logo

రూ.70 లక్షలు తీసుకొని మోసం

ఓ వ్యక్తి భూములు కొనుగోలు చేస్తానని తన వద్ద రూ.70 లక్షలు తీసుకున్నాడు...ఆ తరువాత తన ఫోన్‌ బ్లాక్‌ చేశాడు...తాను మోసపోయానని..న్యాయం చేయాలని తాడికొండకు

Updated : 20 Jan 2022 05:17 IST

‘డయల్‌ యువర్‌ ఎస్పీ’లో ఫిర్యాదు

గుంటూరు నేరవార్తలు: ఓ వ్యక్తి భూములు కొనుగోలు చేస్తానని తన వద్ద రూ.70 లక్షలు తీసుకున్నాడు...ఆ తరువాత తన ఫోన్‌ బ్లాక్‌ చేశాడు...తాను మోసపోయానని..న్యాయం చేయాలని తాడికొండకు చెందిన ఒకరు రూరల్‌ ఎస్పీ విశాల్‌గున్నీకి ఫిర్యాదు చేశారు. దీనిపై ఎస్పీ స్పందిస్తూ అర్బన్‌ఎస్పీతో మాట్లాడి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు. బుధవారం పోలీసు కార్యాలయంలో నిర్వహించిన ‘డయల్‌ యువర్‌ ఎస్పీ’ కార్యక్రమానికి వచ్చిన ఫిర్యాదులు ఇలా ఉన్నాయి.

* తెనాలికి చెందిన ఓ యువకుడు తాను వాలంటీర్‌గా పనిచేస్తున్నానని, 2019లో కొత్త ద్విచక్ర వాహనాన్ని కొనుగోలు చేశానన్నాడు. 2020లో తన స్నేహితుడు నా బైక్‌ కావాలని తీసుకు వెళ్లి అక్రమంగా మద్యం తీసుకు వస్తుంటే ఏలూరు పోలీసులు పట్టుకున్నారన్నాడు. బైక్‌ తన పేరుతో ఉండటంతో పోలీసులు ఫోన్‌ చేసి రూ.30 వేలు కట్టమన్నారని తెలిపాడు. దీంతో డబ్బులు తీసుకొని స్టేషన్‌కు వెళ్లి తన వాహనాన్ని పరిశీలిస్తే సామగ్రి పూర్తిగా మార్చి వేసి ఉందని ఆవేదన చెందాడు. స్పందించిన ఎస్పీ తాను అక్కడి ఎస్పీతో మాట్లాడి న్యాయం జరిగేలా చూస్తామని తెలిపారు.

* తెనాలికి చెందిన ఓ మహిళ మాట్లాడుతూ 2021 మార్చిలో ఓ యాప్‌ ద్వారా రూ.10 వేలు పెట్టుబడి పెడితే వడ్డీ చెల్లిస్తామని నగదు జమ చేయించుకున్నారన్నారు. వడ్డీ ఇవ్వకపోగా తన బ్యాంకు ఖాతాలోని రూ.3.50 లక్షలు స్వాహా చేశారని తెలిపింది. దీనిపై ఎస్పీ మాట్లాడుతూ స్టేషన్‌లో ఫిర్యాదు రాసి ఇవ్వాలని, వెంటనే చర్యలు తీసుకుంటామన్నారు. * విశాఖపట్నానికి చెందిన ఓ వ్యక్తి మాట్లాడుతూ ఓ యువతి పెళ్లి చేసుకుంటానని మోసగించిందని, తిరిగి తనపైనే ఒంగోలులో పోలీసులకు తప్పుడు కేసు పెట్టిందని తెలిపారు. రూరల్‌ ఎస్పీ అక్కడి పోలీసులతో మాట్లాడి విచారించి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. * కొల్లిపర మండలానికి చెందిన మహిళ మాట్లాడుతూ తన అత్తింటి వారి వేధింపులు భరించలేకున్నానని వాపోయింది. పోలీసు కేసుపెట్టినా తన మామ ప్రజాప్రతినిధిగా ఉండటంతో చర్యలు లేవన్నారు. దీనిపై ఎస్పీ అక్కడి పోలీసులతో మాట్లాడగా ఆస్తుల విషయంలో గొడవలు ఉన్నాయని, ఇప్పటికే సదరు ప్రజాప్రతినిధికి కౌన్సెలింగ్‌ ఇచ్చామన్నారు. దీంతో ఎస్పీ ఆస్తుల జోలికి వెళ్లకుండా మహిళను ఇబ్బంది పెడితే అతనిపై కేసు నమోదు చేయాలని ఆదేశించారు. * సత్తెనపల్లికి చెందిన ఓ మహిళ మాట్లాడుతూ తన వద్ద ఓ మహిళ బ్యాంకులో తాకట్టు పెడతానంటూ రూ.10 సవర్ల బంగారం, అర కిలో వెండి తీసుకొని ఇబ్బంది పెడుతోందని వాపోయింది. దీనిపై ఎస్పీ అక్కడ పోలీసులతో మాట్లాడితే ఆమె వ్యక్తిగత కక్షతో తప్పుడు ఫిర్యాదు చేసినట్లు తమ విచారణలో తేలిందన్నారు. మరోసారి విచారించి చర్యలు తీసుకోవాలన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని