AP News: పాలనలో సీఎం జగన్ పెద్ద ఫెయిల్యూర్: ఉండవల్లి
ఏపీ సీఎం జగన్ పాలనలో ఘోర వైఫల్యం చెందారని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్కుమార్ ఆరోపించారు.
అమరావతి: ఏపీ సీఎం జగన్ పాలనలో ఘోర వైఫల్యం చెందారని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్కుమార్ విమర్శించారు. అసెంబ్లీలో ప్రతిపక్షం లేకపోతే ప్రజాస్వామ్యం లేనట్లే అని చెప్పారు. ప్రభుత్వానికి అప్పులపై నియంత్రణ లోపించిందని ఆయన ఆక్షేపించారు. రెండేళ్లలో వైకాపా ప్రభుత్వం రూ.3లక్షల కోట్ల అప్పులు చేసిందన్నారు. రాజమహేంద్రవరంలో ఆయన మీడియాతో మాట్లాడారు.
‘‘సీఎంగా జగన్ ఇంత ఘోరంగా విఫలమవుతారని ఊహించలేదు. 3 రాజధానుల బిల్లు ఉపసంహరించుకొని.. మళ్లీ పెడతాం అనడం ప్రభుత్వ వైఫల్యమే. ప్రతిపక్షం సలహాలు తీసుకుంటేనే ప్రభుత్వానికి పేరు వస్తుంది. చంద్రబాబునుద్దేశించి అగౌరవంగా మాట్లాడుతుంటే జగన్ ఏం చేస్తున్నారు? ప్రతిపక్షం లేకుండా చేయాలనుకుంటే అంత అవివేకం ఇంకోటి లేదు.
ఇసుక, మద్యం, పెట్రోల్, కరెంట్..ఇలా అన్ని ధరలు పెంచుకుంటూ పోయారు. అప్పులు పెరుగుతున్నాయి కానీ ఆస్తులు అసలేం ఏర్పడటం లేదు. ఉన్నన్నాళ్లు అప్పులపై నెట్టుకొచ్చి ఆ తర్వాత రాష్ట్రాన్ని రోడ్డుపై పడేయడమే వైకాపా ఉద్దేశం. ఇప్పటి వరకు చేసిన అప్పులు తీర్చడానికి కూడా మళ్లీ అప్పులు తెస్తామని చెప్పడం.. దీని కోసం ఎఫ్ఆర్బీఎమ్ చట్టాన్ని ఇష్టారీతిన సవరించడం దుర్మార్గం. రావాల్సిన నిధులపై కేంద్రాన్ని అడగటానికి కేసుల భయం. అఖిల భారత సర్వీసు అధికారులు సైతం ప్రస్తుత పరిస్థితిపై నిర్ఘాంత పోతున్నారు’’ అని ఉండవల్లి అన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.