logo

కారును ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు

యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌ మండలం ధర్మోజిగూడెం క్రాస్‌ రోడ్డు వద్ద కారును ఆర్టీసీ బస్సు ఢీకొట్టిన ఘటనలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. మరో ఐదుగురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు.

Published : 17 Jan 2022 04:55 IST

ఇద్దరు మృతి, మరో ఐదుగురికి గాయాలు

చౌటుప్పల్‌గ్రామీణం, న్యూస్‌టుడే: యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌ మండలం ధర్మోజిగూడెం క్రాస్‌ రోడ్డు వద్ద కారును ఆర్టీసీ బస్సు ఢీకొట్టిన ఘటనలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. మరో ఐదుగురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. పోలీస్‌ ఇన్‌స్పెక్టర్‌ ఎన్‌.శ్రీనివాస్‌ తెలిపిన వివరాల ప్రకారం... ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం కృష్ణా జిల్లా మచిలీపట్నం డిపోకు చెందిన గరుడ బస్సు హైదరాబాద్‌కు వెళ్తూ ఆదివారం తెల్లవారు జామున ధర్మోజిగూడెం క్రాస్‌ రోడ్డు వద్ద ముందున్న ఇన్నోవా కారును అతివేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో హైదరాబాద్‌లోని కార్వాన్‌కు చెందిన చిప్ప సాయి పృథ్వీరాజ్‌ (23), జవహర్‌ నగర్‌కు చెందిన వనబోజు చందు(28) అక్కడికక్కడే మృతి చెందారు. ఇన్నోవా డ్రైవర్‌ రాహుల్‌ (జియాగూడ), కారులో ప్రయాణిస్తున్న అడ్డాల కార్తీక్‌ (పంచబిలావా లార్వా), శివరాజ్‌ గోపాలచారి(జియాగూడ), కె.గణేశ్‌(జియాగూడ), అమర్‌ (పురానాపూల్‌)లు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను మెరుగైన చికిత్స నిమిత్తం హైదరాబాద్‌లోని ఎల్బీనగర్‌ కామినేని ఆసుపత్రికి తరలించారు. నల్గొండ జిల్లా చిట్యాలలో ఓ స్నేహితుని ఇంట్లో జరిగిన సంక్రాంతి పండగకి వెళ్లి తిరిగి హైదరాబాద్‌కు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మృతదేహాలకు చౌటుప్పల్‌ ప్రభుత్వాసుపత్రిలో శవపరీక్షలు నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. నిర్లక్ష్యంగా, అతివేగంగా డ్రైవర్‌ బస్సును నడిపాడని మృతుడు చందు తండ్రి ప్రేమ్‌కుమార్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు బస్సు డ్రైవర్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఇన్‌స్పెక్టర్‌ తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని