logo

పాజిటివిటీ రేటు.. 15.83

జిల్లాలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల వ్యవధిలో జిల్లావ్యాప్తంగా 943 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదుకాగా, ఒకరు మరణించారు. పండగ వేళ ప్రయాణాలు, రద్దీ ప్రాంతాల్లో

Published : 20 Jan 2022 03:15 IST

ఒక్క రోజులో 943 కరోనా కేసులు

ఈనాడు-అమరావతి న్యూస్‌టుడే-గుంటూరు వైద్యం

జిల్లాలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల వ్యవధిలో జిల్లావ్యాప్తంగా 943 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదుకాగా, ఒకరు మరణించారు. పండగ వేళ ప్రయాణాలు, రద్దీ ప్రాంతాల్లో కలియతిరగడంతో వైరస్‌ వేగంగా విస్తరిస్తోంది. ఒక్కరోజు వ్యవధిలోనే వెయ్యి చేరువగా కొత్త కేసులు నమోదుకావడంతో యంత్రాంగం ఆందోళన చెందుతోంది. జిల్లా కేంద్రంగా ఉన్న ఒక కార్యాలయంలో పది మందికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ కావడంతో కార్యాలయ ఉద్యోగులు ఆందోళనలో ఉన్నారు. జిల్లాలో గడిచిన 24 గంటల వ్యవధిలో కరోనా పాజిటివిటీ రేటు 15.83 శాతం నమోదైంది. 5958 నమూనాలు పరీక్షించగా 943 మందికి కరోనా నిర్ధారణ అయింది. డిసెంబరు నెలలో పాజిటివిటీ రేటు 2 శాతంలోపు ఉండగా, జనవరి ప్రారంభంలో 5 శాతం వరకు ఉంది. ప్రస్తుతం 15 శాతం దాటడంతో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. స్వల్ప లక్షణాలు ఉండటం వల్ల ఇబ్బంది లేదని ఇంట్లో ఎక్కువ మంది వైద్యం పొందుతున్నారు. అయితే కొందరిలో డెల్టా వేరియంట్‌ ఉండటం వల్ల ఇబ్బందులు ఎదురవుతాయని, అలాంటివారు వైద్యుల పర్యవేక్షణలో ఉండటం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. పట్టణ ప్రాంతాల్లో ఒక్కరోజులోనే 707 కేసులు రావడం పరిస్థితి తీవ్రతకు నిదర్శనం. జిల్లాలో క్రియాశీలక కేసులు 3561 ఉన్నాయి. ఆసుపత్రుల్లో క్రియాశీలక కేసులు 271 ఉన్నాయి. వెంటిలెటర్‌పై 9 మంది, ఐసీయూలో 48, ఆక్సిజన్‌ సాయంతో 111 మంది, సాధారణ పడకల్లో 112 మంది చికిత్స పొందుతున్నారు. సంక్రాంతి సెలవులు పూర్తయి పాఠశాలలు పునఃప్రారంభమైన తర్వాత వైద్య ఆరోగ్య శాఖ బుధవారం వెల్లడించిన గణాంకాల ప్రకారం 31 మంది విద్యార్థులు, 10 మంది ఉపాధ్యాయులకి కొవిడ్‌ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఆరోగ్య రంగంలో పని చేస్తున్న వైద్యులు, ఇతర సిబ్బంది 67 మంది, ఇతర విభాగాల్లోని ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగుల్లో 91 మంది వైరస్‌ బారిన పడ్డారు.

 
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని