logo

దిగుబడి తగ్గి.. ధరలు పెరిగి..

మండుతున్న ఎండలు, అకాల వర్షాలకు దిగుబడి తగ్గి కూరగాయల ధరలు రెండు వారాల్లో భారీగా పెరిగాయి. స్థానిక పంటలు అందుబాటులో ఉన్నా మార్కెట్ల డిమాండ్‌కు సరిపడా రావడం లేదు.

Published : 10 Jun 2023 05:34 IST

కొండెక్కిన కూరగాయల రేట్లు
న్యూస్‌టుడే, తోట్లవల్లూరు

మండుతున్న ఎండలు, అకాల వర్షాలకు దిగుబడి తగ్గి కూరగాయల ధరలు రెండు వారాల్లో భారీగా పెరిగాయి. స్థానిక పంటలు అందుబాటులో ఉన్నా మార్కెట్ల డిమాండ్‌కు సరిపడా రావడం లేదు. ఎండలకు భయపడి పంట కోసేందుకు కూలీలు రావడం లేదు. దీంతో ధరలకు రెక్కలొచ్చాయి. టమాటా, మిర్చి ఇతర ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. తోట్లవల్లూరు మండలంలోని పలు గ్రామాల్లో రైతులు కూరగాయలు అమ్ముతుండగా, మిగతా చోట్ల ప్రైవేటు వ్యాపారులు రైతు బజారుల నుంచి, లంకల్లో కూరగాయలు ఉంటే తెచ్చి అమ్ముతుంటారు. టమాటా గత వారంలో కిలో రూ.14 ఉండగా ఇప్పుడు రూ.40కు చేరింది. గత నెలలో కురిసిన అకాల వర్షాలకు బీర, బెండ, దొండ, కాకర పంటలు దెబ్బతిన్నాయి. మరోవైపు అధిక ఉష్ణోగ్రతలకు కాపు సక్రమంగా లేకపోవడంతో వంకాయలు చాలా తక్కువగా వస్తున్నాయి. ఉన్న పంటలు చివరి దశకు చేరుకున్నాయి. దీనివల్ల దిగుబడులు తగ్గి మార్కెట్లకు తగినంత సరఫరా ఉండటం లేదు. రెండు వారాల క్రితం కిలో బెండ రూ.12, దొండ రూ.10 ఉండగా ప్రస్తుతం వాటి ధరలు రూ.22, రూ.20 పలుకుతున్నాయి. కొండెక్కి కూర్చున్న కాయగూరల ధరలతో పేద, మధ్య తరగతి ప్రజలు విలవిల్లాడిపోతున్నారు. ఏవి కొనాలన్నా కిలో కనీసం రూ.20 నుంచి రూ.60 వరకు చెల్లించేల్సిందే. బీన్స్‌ సెంచరీ కొట్టగా, క్యాప్సికమ్‌ రూ.90కు పెరిగింది.

కూలీలు రావడం లేదు

ఎండకు భయపడి పంట కోసేందుకు కూలీలు రావడం లేదు. ఇటీవల కురిసిన వర్షాలకు బీర, బెండ పంటలు దెబ్బతిన్నాయి. వంకాయ కాపు లేదు.

వెంకటేశ్వరరావు, రైతు, తోట్లవల్లూరు

ఏం కొనలేకున్నాం

కాయగూరల ధరలన్నీ పెరుగుతూనే ఉన్నాయి. కూలీ పనులు చేసుకునే మాలాంటి వారి ఆదాయం మాత్రం పెరగడం లేదు. ఏంకొనాలో.. ఏమి తినాలో అర్థం కావడంలేదు. రోజంతా పనిచేస్తే వచ్చే కూలీ రెండు, మూడు రకాల కూరగాయలకే సరిపోతోంది.  

పాముల రాణి, గృహిణి, పాములలంక

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని