ఆయువు తీసిన అనుకోని ఘటన
రైలు పట్టాలపై కూర్చుని యువకుని బలవన్మరణం
కొప్పుల శివ (పాతచిత్రం)
వినుకొండ, న్యూస్టుడే: ఆర్మీలో చేరాలని కలలుకన్న ఓ యువకుడు అనుకోకుండా చోటుచేసుకున్న ఓ సంఘటనతో మనస్తాపానికి గురయ్యాడు. ఈ క్రమంలోనే ఆత్మహత్య చేసుకోవాలనుకుని రైలు పట్టాలపై కూర్చున్నాడు. అంతలో స్నేహితుడికి ఫోన్ చేసి మాట్లాడుతుండగా రైలు ఢీకొట్టడంతో దుర్మరణం చెందాడు. వినుకొండలోని ఏనుగుపాలెం రైలు గేటు వద్ద సోమవారం అర్ధరాత్రి ఈ ఘటన జరిగింది. రైల్వే పోలీసుల కథనం ప్రకారం.. ప్రకాశం జిల్లా అద్దంకి మండలం వేలమూరిపాడు ఎస్సీ కాలనీకి చెందిన కొప్పుల శివ(24) ఆర్మీలో చేరాలన్న ఆలోచనతో కోచింగ్కు వెళ్లాలన్న ప్రయత్నంలో ఉన్నాడు. సోమవారం చరవాణిలో మరొకరితో మాట్లాడుతుండగా తన గురించి అంటున్నాడన్న అనుమానంతో అదే గ్రామానికి చెందిన ఓ మహిళ అతనితో గొడవ పడింది. అనంతరం రెండువర్గాల బంధువులు గొడవపడి దాడి చేసుకుని అద్దంకి పోలీస్స్టేషన్లో కేసులు పెట్టుకున్నారు. తనపై దాడిచేయడంతో పాటు కేసు పెట్టారని మనస్తాపంతో శివ వినుకొండకు వచ్చాడు. అదేరోజు రాత్రి 11.30 గంటల సమయంలో రైలు పట్టాలపై కూర్చుని తన స్నేహితుడికి ఫోన్ చేసి తాను చనిపోతున్నానని చెప్పాడు. ఈ సమాచారం అతను శివ కుటుంబ సభ్యులకు చెప్పడంతో ఉన్న ఫళంగా వారు బయలు దేరి వినుకొండ వద్దకు వచ్చారు. అప్పటికే అతను రైలు కింద పడిచనిపోవడంతో కన్నీరు మున్నీరయ్యారు. మృతదేహాన్ని రైల్వే పోలీసులు నరసరావుపేట ప్రభుత్వాసుపత్రిలో పోస్టుమార్టం అనంతరం మంగళవారం కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఘటనపై రైల్వే ఎస్సై ప్రకాష్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.