Ap News: సమ్మె నోటీసు ఇస్తాం.. సమయం ఇవ్వండి!: పీఆర్సీ సాధన సమితి

పీఆర్సీ సాధన కమిటీగా ఏర్పాటై ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయం తీసుకున్నట్లు ఉద్యోగ సంఘాలు వెల్లడించాయి. ఈ మేరకు ఉదయం ఎన్జీవో హోంలో

Updated : 21 Jan 2022 18:24 IST

అమరావతి: పీఆర్సీ సాధన సమితిగా ఏర్పాటై ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయం తీసుకున్నట్లు ఉద్యోగ సంఘాలు వెల్లడించాయి. ఈ మేరకు ఉదయం ఎన్జీవో హోంలో జరిగిన సమావేశానికి కొనసాగింపుగా సచివాలయ ఉద్యోగుల సంఘం కార్యాలయంలో ఉద్యోగ సంఘాల నేతల మరోసారి భేటీ అయ్యారు. సంప్రదింపుల కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన సమితి విషయంలో ఏవిధమైన వైఖరితో ఉండాలనే అంశంపై సమాలోచనలు జరిపారు. అనంతరం సీఎస్‌ సమీర్‌శర్మను కలిసి వినతి పత్రం అందించారు. పీఆర్సీ సాధన సమితిని ఏర్పాటు చేసుకున్నట్లు సీఎస్‌కు వివరించారు. పీఆర్సీ విషయంలో ప్రభుత్వ నిర్ణయాన్ని ఉద్యోగులు, ఉపాధ్యాయులంతా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని స్పష్టం చేశారు. ప్రస్తుత రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని అర్థం చేసుకోవాలని ఉద్యోగ సంఘాల నేతలను సీఎస్ సమీర్ శర్మ కోరారు. ప్రభుత్వ తాజా నిర్ణయాల వల్ల ఉద్యోగులకు పెద్ద ఎత్తున నష్టం జరుగుతోందని నేతలు వాపోయారు. ఉద్యమ కార్యాచరణలో భాగంగా సమ్మె చేయడానికి వెనకాడబోమని సీఎస్‌కు స్పష్టం చేశారు. సోమవారం సమ్మె నోటీసు ఇస్తామని.. అందుకు సమయం ఇవ్వాలని పీఆర్సీ సాధన సమితి నేతలు సీఎస్‌ను కోరారు. సమావేశం ముగిసిన అనంతరం పీఆర్సీ సాధన సమితి నేతలు మీడియాతో మాట్లాడారు.

అదే మా మొదటి డిమాండ్: వెంకట్రామిరెడ్డి

‘‘పీఆర్సీ జీవోల వల్ల ఉద్యోగులందరికీ నష్టం కలిగింది. ఈ విషయంలో అన్ని ఉద్యోగ సంఘాలు కలిసి పోరాడాలని నిర్ణయం తీసుకున్నాం. కార్యాచరణను సిద్ధం చేసుకుని ముందుకు వెళ్లాలని నిర్ణయించుకున్నాం. జీవోలను వెనక్కి తీసుకోవాలన్నది మా మొదటి డిమాండ్. అశుతోష్ మిశ్రా కమిటీ నివేదిక ఇవ్వాలన్నది మా రెండో డిమాండ్. మళ్ళీ సవరించిన వేతన స్కేలు ఇవ్వాలనేది మూడో డిమాండ్. అలాగే గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు పెంచిన వేతన స్కేలు అమలు చేయాలని కోరుతున్నాం’’ అని సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి పేర్కొన్నారు.

12 మంది సభ్యులతో స్టీరింగ్ కమిటీ: సూర్యనారాయణ

‘‘సవరించిన వేతనాలు ఇచ్చేయాలని ప్రభుత్వం ట్రెజరీ ఉద్యోగులను తొందర పెడుతోంది. పీఆర్సీ జీవోల అమలును నిలిపివేసి కొత్త వేతనాలు చెల్లించాలన్న ఆదేశాలను నిలుపుదల చేసి.. డిసెంబర్ నెల వేతనాలు ఇవ్వాల్సిందిగా సీఎస్‌ను కోరాం. పీఆర్సీ సాధన సమితిని 12 మంది సభ్యులతో స్టీరింగ్ కమిటీగా ఏర్పాటు చేసుకుంటున్నాం. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులతో పాటు, కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల వేతనాల పెంపుపై కూడా ప్రభుత్వానికి వివరిస్తాం’’ అని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘంఅధ్యక్షుడు సూర్యనారాయణ తెలిపారు.

ఉద్యమంలోకి రాజకీయ పార్టీలకు అనుమతి లేదు..

‘‘మేం గొంతెమ్మ కోరికలు కోరడం లేదు. జీతం తగ్గకుండా చూడాలని అడుగుతున్నాం. మా ఉద్యమంలోకి రాజకీయ పార్టీలకు అనుమతి లేదు. ఈ నెల పాత జీతాలే ఇవ్వాలని లికితపూర్వకంగా డిమాండ్‌ చేశాం. ఇది జీతాలు తగ్గించే పీఆర్సీగా ఉద్యోగులు భావిస్తున్నారు. సీపీఎస్‌ రద్దు చేస్తారని లక్షల మంది ఉద్యోగులు ఎదురు చూస్తున్నారు. మా మిగతా డిమాండ్లను కూడా సాధన సమితి ద్వారానే సాధిస్తాం. ఒప్పంద, పొరుగు సేవల ఉద్యోగులకు నామమాత్రంగానే జీతాలు పెరిగాయి. ఆర్టీసీ ఉద్యోగులు వచ్చి మా కార్యక్రమాల్లో పాల్గొనాలి. ఫిబ్రవరి 5న సహాయ నిరాకరణ.. 7న సమ్మెకు వెళ్లాలని నిర్ణయించాం. ఈ నెల 24న సమ్మె నోటీసు ఇవ్వాలని తీర్మానించాం. 23న అన్ని జిల్లా కేంద్రాల్లో రౌండ్‌ టేబుల్‌ సమావేశాలు, 25న ర్యాలీలు, ధర్నాలు.. 26న అన్ని తాలూకా కేంద్రాల్లోని అంబేడ్కర్‌ విగ్రహాలకు విజ్ఞాపన పత్రాలు ఇస్తాం. ఈ నెల 27 నుంచి 30వ తేదీ వరకు అన్ని జిల్లా కేంద్రాల్లో రిలే నిరాహార దీక్షలు చేపడుతాం. పూర్తిగా శాంతియుత పద్ధతుల్లోనే మా ఉద్యమాన్ని చేపడతాం. ఉద్యగులు ఎవరూ అసభ్య వ్యాఖ్యలు చేయవద్దని కోరుతున్నాం. రాజకీయ పార్టీల ఉచ్చులో పడొద్దని ఉద్యగులను కోరుతున్నాం’’ అని పీఆర్సీ సాధన సమితి నేతలు వెల్లడించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని