Crime News: దారి తప్పిన ‘కుర్రోడు’.. చిన్నారుల నీలిచిత్రాలు అమ్ముతుండగా అరెస్ట్‌

ఇంజినీరింగ్‌ చదివిన కుర్రాడు దారితప్పాడు. పలు ఉద్యోగాలు చేసి మానేసిన అతడు, కాలక్షేపం కోసం నీలి చిత్రాలు చూడడం అలవాటు చేసుకున్నాడు. ఓ ప్రకటన చూసి చిన్నారుల వీడియోలను కొనుగోలు చేశాడు.

Updated : 27 Nov 2021 06:56 IST

నిందితుడు సొహైల్‌

ఈనాడు - అమరావతి: ఇంజినీరింగ్‌ చదివిన కుర్రాడు దారితప్పాడు. పలు ఉద్యోగాలు చేసి మానేసిన అతడు, కాలక్షేపం కోసం నీలి చిత్రాలు చూడడం అలవాటు చేసుకున్నాడు. ఓ ప్రకటన చూసి చిన్నారుల వీడియోలను కొనుగోలు చేశాడు. ఆతర్వాత.. వీటిని మరొకరికి అమ్ముతూ పోలీసులకు దొరికిపోయాడు. చిన్నారులతో చేసిన నీలి చిత్రాలకు సంబంధించి ఇటీవల దేశంలోని వివిధ ప్రాంతాల్లో సీబీఐ ఏకకాలంలో తనిఖీలు చేసింది. సంబంధం ఉన్న పలువురిని అరెస్టు చేసింది. ఈ తరహా నేరం చేసే విజయవాడ నగరానికి చెందిన యువకుడు అరెస్టు అయ్యాడు. 

రెట్టింపునకు అమ్ముతూ
విజయవాడ ఫకీరుగూడెం ప్రాంతానికి చెందిన సొహైల్‌ అహ్మద్‌.. ఓ ప్రముఖ కళాశాలలో సివిల్‌ ఇంజినీరింగ్‌ చదివాడు. హైదరాబాద్‌, అమరావతిలో పలు ఉద్యోగాలు చేశాడు. ఎక్కడా ఆశించిన జీతం రాకపోవడంతో తరచూ మానేసి, మరొకటి వెతుక్కునే వాడు. ఈ మధ్య ఆన్‌లైన్‌లో ఎక్కువ సమయం నీలి చిత్రాలు చూసేవాడు. టెలిగ్రామ్‌లోని ఓ గ్రూప్‌లో ప్రకటన చూసి ఆకర్షితుడయ్యాడు. చిన్నారుల నీలిచిత్రాలు అమ్మతామన్నది దాని సారాంశం. ప్రకటనలో ఇచ్చిన నెంబరుకు ఫోన్‌ చేసి, సంప్రదించాడు. రూ. 250కు బేరం కుదుర్చుకుని నగదును ఆన్‌లైన్‌ ద్వారా బదిలీ చేశాడు. అవతలి వ్యక్తి పంపిన లింక్‌ను సొహెల్‌ క్లిక్‌ చేయగా, 4 వేల వీడియోలు ఉన్నాయి. అవన్నీ 18 ఏళ్లు లోపువారివే. వీటిని ఎక్కువ ధరకు ఇతరులకు అమ్మి సొమ్ము చేసుకోవచ్చని సామాజిక మాధ్యమాల్లో ప్రకటన ఇచ్చాడు. దీనిని దిల్లీకి చెందిన ఎన్‌సీపీసీఆర్‌ (నేషనల్‌ కమిషన్‌ ఫర్‌ ప్రొటెక్షన్‌ ఆఫ్‌ చైల్డ్‌ రైట్స్‌) ప్రతినిధి చూసి సొహెల్‌తో కొంటానంటూ సంప్రదించారు. వీటిని రూ. 500కు అతడికి విక్రయించాడు. దీనిపై ఎన్‌సీపీసీఆర్‌ ప్రతినిధి అను చౌదరి హైదరాబాద్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడు విజయవాడకు చెందిన వ్యక్తి కావడంతో ఇక్కడి సైబర్‌ క్రైమ్‌ స్టేషన్‌కు బదిలీ అయింది. నగర పోలీసులు  పోస్కో, ఐటీ చట్టాల కింద కేసు నమోదు చేసి, నిందితుడు సొహెల్‌ను అరెస్ట్‌ చేశారు. ఎక్కడి నుంచి వీడియోలు వచ్చాయి? ఇంకా ఎవరెవరికి విక్రయించాడు? అన్న కోణంలో విచారిస్తున్నారు. 

చూసినా.. షేర్‌ చేసినా నేరమే..
పోస్కో చట్టం ప్రకారం యుక్త వయసు లోపు ఉన్న వారితో అభ్యంతరకరమైన చిత్రాలు తీయడం పూర్తిగా నిషేధం. తీసినా, సేకరించినా, చూడడం, ఇతరులకు పంపడం కూడా నేరం కిందకు వస్తుందని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఇటువంటి కంటెంట్‌ను ఆన్‌లైన్‌లో శోధించే వారిపై నేషనల్‌ క్రైం రికార్డ్స్‌ బ్యూరో నిఘా పెట్టింది. ఇటువంటి వారి ఐపీ చిరునామాల ఆధారంగా తనిఖీలు జరుగుతున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని