logo

సంప్రదాయబద్ధ్దంగా మందపోరు

పల్నాటి వీరారాధన ఉత్సవాల్లో ఆదివారం మూడో రోజు మందపో(టు)రు నిర్వహించారు. అలనాడు కోడిపోరులో ఓటమితో అరణ్యవాసం పట్టిన మలిదేవ, బ్రహ్మన్న సారథ్యంలోని మాచర్ల పరివారం, వారికి అన్నపానీయాలు ఇస్తున్న

Published : 06 Dec 2021 02:56 IST

కత్తిసేవ చేస్తున్న ఆచారవంతుడు

కారంపూడి, న్యూస్‌టుడే: పల్నాటి వీరారాధన ఉత్సవాల్లో ఆదివారం మూడో రోజు మందపో(టు)రు నిర్వహించారు. అలనాడు కోడిపోరులో ఓటమితో అరణ్యవాసం పట్టిన మలిదేవ, బ్రహ్మన్న సారథ్యంలోని మాచర్ల పరివారం, వారికి అన్నపానీయాలు ఇస్తున్న ఆవుల మందలను అంతమొందించేందుకు నాగమ్మ అడివి చెంచులతో దాడి చేయిస్తుంది. ఈ ఘట్టాన్నే మందపో(టు)రుగా అభివర్ణిస్తారు. ఈ క్రతువును విరవిద్యావంతులు రాత్రి వేళ వీర్లదేవాలయ మండపంలో గానం చేస్తుండగా ఆచారవంతులు వీరావేశంతో కత్తిసేవ చేశారు. ఉదయం నాగులేరు గంగదారి మడుగులో కొణతాలకు (వీరుల ఆయుధాలు) పవిత్ర స్నానాలు చేయించి వీరగంధం పూసి వీర్లదేవాలయంలో సేవ చేసి చెన్నకేశవస్వామి, అంకాళమ్మ దేవాలయాల్లో పూజల అనంతరం శంఖుతీర్థం తీసుకొని పీఠాధిపతి ఇల్లు చేరే ఆచారం నిర్వహించారు. ఆచారవంతులు పదునైన కత్తులతో ఒంటిపై గోవిందా.. గోవిందా అంటూ మోదుకున్నారు. రాత్రికి వీర్ల మండపంలో అలనాటి సంఘటనల గానంతో మందపో(టు)రు ముగిసింది.

పీఠాధిపతి ఇంటి వద్ద ఆచారం నిర్వహిస్తున్న కొణతాలు

చాపకూడుకు స్పందన: సమసమాజ స్థాపనకు బ్రహ్మనాయుడు అన్ని కులాలు, మతాలకు చెందిన వారిని ఒకే వరుసలో కూర్చో బెట్టి చాపకూటిని అందించారు. ఈ క్రతువునే మందపోరు రోజున నిర్వహిస్తుండటం పరిపాటిగా వస్తున్న ఆచారం. ఇందుకోసం జిల్లా పరిషత్తు రూ.2లక్షలు మంజూరు చేయగా వీర్లదేవాలయ ప్రాంగణంలోని చాపకూడు మండపంలో కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆచారవంతులు, భక్తులకు జడ్పీ ఛైర్మన్‌ హెన్రి క్రిస్టీనా, ప్రభుత్వ విప్‌ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, పీఠాధిపతి తరుణ్‌ చెన్నకేశవలు వడ్డన చేశారు. ముందుగా అన్నంరాశికి ప్రత్యేక పూజలు చేశారు. చాపకూడులో జడ్పీ ఛైర్మన్‌, ఎమ్మెల్యే, పీఠాధిపతి, గురజాల డీఎస్పీలు సహపంక్తి భోజనం చేశారు. పల్నాటి వీరుల తిరునాళ్లకు దూరప్రాంతాల నుంచి వచ్చే ఆచారవంతులు, భక్తులకు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వ విప్‌ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి రూ.లక్ష విరాళం అందించారు. ఈమేరకు ఆదివారం వీర్లదేవాలయంలో పీఠాధిపతి తరుణ్‌ చెన్నకేశవకు చెక్కు అందజేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ పల్నాటి వీరాచారం పీఠాధిపతి కుటుంబానికి భారం కాకూడదన్న ఉద్దేశంతో ఏటా ఆర్థిక చేయూత అందిస్తున్నామన్నారు.


చాపకూడులో పాల్గొన్న జడ్పీఛైర్‌పర్సన్‌, ప్రభుత్వ విప్‌, పీఠాధిపతి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని