logo

కుంటపై కన్నేశారు!

టి వనరుల పునరుద్ధరణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తోంటే.. క్షేత్రస్థాయిలో మాత్రం అక్రమార్కులు వాటి ఉనికే లేకుండా చేస్తున్నారు. కళ్యాణదుర్గం పట్టణానికి ఆనుకుని ఉన్న సుబేదారుకుంటలో కొన్ని దశాబ్దాలుగా నీరు నిల్వ ఉంటోంది. పట్టణంలోని

Published : 26 May 2022 03:53 IST

మట్టితో చదును
స్థిరాస్తి వ్యాపారానికి యత్నం 


సుబేదారు కుంటను మట్టితో చదును చేస్తున్నారిలా.

ఈనాడు డిజిటల్, అనంతపురం, న్యూస్‌టుడే, కళ్యాణదుర్గం: నీటి వనరుల పునరుద్ధరణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తోంటే.. క్షేత్రస్థాయిలో మాత్రం అక్రమార్కులు వాటి ఉనికే లేకుండా చేస్తున్నారు. కళ్యాణదుర్గం పట్టణానికి ఆనుకుని ఉన్న సుబేదారుకుంటలో కొన్ని దశాబ్దాలుగా నీరు నిల్వ ఉంటోంది. పట్టణంలోని వరద నీరు మొత్తం ఇక్కడికే వచ్చి చేరుతుంది. దీంతో చుట్టుపక్కల గ్రామాల్లో భూగర్భ జలాలు పుష్కలంగా లభిస్తున్నాయి. కుంట నీటిని ఆధారంగా కొందరు పంటలు పండిస్తున్నారు. దీనికి ఆనుకుని జాతీయ రహదారి ఉండటంతో భూముల విలువ అమాంతం పెరిగిపోయింది. తాజాగా కొందరు వ్యక్తులు కుంట ప్రాంతాన్ని మట్టితో చదును చేస్తుండటం వివాదానికి దారీ తీసింది. చెరువును పూడ్చేసి, రియల్‌ఎస్టేట్‌ వ్యాపారం చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే కుంట ఆనుకుని ఓ వెంచర్‌ సిద్ధం చేశారు. ప్రైవేటు వ్యక్తులు కుంట ప్రాంతం చదును చేసి వెంచర్లు అభివృద్ధి చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. 

నిబంధనలు ఉన్నా.. 
పూర్వం గ్రామాల్లోని అత్యధిక శాతం భూమి కరణాల పేరు మీదనే ఉండేది. చెరువులు, నీటి కుంటలు కూడా డైగ్లాట్‌లో కరణాల పేరుతో నమోదైనట్లు అధికారులే చెబుతున్నారు. నిజానికి చెరువులు, నీటి కుంటలకు సంబంధించి పట్టా భూములైనా సరే ఎలాంటి పరిస్థితుల్లో వాటిని పూడ్చివేయడం, తొలగించడం వంటివి చేయరాదని సుప్రీంకోర్టు ఉత్తర్వులు ఉన్నాయి. దీన్ని అధికారులు పట్టించుకోవడం లేదు. సుబేదారుకుంటను పూడ్చేందుకు మట్టి తవ్వకాలకు కూడా ఎలాంటి అనుమతి లేదని రెవెన్యూ అధికారులే చెబుతున్నారు. కుంటను పూడ్చివేసే పనుల్ని మాత్రం నిలిపేసేందుకు అధికారులకు ధైర్యం రావడం లేదని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. నీటి వనరులైన చెరువులు, కుంటలు పట్టాభూమిలో ఉన్నా సాధ్యమైనంతవరకు వ్యవసాయానికే వినియోగించాలని నిబంధనలు ఉన్నాయి. 

రికార్డులో ఒకలా.. పటంలో మరోలా
కళ్యాణదుర్గం ఆనుకుని సర్వే నెంబరు 329లో 92.81 ఎకరాల విస్తీర్ణం ఉంది. రెవెన్యూ రికార్డుల ప్రకారం 44 మంది పేర్లతో పట్టాలు ఉన్నాయి. ఇందులో 19 ఎకరాలను సీలింగ్‌ కింద ఆరుగురు రైతులకు కేటాయించారు. 1.50 ఎకరాలను అనంతపురం-రాయదుర్గం జాతీయ రహదారి నిర్మాణానికి తీసుకున్నారు. ఖాతా నెం 28 ప్రకారం పంపన్నగారి గంగమ్మ, ఓరుగళ్లప్పగారి కరణం చిక్కప్ప, ఓరుగళ్లప్పగారి కరణం తిప్పేస్వామి పేర్ల మీదుగా పట్టాలు ఉన్నట్లు తెలుస్తోంది. సుమారు 40 ఎకరాల్లో ఎల్లప్పుడూ నీరు నిల్వ ఉంటోంది. ఆ భూమి వ్యవసాయానికి పనికిరాకుండా పోయింది. రెవెన్యూ రికార్డుల ప్రకారం పట్టా భూమి అయినప్పటికీ గ్రామ పటంలో మాత్రం ‘సుబేదారుచెరువు’గా నమోదు చేశారు. రికార్డుల్లో ఒకలా.. గ్రామపటంలో మరోలా ఉండటంతో వివాదం తలెత్తుతోంది. ఆ ప్రాంతంలో కొన్ని దశాబ్దాలుగా నీటి కుంట ఉందని.. అది పట్టాభూమి కాదని స్థానికులు చెబుతున్నారు. స్థానిక ప్రజాప్రతినిధి ధనార్జన కోసమే కుంటను పూడ్చి వ్యాపారం చేయాలని చూస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. తెదేపా నాయకులు రెండు రోజులపాటు దీక్ష చేయడంతో వివాదం మరింత ముదిరింది. 

ఇదీ వివాదం
కుంట విస్తరించి ఉన్న భూమికి సంబంధించి క్రయవిక్రయాలు నిలిపివేయాలని కొందరు 2015లో అప్పటి ముఖ్యమంత్రి పేషీలో పిటిషన్‌ వేశారు. దీనిపై విచారణకు ఆదేశించారు. అప్పటి తహసీల్దార్‌ రికార్డులు పరిశీలించి 329 సర్వే నంబరులో 92 ఎకరాలను పట్టాభూమిగా తేల్చారు. అందులోని దక్షిణం వైపున 33 ఎకరాల విస్తీర్ణం వరకు నీటి నిల్వ ప్రాంతంగా ఉన్నట్లు నివేదికలో పేర్కొన్నారు. దీంతో పూర్తిస్థాయిలో సర్వే నిర్వహించే వరకు సదరు సర్వే నంబరుపై ఎలాంటి రిజిస్ట్రేషన్‌లు చేయకూడదని 2020లో అప్పటి జేసీ డిల్లీరావు ఆదేశాలు ఇచ్చారు. తర్వాత కొద్ది రోజులకు విచారణ పూర్తిచేసి రిజిస్ట్రేషన్‌ చేసుకోవచ్చని ఆదేశాలు జారీచేశారు. 

పట్టణానికి వరద ముప్పు
సుబేదారుకుంటను పూడిస్తే భూగర్భ జలాలకే కాకుండా కళ్యాణదుర్గం పట్టణానికి కూడా ముప్పు పొంచి ఉంది. పట్టణంలోని శివారు కాలనీల నుంచి వచ్చే వరద నీరు మొత్తం ఈ కుంటలోకి వచ్చి చేరుతుంది. డ్రైనేజీ కూడా ఇందులోనే కలుస్తోంది. కుంటను చదును చేస్తే భారీ వర్షాలు కురిసిన సమయంలో పట్టణానికి వరద ముంచెత్తే ప్రమాదం ఉంది. ఈ కోణంలోనూ సుబేదారుకుంటను కాపాడాల్సిన బాధ్యత అధికారులపై ఉందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. 

రికార్డుల్లో పట్టాభూమిగానే ఉంది
సర్వే నంబరు 329కు సంబంధించి అన్ని రికార్డుల్లో పట్టాభూమిగానే నమోదై ఉంది. దీనిపై గతంలోనే జేసీ స్థాయిలో విచారణ జరిపి పట్టాభూమిగానే తేల్చారు. తాజా వివాదం నేపథ్యంలో క్షుణ్ణంగా రికార్డులు పరిశీలించాలని తహసీల్దారుకు ఆదేశాలు జారీ చేశాం. - నిశాంత్‌రెడ్డి, ఆర్డీవో, కళ్యాణదుర్గం 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని