logo

ద్విచక్ర వాహనాలు ఢీ.. ఇద్దరి దుర్మరణం

రాత్రివేళ ఎదురెదురుగా రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్న ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా.. మరొకరు చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. ఈ సంఘటన

Published : 15 Jan 2022 03:59 IST

మృతులు గుంటూరు జిల్లా వాసులు

నర్వ, న్యూస్‌టుడే : రాత్రివేళ ఎదురెదురుగా రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్న ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా.. మరొకరు చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. ఈ సంఘటన నారాయణపేట జిల్లా నర్వలో చోటుచేసుకొంది. ఎస్సై విజయ్‌భాస్కర్‌ కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. గుంటూరు జిల్లా మంగళంపాడు గ్రామానికి చెందిన షేక్‌ జిలానీ (48), షేక్‌ మహబూబ్‌ (33) సమీప బంధువులు. రాతిగోడల ఆలయం నిర్మాణంలో నైపుణ్యం ఉండటంతో నర్వ మండలం రాంపూర్‌ శివారులో ఓ ఆలయ నిర్మాణం కోసం ఇటీవల తీసుకొచ్చారు. ఆలయం దగ్గరే ఉంటూ పనులు చేస్తున్నారు. గురువారం రాత్రి నర్వకు వెళ్లి వంట సరకులు తీసుకొని ద్విచక్ర వాహనంపై తిరిగి వస్తుండగా.. లంకాల గ్రామానికి చెందిన నరేందర్‌ ఎదురుగా ద్విచక్ర వాహనంపై వేగంగా వస్తూ.. బొప్పాయితోట వద్ద ఢీకొన్నాడు. ఈ ప్రమాదంలో వాహనం నడుపుతున్న జిలానీ అక్కడికక్కడే దుర్మరణం చెందగా.. తీవ్ర గాయాలైన శేక్‌ మహబూబ్‌ మహబూబ్‌నగర్‌ జనరల్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. బంధువులకు సమాచారం ఇవ్వడంతో శుక్రవారం వచ్చి, పోలీసులకు ఫిర్యాదు చేశారు. షేక్‌ మహబూబ్‌ భార్య షేక్‌ నూర్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

కారుపై యువకుల దాడి

ఉండవల్లి (తాడేపల్లి), న్యూస్‌టుడే: నగరంలోని ఉండవల్లిలోని ఆంజనేయస్వామి ఆలయం వద్ద శుక్రవారం తెల్లవారు జామున ముగ్గురు యువకులు ఓ కారుపై దాడి చేసి, అందులో ఉన్న వ్యక్తి నుంచి నగదు తీసుకోవడానికి యత్నించిన ఘటన చోటుచేసుకుంది. డీఎస్పీ రాంబాబు కథనం మేరకు.. ఉండవల్లి గ్రామానికి చెందిన ఫణీంద్ర, అతడి ఇద్దరు మిత్రులు విపరీతంగా మద్యం సేవించారు. మత్తులో ఫణీంద్ర తన ఇంటి పక్కనున్న బంధువుల ఇంటికి వెళ్లి కిటికీ అద్దం పగులగొట్టగా చేతికి గాయమైంది. తర్వాత ఉండవల్లి రోడ్డుపైకి చేరుకొని అటువైపుగా వెళుతున్న కారుపై పడ్డారు. అందులో ఉన్న ఆంజనేయులుకు, ఫణీంద్రకు వాగ్వాదం జరిగింది. కొద్దిసేపటికి ఆంజనేయులు పోలీసులకు ఫోన్‌ చేశారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు మద్యం మత్తులో ఉన్న ఫణీంద్రను అదుపులో తీసుకున్నారు. బాధితుడి ఫిర్యాదుతో అతడిపై చర్యలు తీసుకుంటామన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు