Ap News: ఇంత దారుణమైన పీఆర్సీని ఎప్పుడూ చూడలేదు: ఎమ్మెల్సీ అశోక్‌బాబు

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తీసుకొచ్చిన పీఆర్సీ జీవోలు ఉద్యోగులను ఆర్థికంగా కుంగదీసే విధంగా ఉన్నాయని తెదేపా

Updated : 18 Jan 2022 14:41 IST

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తీసుకొచ్చిన పీఆర్సీ జీవోలు ఉద్యోగులను ఆర్థికంగా కుంగదీసే విధంగా ఉన్నాయని తెదేపా ఎమ్మెల్సీ అశోక్‌బాబు అన్నారు. ఇంత దారుణమైన పీఆర్సీని ఎప్పుడూ చూడలేదని.. ఇకపై చూడబోయేది లేదని ఎద్దేవా చేశారు. మంగళవారం అశోక్‌బాబు మీడియాతో మాట్లాడారు. రెండేళ్లు పదవీ విరమణ వయసు పెంచారని ఎంతో సంతోషపడ్డారని పేర్కొన్నారు. 23 శాతం ఫిట్‌మెంట్‌ ఇచ్చినప్పుడే ఉద్యోగులు వ్యతిరేకించాల్సిందని.. ఉద్యోగులకు జరుగుతున్న అన్యాయంపై అప్పుడే ప్రశ్నించాల్సిందని వెల్లడించారు. ఉద్యోగ సంఘాల తీరుతో ఉద్యోగులు తీవ్రంగా నష్టపోతున్నారని.. 14 లక్షల ఉద్యోగుల జీతభత్యాలపై ఆలోచించాల్సిన అవసరం ఉందన్నారు. ఉద్యోగ సంఘాల జేఏసీలో ఉన్నత స్థానాల్లో ఉన్నవారి మాటలు కిందిస్థాయి ఉద్యోగుల భవిష్యత్‌ను నిర్దేశిస్తాయనే ఆలోచన నేతలకు లేకుండా పోయిందని విమర్శించారు.

చరిత్రలో దుర్మార్గంగా మిగిలిపోయే పీఆర్సీని ముఖ్యమంత్రి జగన్‌ ప్రకటించారని.. ఉద్యోగులు ఈ ప్రభుత్వానికి ఓటేశారన్న విశ్వాసాన్ని కూడా సీఎం పట్టించుకోలేదన్నారు. ఉద్యోగులు భౌతిక పోరాటం చేయకుండా సోషల్ మీడియా గ్రూపుల ద్వారా పోరాడితే ఎలాంటి ప్రయోజనం ఉండదన్నారు. ప్రభుత్వం జీవోలు జారీ చేసిన తర్వాత ఉద్యోగ సంఘాల నేతలు ఎంత గింజుకున్నా ఉపయోగం ఉండదని పేర్కొన్నారు. తాను తెదేపా నేతగా కాకుండా, మాజీ ప్రభుత్వ ఉద్యోగిగానే మాట్లాడుతున్నట్లు స్పష్టం చేశారు. ఉద్యోగ సంఘాల నేతల వైఖరితో దాదాపు 14 లక్షల మంది ఉద్యోగులు తీవ్రంగా నష్టపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని