మద్యం విక్రయిస్తున్నాడన్న అనుమానంతో పోలీసుల తనిఖీలు.. దివ్యాంగుడి మృతి
టంగుటూరు: మద్యం విక్రయిస్తున్నాడన్న అనుమానంతో పోలీసులు ఓ దివ్యాంగుడిని కొట్టిన సంఘటన ప్రకాశం జిల్లా టంగుటూరు మండలంలో బుధవారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మండలంలోని ఎమ్.నిడమానూరు గ్రామానికి చెందిన దేవరపల్లి లక్ష్మీనారాయణ రెడ్డి (36) స్థానికంగా బడ్డీకొట్టు నిర్వహిస్తూ జీవనం సాగిస్తు్న్నారు. బుధవారం టంగుటూరుకు చెందిన నలుగురు పోలీసులు గ్రామానికి వచ్చి మద్యం విక్రయిస్తున్నాడన్న అనుమానంతో లక్ష్మీనారాయణ బడ్డీకొట్టులో తనిఖీలు చేశారు. ఈ క్రమంలో అతడిపై చేయి చేసుకున్నారు. అయితే, బడ్డీకొట్టు వద్ద చేసిన తనిఖీల్లో ఎలాంటి మద్యం పట్టుబడలేదు. దీంతో వారు లక్ష్మీనారాయణను వెంటబెట్టుకొని అతడి ఇంటి వద్ద తనిఖీలకు వెళ్లారు. ఈ క్రమంలో ఇంటికి వెళ్లగానే లక్ష్మీనారాయణ ఒక్కసారిగా కుప్పకూలి మృతి చెందాడు. ఈ ఘటనపై మృతుడి కుటుంబసభ్యులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోలీసుల వేధింపుల వల్లే లక్ష్మీనారాయణ మృతిచెందినట్లు ఆరోపించారు.