logo

మహిళా బిల్లులో ఓబీసీ వాటాపై స్పష్టత ఇవ్వాల్సింద్ఠే

పార్లమెంట్‌ ఆమోదం పొందిన మహిళా బిల్లు (33 శాతం) రిజర్వేషన్‌లో ఓబీసీ మహిళలకు ఎంత కేటాయించారో స్పష్టత ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్‌ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేసన శంకరరావు కేంద్ర ప్రభుత్వానికి డిమాండ్‌ చేశారు.

Updated : 23 Sep 2023 06:17 IST

మాట్లాడుతున్న బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేసన శంకరరావు, పక్కన హనుమంతరావు, ముస్తఫా, ఉమామహేశ్వరరావు, వెంకటేశ్వరరావు, సత్యనారాయణ

లబ్బీపేట(విజయవాడ సిటీ), న్యూస్‌టుడే : పార్లమెంట్‌ ఆమోదం పొందిన మహిళా బిల్లు (33 శాతం) రిజర్వేషన్‌లో ఓబీసీ మహిళలకు ఎంత కేటాయించారో స్పష్టత ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్‌ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేసన శంకరరావు కేంద్ర ప్రభుత్వానికి డిమాండ్‌ చేశారు. విజయవాడలోని బీసీ ఉద్యోగుల సంఘ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన సంఘ సమావేశంలో ఆయన మాట్లాడుతూ... మూడు దశాబ్దాల కిందటే మహిళా రిజర్వేషన్‌ బిల్లు పార్లమెంట్‌లో ప్రవేశపెట్టారని గుర్తు చేశారు. బిల్లులో ఓబీసీ మహిళలకు ఎంత వాటా కేటాయిస్తున్నారో స్పష్టత ఇవ్వాలని ములాయంసింగ్‌ యాదవ్‌, లాలూ ప్రసాద్‌ యాదవ్‌ తదితర రాజకీయ పార్టీ నేతలు నిలదీయడంతో బిల్లు ఆమోదించ లేదన్నారు. అప్పటి నుంచి బీసీ సంఘాలు వివిధ రూపాల్లో ఉద్యమాలు చేస్తూనే ఉన్నాయని వివరించారు. వాటిని పట్టించుకోకుండా భాజపా ప్రభుత్వం మహిళా రిజర్వేషన్‌ బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టి, ఓబీసీలకు తీరని ద్రోహం చేసిందని మండిపడ్డారు. గతంలో ఓబీసీ మహిళలకు రిజర్వేషన్‌ కల్పించాలని కొన్ని రాజకీయ పార్టీల వ్యవస్థాపకులు నిలదీశారని గుర్తు చేశారు. ఆ పార్టీల ఎంపీలు సభలో ఉండి కూడా ప్రశ్నించకుండా... వ్యవస్థాపకుల ఆశయాలకు తూట్లు పొడిచారని ఆరోపించారు. బిల్లును ప్రవేశపెట్టినప్పుడు పార్లమెంటులో అభ్యంతరం తెలియజేయకుండా.. బయటకు వచ్చి కాంగ్రెస్‌ పార్టీ వ్యతిరేకించడాన్ని తప్పుపట్టారు. 33 శాతం మహిళా రిజర్వేషన్‌లో ఓబీసీ మహిళల కోటా సాధనే ధ్యేయంగా దేశ వ్యాప్త ఉద్యమాలు నిర్వహించేందుకు భవిష్యత్తు కార్యాచరణ ప్రణాళిక రూపొందించి త్వరలో ప్రకటిస్తామని తెలిపారు. ఓబీసీ కులగణన చేసి చట్టపరంగా రావాల్సిన హక్కులు, నిధులు కేటాయించాలని డిమాండ్‌ చేశారు. సమావేశంలో బీసీ సంక్షేమ సంఘం ఎన్టీఆర్‌ జిల్లా అధ్యక్షుడు ముస్తఫా, ప్రధాన కార్యదర్శి మేకా వెంకటేశ్వరరావు, కార్యదర్శి కారంపూడి సత్యనారాయణ, ఉద్యోగుల సంఘం రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు గుంటుపల్లి ఉమామహేశ్వరరావు, రాష్ట్ర యువజన విభాగం ప్రధాన కార్యదర్శి కొలకలూరు హనుమంతరావు  పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని