అంతొద్దు!
మెదడు పనితీరు, కళ్లపై తీవ్ర ప్రభావం
రోజూ కొంతసేపు దూరంతో ఉపశమనం
ఈనాడు-అమరావతి
చరవాణి లేని సమాజాన్ని ఊహించలేం. నిరంతరం ఫోన్లోనే సంభాషణలు చేసుకోవడం వల్ల మానసిక ఉల్లాసం తగ్గుతుందని హెచ్చరిస్తున్నారు. అలాగని పూర్తి దూరంగా ఉండకుండా రోజువారీగా కొంత సమయం చరవాణి లేకుండా గడిపితే ఉపశమనం లభిస్తుందని విశ్లేషిస్తున్నారు.
* రాత్రివేళ చరవాణితో గడిపే సమయం పెరిగింది. ఈ విషయాలు తెలుసుకోవాలనుకుంటే చరవాణిలో డిజిటల్ వెల్బీయింగ్ అనే ఆప్షన్లో మీరు ప్రతిరోజూ ఎన్నిసార్లు అన్లాక్ చేశారు. వాట్సాప్, టెలిగ్రామ్ వంటి యాప్లు ఎంతసేపు వినియోగించారు. ఒక రోజులో ఎంతసేపు మొబైల్ చూస్తున్నారు. ఆదివారం, మిగిలిన రోజులకు తేడా ఎంత? ఇలా వివరాలన్నీ తెలుసుకోవచ్చు.
* తోటివారితో నేరుగా సంభాషించడానికి.... అదే విషయాన్ని పొట్టిసందేశం రూపంలో పంపడానికి మన ఆలోచనలలోనూ, భావ వ్యక్తీకరణలోనూ చాలా తేడాలుంటాయి. నేరుగా మాట్లాడేటప్పుడు పెద్దగా ఆలోచించకుండా సానుకూల దృక్పథంతో మాట్లాడుతాం. పొట్టిసందేశం పంపేటప్పుడు ప్రతి అక్షరాన్నీ కొలతలు వేస్తూ పంపాల్సిన పరిస్థితి.
* చరవాణిని ఎక్కువగా చూడటం వల్ల మెదడుపై ఉండే ఒత్తిడి కూడా సంభాషణలను నాణ్యతను నిర్ధారిస్తుంటుంది. డిజిటల్ వెల్బీయింగ్ సదుపాయం ద్వారా మనం ఎక్కువగా చూస్తున్న వాట్సాప్, టెలిగ్రామ్ యాప్లలో అవసరం లేనివాటిని తీసివేయటం, రోజూ సాయంత్రం ఒకటి లేదా రెండు గంటలు చరవాణి లేకుండా కుటుంబంతో గడపాలని నిర్ణయం తీసుకోవడం వంటి అంశాలతో మన మెదడును కాపాడుకోవచ్చని సూచిస్తున్నారు.
* చరవాణిలో సందేశాలు చూసుకున్న తర్వాత మెదడు సుమారు 15 నిమిషాల పాటు వాటితో చురుగ్గా ఉంటుంది. దీనిని బట్టి నిద్రపోయే ముందు కనీసం 15 నిమిషాల పాటు చరవాణికి దూరంగా ఉండటం శ్రేయస్కరం.
* మానవుల నిద్రలోకి జారుకోవడానికి ఉపకరించే మెలటోనిన్ అనే హార్మోన్ ఉత్పత్తిని చరవాణి నుంచి వచ్చే పచ్చ, నీలిరంగు కాంతి నియంత్రిస్తుందని పరిశోధనలు రుజువు చేస్తున్నాయి. అందువల్ల డిస్ప్లేలో నీలిరంగును తగ్గించి వార్మ్గా ఉంచుకోవడం అవసరం.
* నిద్రపట్టిన మొదటి గంటలో కళ్లు కదులుతూనే ఉన్నా మెదడుకు సంకేతాలు మాత్రం పంపవు. ఆతర్వాత గంటల్లో కళ్లు కూడా విశ్రాంతి తీసుకుంటూ పూర్తిస్థాయి నిద్రలోకి జారుకుంటాము. చరవాణి వినియోగించడం వల్ల మొదటిస్థాయి నిద్ర పట్టడానికి తీసుకునే సమయం పెరుగుతోందని నిపుణులు చెబుతున్నారు.
అమెరికాలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ వారి పరిశోధనలో చరవాణి వాడకం వల్ల మెదడు ఎక్కువ చక్కెరను వినియోగించుకుంటుందని గుర్తించారు. రోజులో 50 నిమిషాల కన్నా ఎక్కువసేపు చూడటం వల్ల చెవులకు, కళ్లకు ప్రమాదమని తేలింది. మొబైల్ ఫోన్కు దగ్గరగా ఉండే మెదడులోని కొన్ని ప్రాంతాల్లో ఈప్రమాదం 7 శాతం ఎక్కువగా ఉంటుందని హెచ్చరిస్తున్నారు.
3 నుంచి 4రెట్లు కేసులు పెరిగాయి
-లోకేశ్వర్రెడ్డి, అసోసియేట్ ప్రొఫెసర్, మానసిక వైద్య విభాగం, జీజీహెచ్
చరవాణి అతిగా వాడటం వల్ల మానసిక ఇబ్బందులతో వచ్చేవారి సంఖ్య కొవిడ్ తర్వాత 3 నుంచి 4 రెట్లు పెరిగింది. ప్రధానంగా 12-25 సంవత్సరాల వయసు వారు ఎక్కువగా చరవాణికి బానిసవుతున్నారు. దీనినే సాఫ్ట్ అడిక్షన్స్ అంటాం. దీంతో ఆందోళన, కుంగుబాటుకు గురవుతున్నారు. చిన్న కుటుంబాల వల్ల ఈ సమస్య మరింత ఎక్కువైంది. ఆటలు, అనవసర అంశాలు ఎదుటివారిని ఎగతాళిచేయడం, సైబర్ బుల్లింగ్ చేయడానికి ఎక్కువ సమయం గడుపుతుండడంతో వారి మెదడు మొద్దుబారిపోతుంది. దీనివల్ల చదువు పక్కదారి పట్టడంతోపాటు అనేక అనర్థాలు చోటుచేసుకుంటాయి. ఒక్కసారిగా చరవాణి దూరం చేస్లే అల్లకల్లోలం అవుతారు. క్రమంగా దృష్టి మళ్లించాలి.