logo

తాటిచెట్లనూ నరికేశారు

ముఖయమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి పర్యటన కోసమని గుడివాడ సమీపాన మల్లాయపాలెంలోని టిడ్కో కాలనీలో విస్తృత ఏర్పాట్లు చేశారు. ఈ క్రమంలో కాలనీలో హెలిప్యాడ్‌ నిర్మాణానికి అడ్డుగా ఉన్నాయని సుమారు 50కిపైగా తాటి చెట్లను నరికేశారు.

Published : 09 Jun 2023 04:39 IST

సీఎం వెళ్లే దారిలో శిథిల వంతెన కింద ఆధారంగా ఉంచిన ఇనుప నిచ్చెనలు

ముఖయమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి పర్యటన కోసమని గుడివాడ సమీపాన మల్లాయపాలెంలోని టిడ్కో కాలనీలో విస్తృత ఏర్పాట్లు చేశారు. ఈ క్రమంలో కాలనీలో హెలిప్యాడ్‌ నిర్మాణానికి అడ్డుగా ఉన్నాయని సుమారు 50కిపైగా తాటి చెట్లను నరికేశారు. దీంతో పర్యావరణ ప్రేమికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఏఎన్నార్‌ కళాశాలలో ప్రభుత్వం ఇప్పటికే హెలిప్యాడ్‌ నిర్మించిందని.. దాన్ని వినియోగించుకోకుండా అదనంగా ఖర్చు చేయడంతోపాటు పర్యావరణాన్ని కాపాడే చెట్లను నరికేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. అలాగే టిడ్కో కాలనీలోకి వెళ్లే దారిపొడవునా కొత్తగా ఏర్పాటు చేసిన విద్యుత్తు స్తంభాలకు వైకాపా రంగులు వేయడంపై పలువురు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ కార్యక్రమానికి పార్టీ ఆర్భాటాలు ఏమిటని అంటున్నారు. ఒకవైపు కాలనీలో పూర్తికాని మౌలిక వసతులు.. మరో వైపు సీఎం పర్యటన ఏర్పాట్లతో అధికారులు అడకత్తెరలో పోక చెక్కలా నలిగిపోతున్నారు. దీంతో చేసేది లేక ఏర్పాట్లను మమ అనిపిస్తున్నారు. కాలనీలోకి వెళ్లేందుకు రెండు రహదారులున్నప్పటికీ సీఎం సభ వేదికకు కూతవేటు దూరంలో కాల్వలపై ఉన్న వంతెనల వద్ద కలిసిపోతాయి. సభకు వచ్చే వారంతా ఈ ఇరుకు వంతెనలపై ప్రవేశించాలి. ఈ వంతెనలు కూడా శిథిలమవడంతో వాటి కింద సపోర్టు కోసం ఇనుప బల్లలతోకూడిన నిచ్చెనలు అమర్చడంపై పలువురు విస్తుపోతున్నారు.  

కూల్చిన చెట్లు ఇలా..

* లబ్ధిదారుల కోసం మరుగుదొడ్లను పొలాల్లో, కాల్వగట్టుపై ఏర్పాటు చేసి చేతులు దులిపేసుకున్నారు.

* ఇటీవలే స్వచ్ఛ సంకల్పం అని భారీగా ప్రకటనలిచ్చిన సీఎంకు స్వాగతం పలికేందుకు ఎక్కడ చూసినా పర్యావరణానికి హాని కలిగించే భారీ నిషేధిత ఫ్లెక్సీలనే ప్రచార అస్త్రాలుగా వినియోగించారు.ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి పర్యటన వాయిదా పడటం గమనార్హం.

కాల్వ గట్టుపై బురదలో ఏర్పాటు చేసిన మరుగుదొడ్లు

గుడివాడ గ్రామీణం, గుడివాడ (నెహ్రూచౌక్‌), న్యూస్‌టుడే

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని