logo

ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరి అరెస్ట్‌

విజయనగరానికి చెందిన దామోదరరావు అనే యువకుడు విజయవాడలో గది అద్దెకు తీసుకొని చరవాణులు, ల్యాప్‌టాప్‌లు చోరీ చేసి ఆన్‌లైన్లో విక్రయిస్తుండగా, తాడేపల్లిలో స్థానిక యువకులు పట్టుకుని పోలీసులకు అప్పగించిన సంఘటన వెలుగుచూసింది.

Updated : 08 Dec 2021 05:43 IST
జగ్గయ్యపేట, న్యూస్‌టుడే: ఉద్యోగాలిప్పిస్తామంటూ దినపత్రికల్లో ప్రకటనలు వేసి 40 మందిని మోసం చేసిన ఇద్దరు సభ్యుల్ని అరెస్ట్‌ చేసినట్లు నందిగామ డీఎస్పీ నాగేశ్వరరెడ్డి తెలిపారు. మంగళవారం కృష్ణా జిల్లా జగ్గయ్యపేట సర్కిల్‌ కార్యాలయంలో సీఐ చంద్రశేఖర్‌తో కలిసి డీఎస్ఫీ. విలేకర్లకు వెల్లడించిన వివరాలు ఇలా ఉన్నాయి జగ్గయ్యపేటకు చెందిన 19 ఏళ్ల యువతి ఇచ్చిన ఫిర్యాదుపై దర్యాప్తు నిర్వహించి తెలంగాణ రాష్ట్రం మంచిర్యాల జిల్లా భీమారం మండలం భీమారం రెడ్డిపాలెంలోని ఒకే కుటుంబానికి చెందిన దాసరి రవి, సంపత్‌లను అదుపులోకి తీసుకున్నారు. గత సెప్టెంబరు 18న ఫిర్యాదీ.. ప్రకటన చూసి అందులో ఇచ్చిన నంబర్‌కి ఫోన్‌ చేయగా నిందితులు దివాన్‌ ఆగ్రో కంపెనీ అని చెప్పి తమ ఎస్‌బీఐ ఖాతాకు రూ.1600 ప్రాథమికంగా పంపమన్నారు. అనంతరం విడతల వారీగా ఆమె ఫోన్‌, గూగుల్‌ పేల ద్వారా మొత్తం రూ.65,000 రాబట్టుకున్నారు. పోలీస్‌ విచారణలో ఇదే తరహాలో 40 మందిని మోసం చేసినట్లు తెలిసింది. నిందితులను విచారించగా తమ గ్రామానికి చెందిన దాసరి రమేష్‌ గతంలో బిహార్‌ వెళ్లి ఆన్‌లైన్‌ మోసాలు చేసి డబ్బు సంపాదించడాని, అతని వద్దే తామూ ఈ విధానాలు తెలుసుకున్నామని వారు పోలీసులకు తెలిపారు. తమలా శిక్షణ పొందిన వారు ఇంకా 10 మంది ఉన్నట్లు చెప్పారు. ప్రస్తుతం నిందితులపై 2019లో రాయదుర్గం స్టేషన్లో రెండు కేసులు నమోదు అయిన ఉన్నట్లు, ఇంకా ఇలాంటి మరో 8 మంది కూడా మోసాలు చేస్తున్న విషయాన్ని జగ్గయ్యపేట పోలీసులు సంబంధిత పోలీస్టేషన్లకు సమాచార మిచ్చారు. ఈ కేసు ఛేదించడంలో కృషి చేసిన ఎస్‌ఐలు చినబాబు, వెంకటరామారావు, పీసీలు లక్ష్మీనారాయణ, సురేష్‌ కుమార్‌లను డీఎస్పీ నాగేశ్వరరెడ్డి అభినందించారు. నిందితులపై ఛీటింగ్‌ కేసు నమోదు చేశారు.

ట్రయల్‌ వేస్తామంటూ ద్విచక్ర వాహనంతో పరారీ

సూర్యారావుపేట, న్యూస్‌టుడే : రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ బైక్‌ని కొనుగోలు చేస్తామంటూ వచ్చి, దాన్ని తీసుకుని ఉడాయించిన ముగ్గురిపై సూర్యారావుపేట పోలీసులు కేసు నమోదు చేశారు. పాయకాపురం రాధానగర్‌కు చెందిన అబ్దుల్‌ రహ్‌మాన్‌ అరండల్‌పేటలోని ప్రియాంక ఫైనాన్స్‌లో మెకానిక్‌గా పని చేస్తున్నారు. ఈ నెల 2వ తేదీ సాయంత్రం ముగ్గురు వ్యక్తులు వచ్చి, రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ను కొనుగోలు చేస్తామని చెప్పారు. 2019 మోడల్‌ వాహనం కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపారు. బండిని ట్రయల్‌ వేస్తామంటూ తీసుకువెళ్లి, తిరిగి రాలేదు. ఈ ఘటనపై అబ్దుల్‌ రహ్‌మాన్‌ పోలీసులకు ఫిర్యాదు చేయగా, సోమవారం కేసు నమోదు చేశారు.


పోలీసుల అదుపులో సెల్‌ఫోన్ల దొంగ 

తాడేపల్లి, న్యూస్‌టుడే: విజయనగరానికి చెందిన దామోదరరావు అనే యువకుడు విజయవాడలో గది అద్దెకు తీసుకొని చరవాణులు, ల్యాప్‌టాప్‌లు చోరీ చేసి ఆన్‌లైన్లో విక్రయిస్తుండగా, తాడేపల్లిలో స్థానిక యువకులు పట్టుకుని పోలీసులకు అప్పగించిన సంఘటన వెలుగుచూసింది. బాధితులు తెలిపిన మేరకు.. దామోదరరావు చోరీ చేసిన చరవాణిని ఆన్‌లైన్లో అమ్మకానికి పెట్టగా, దాన్ని పోగొట్టుకున్న విద్యార్థి గుర్తించాడు. ఈక్రమంలో దాన్ని కొంటానని దామోదరరావు రమ్మని కోరాడు. ఈనెల 6న ఫోన్‌ అమ్మడానికి నిందితుడు తాడేపల్లి బైపాస్‌ రోడ్డు వద్దకు వచ్చాడు. వెంటనే విద్యార్థితో పాటు ఉన్న స్థానికులు అతడిని పట్టుకొని పోలీసులకు అప్పగించారు. వారు తమదైన శైలిలో విచారించగా నిందితుడు తాను చోరీ చేసిన సెల్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల వివరాలు తెలిపాడు. దొంగలించిన వాటిని విజయవాడలో తాను అద్దెకుండే గదిలో ఉంచినట్లు తెలిపి, మొత్తం 24 చరవాణులతో పాటు ల్యాప్‌టాపులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇవన్నీ వట్టిచెరుకూరులోని ఓ ఇంజినీరింగ్‌ కళశాల వసతి గృహంలోని విద్యార్థులకు సంబంధించినవని విచారణలో వెల్లడించినట్లు సమాచారం. వీటి విలువ రూ.3 లక్షలుంటుందని పోలీసులు అంచనా వేశారు. అమృతలూరు గ్రామానికి చెందిన ఫణికుమార్‌ అనే యువకుడి ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని