Ap News: ఉద్యోగుల్లో ఆశలు రేపి మోసం చేశారు: నాదెండ్ల మనోహర్‌

ఏపీ ప్రభుత్వం ఆశలు రేపి ఉద్యోగులను మోసం చేసిందని జనసేన రాజకీయ వ్యవహారల కమిటీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ ఆరోపించారు. పీఆర్సీ ద్వారా జీతాలు పెరుగుతాయని

Published : 19 Jan 2022 20:18 IST

అమరావతి: ఏపీ ప్రభుత్వం ఆశలు రేపి ఉద్యోగులను మోసం చేసిందని జనసేన రాజకీయ వ్యవహారల కమిటీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ ఆరోపించారు. పీఆర్సీ ద్వారా జీతాలు పెరుగుతాయని భావించిన ఉద్యోగులను తీవ్ర నిరాశకు గురిచేసిందన్నారు. ఉద్యోగులకు ఇప్పటికే ఎక్కువ ఇచ్చాం కాబట్టి వెనక్కి ఇవ్వాలనే విధంగా ప్రభుత్వం వ్యవహరించడం ఎప్పుడూ చూడలేదని దుయ్యబట్టారు. పదేపదే ఉద్యోగ సంఘాలను చర్చలకు పిలిచి ఇంటి అద్దె భత్యాలను తగ్గించడం దారుణమన్నారు. ఉద్యోగులకు రావాల్సిన డీఏలను గతంలో ఎక్కువ ఇచ్చాం కాబట్టి ఇప్పుడు హెచ్‌ఆర్‌ఏ రూపంలో వసూలు చేసుకొంటామని చెప్పడం చూస్తుంటే ముఖ్యమంత్రి పాలన చేస్తున్నట్లుగా లేదని విమర్శించారు. కాల్ మనీ, వడ్డీ వ్యాపారులు తమ బకాయిలను వసూలు చేసుకొనే విధానమే కనిపిస్తోందని వ్యాఖ్యలు చేశారు.

‘‘పోలీసులు తమ బాధలను పంటి బిగువున ఉంచుకొంటున్నారు. ఉపాధ్యాయులకు బోధనేతర విధులు పెంచి జీతాలు తగ్గించడం దురదృష్టకరం. జీతాల పెంపుదల గురించి అడిగితే ఆర్థిక పరిస్థితి బాగోలేదని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో చెప్పిస్తున్నారు. కరోనా సమయంలోనూ రాష్ట్ర ఆదాయం బాగుందని కాగ్ పొగిడిందంటూ గొప్పలు చెప్పుకొన్న పాలకులు ఇప్పుడు మాత్రం పరిస్థితి బాగోలేదని ఎందుకు చెబుతున్నారు?విశ్రాంత ఉద్యోగులకు కూడా పింఛన్‌ తగ్గే విధంగా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోవడం సరైంది కాదు.  70 సంవత్సరాలు పైబడినవారికి ఇచ్చే క్వాంటమ్ పెన్షన్ అర్హతను 80ఏళ్లకు మార్చడం వృద్ధాప్యంలో ఉన్నవారిని బాధపెట్టడమే అవుతుంది. ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయుల జీతాలపై ప్రభావం చూపించే విధంగా జారీ చేసిన జీవోలను తక్షణమే రద్దు చేయాలి’’ అని నాదెండ్ల డిమాండ్ చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని