వుతూ..

చినలింగాల(నందివాడ), న్యూస్‌టుడే: ప్రభుత్వం మనదే. సీఎం మనవాడే..అడిగే దమ్ము, ధైర్యం ఎవరికి ఉంటుందంటూ అధికార వైకాపా నాయకులు చేస్తున్న దౌర్జన్యం అంతా ఇంతా కాదు. ఇదే తరహాలో పేరు వెనుక రెడ్డి అని తగిలించుకున్న వ్యక్తి..‘సీఎం తన బామ్మర్దే’నంటూ మండలంలో చేస్తున్న అరాచకాలు అన్నీ ఇన్నీ కావు. సదరు వ్యక్తి నందివాడ మండలంలోని చినలింగాలలో ఎటువంటి అనుమతులు లేకుండా అడ్డగోలుగా చేపల చెరువులు తవ్వుతున్నాడు. ఇంత జరుగుతున్నా మత్య్స, రెవెన్యూ శాఖల అధికారులు అటువైపు కన్నెత్తి చూడడం లేదు.

ఈ ఏడాది ఫిబ్రవరిలోనూ సదరు వ్యక్తి ఈ ప్రాంతానికి చెందిన ముఖ్యమైన ప్రజాప్రతినిధి మాటున ఎటువంటి అనుమతులు లేకుండా అరిపిరాలలో 50, 60 ఎకరాల్లో చేపల చెరువులు తవ్వాడు. అంతేకాకుండా తవ్విన మట్టిని 3 నెలల పాటు టిప్పర్లతో అక్రమంగా పట్టణంలోని ప్రయివేటు వెంచర్లకు తరలించి రూ.కోట్లు కూడబెట్టాడన్న ఆరోపణలు వచ్చాయి. ఈ విషయంపై ఊరూవాడా అల్లరి కావడం, పత్రికల్లో కథనాలు రావడంతో అప్పటి తహసీల్దార్‌ దీర్ఘకాలిక వైద్య సెలవులోకి వెళ్లారు.  

అలుసుగా తీసుకుని.. మరోసారి!

అదే వ్యక్తి ఇప్పుడు చినలింగాలలో 30, 40 ఎకరాల్లో అనుమతులు లేకుండా అక్రమంగా చేపల చెరువుల తవ్వుతున్నాడు. ఈ క్రమంలో అరిపిరాలలో ఎవడు ఆపాడు...ఇప్పుడు మాత్రం తనని ఏమి చేస్తారని కింది స్థాయి ఉద్యోగులను బెదిరిస్తున్నట్లు తెలిసింది. ఈ భూములకు చుట్టూ మరో 4, 5 ఎకరాలు ప్రభుత్వ పోరంబోకు, కాలువ భూములు ఉన్నాయని కూడా చెబుతున్నారు. ఇతని అడ్డగోలు తవ్వకాలతో పక్కన రైతులు తమ భూములు ఇక ఎందుకూ పనికిరావని లబోదిబోమంటున్నారు. ఈనెల 9న ముఖ్యమంత్రి గుడివాడ పర్యటన కూడా ఉండటంతో జిల్లా కలెక్టర్‌, ఇతర ఉన్నత స్థాయి అధికారులు రోజూ ఈ ప్రాంతంలోనే పర్యటిస్తున్నారు. అయినప్పటికీ స్థానిక అధికారులు చేతులు కట్టుకుని సదరు అధికార పార్టీ నాయకుడికి మోకరిల్లడంపై ప్రజలు మండిపడుతున్నారు. దీనిపై మత్య్సశాఖ ఎఫ్‌డీవో రవికుమార్‌ను వివరణ కోరగా 2020 తర్వాత చేపల చెరువులకు సడా చట్టం వచ్చిందని, దీని ప్రకారం తాము ఎవరికీ అనుముతులు ఇవ్వలేదన్నారు. పూర్వం ఇచ్చినవి ఉన్నా ఏపీ సడా చట్టం ప్రకారం కొత్తగా అనుమతులు తెచ్చుకోవాల్సిందేనని స్పష్టం చేశారు. తహసీల్దార్‌ భవన్నారాయణను వివరణ కోరగా పాత అనుమతులు చూపుతున్నట్లు వీఆర్వో తన దృష్టికి తెచ్చారన్నారు. దీనిపై పరిశీలించి చర్యలు తీసుకుంటామన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని