AP News: ఇదేదో ఆషామాషీ ఉద్యమం అనుకోవద్దు: సూర్యనారాయణ

ఇవాళ తమకు బాధాకరమైన రోజు అని.. సమ్మెకు వెళ్తామని ఎప్పుడూ అనుకోలేదని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణ అన్నారు.

Updated : 25 Jan 2022 04:39 IST

అమరావతి: ఇవాళ తమకు బాధాకరమైన రోజు అని.. సమ్మెకు వెళ్తామని ఎప్పుడూ అనుకోలేదని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణ అన్నారు. తమ డిమాండ్లను పరిగణనలోకి తీసుకోకుండా జీవోలు ఇచ్చారని ఆయన ఆక్షేపించారు. పీఆర్సీ జీవోలను రద్దు చేయాలంటూ జీఏడీ ముఖ్యకార్యదర్శికి సమ్మె నోటీసు ఇచ్చిన అనంతరం పీఆర్సీ సాధన సమితి నేతలు మీడియాతో మాట్లాడారు. చర్చల్లో భాగంగా తమ సమస్యలు ఆలకించామని ప్రభుత్వం చెబుతోందని.. వాటి పరిష్కారానికి ముందుకు రావడం లేదన ఆక్షేపించారు. 

తమనే కాకుండా పౌర సమాజాన్ని కూడా ప్రభుత్వం తప్పుదోవ పట్టిస్తోందని సూర్యనారాయణ ఆరోపించారు. నిన్నటి రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో వచ్చిన అభిప్రాయం మేరకే సమ్మె నోటీసు ఇవ్వాలని నిర్ణయించుకున్నామన్నారు. ఫిట్‌మెంట్‌, అశుతోష్‌ మిశ్రా కమిటీ నివేదిక, హెచ్‌ఆర్‌ఏ.. ఇలా అన్ని అంశాలపైనా చర్చించామని చెప్పారు. ఇదేదో ఆషామాషీ ఉద్యమం అనుకోవద్దని.. 13లక్షల మంది ఉద్యోగులు, పింఛనర్ల ఉద్యమమని గ్రహించాలన్నారు. హెచ్‌ఆర్‌ఏలో కోతలు పెట్టేలా జీవోలు ఇవ్వడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఐదుగురు సభ్యులతో కమిటీ వేసినట్లు తమకు అధికారిక సమాచారం లేదని.. ఆ కమిటీలో ఏం చర్చిస్తారో తమకు తెలియదన్నారు.

ఉద్యోగులకు లేని తొందర ప్రభుత్వానికి ఎందుకు : శ్రీనివాసరావు

ప్రభుత్వానికి సమ్మె నోటీసు లిచ్చినట్లు  ఏపీ ఎన్జీవోల సంఘం అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు వెల్లడించారు. కొత్త పీఆర్సీ ప్రకారం జీతాలు ఇవ్వాలని ట్రెజరీ ఉద్యోగులపై ఒత్తిడి తీసుకొస్తున్నారన్నారు. ఉద్యోగులకు లేని తొందర ప్రభుత్వానికి ఎందుకో అర్థం కావడం లేదని ఆయన విమర్శించారు. ఉద్యోగులు సానుకూలంగా స్పందించాలంటే పాత విధానంలోనే జీతాలు చెల్లించాలని డిమాండ్‌ చేశారు. ఉద్యమ సమయంలో ఉద్యోగులంతా క్రమశిక్షణతో మెలగాలని వ్యక్తిగత దూషణలు చేయవద్దని కోరారు.

పీఆర్సీ.. సంఘాలన్నింటినీ కలిపింది : వెంకట్రామిరెడ్డి

పీఆర్సీ వల్ల ఉద్యోగులకు జరిగిన అన్యాయం సంఘాలన్నింటినీ కలిపిందని సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి అన్నారు. గతంలో ఎప్పడూ సచివాలయ ఉద్యోగుల సంఘం ఇతర ఉద్యోగ సంఘాలతో కలిసి వెళ్లేదికాదని, కానీ. ఇప్పుడు అడుగు బయటకు వేశామంటే ప్రభుత్వం ఆలోచించాలన్నారు. జనవరి నెలకు పాత జీతాలు ఇవ్వాల్సిన అవసరం ఉందని తెలిపారు.11వ వేతన సవరణ సంఘం నివేదిక ఎందుకు దాచిపెట్టారో చెప్పాలన్నారు.పాత జీతాలు ఇచ్చి, పీఆర్సీ నివేదికను బహిర్గతం చేస్తేనే చర్చలకు వస్తామని స్పష్టం చేశారు.కొన్ని అంశాల్లో రాజీ పడేందుకు సిద్ధంగానే ఉన్నామని, జీతాలను పరిరక్షిస్తామని చెబుతూనే చీకటి జీవోలు ఇచ్చారని వెంకట్రామిరెడ్డి దుయ్యబట్టారు.

ఆందోళన ప్రతిబింబించింది : బొప్పరాజు వెంకటేశ్వర్లు

ఉద్యోగుల ఆందోళన ప్రతిబింబించేలా ప్రభుత్వానికి సమ్మె నోటీసులు ఇచ్చామని ఏపీ ఐకాస అమరావతి అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు అన్నారు. మంత్రుల కమిటీని జీవోలు జారీ చేయక ముందే వేస్తారని, పీఆర్సీ ప్రక్రియ పెట్టేముందే ఈ తరహా కమిటీ వేయాలని చెప్పారు. కానీ, జీవోలు ఇచ్చిన తర్వాత కమిటీలు వేయడం ఏంటో అర్థం కావడం లేదని ఆయన వ్యాఖ్యానించారు.ఫిట్‌మెంట్‌, హెచ్‌ఆర్‌ఏ అంశాలతో పాటు సీపీఎస్ రద్దు, కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ, అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల వేతనాలు పెంపు, ఎన్ఎంఆర్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ చేయాలని ప్రభుత్వాన్ని కోరామన్నారు.గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ప్రొబేషన్ ప్రకటించాలని కోరినట్లు తెలిపారు. ఘర్షణ వాతావరణం ఏర్పడకుండా ఉద్యమానికి పోలీసులు కూడా సహకరించాలని వెంకటేశ్వర్లు విజ్ఞప్తి చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని