logo

నిరసన గళం.. ప్రొబేషన్‌పై ప్రభావం

ప్రొబేషన్‌ డిక్లరేషన్‌ కోసం ఎనిమిది నెలలుగా నిరీక్షిస్తున్న గ్రామవార్డు సచివాలయ ఉద్యోగులపై మరో పిడుగు పడింది. ప్రొబేషన్‌ డిక్లరేషన్‌ చేయాలని డిమాండు చేస్తూ ఈ ఏడాది జనవరిలో మూడు రోజులపాటు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సామూహిక ఆందోళన కార్యక్రమాలు చేపట్టిన విషయం తెలిసిందే.

Published : 30 Jun 2022 02:43 IST

సచివాలయ ఉద్యోగుల్లో ఆందోళన

నేడు ఉత్తర్వుల జారీ

జిల్లా సచివాలయం, న్యూస్‌టుడే

వార్డు సచివాలయం

ప్రొబేషన్‌ డిక్లరేషన్‌ కోసం ఎనిమిది నెలలుగా నిరీక్షిస్తున్న గ్రామవార్డు సచివాలయ ఉద్యోగులపై మరో పిడుగు పడింది. ప్రొబేషన్‌ డిక్లరేషన్‌ చేయాలని డిమాండు చేస్తూ ఈ ఏడాది జనవరిలో మూడు రోజులపాటు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సామూహిక ఆందోళన కార్యక్రమాలు చేపట్టిన విషయం తెలిసిందే. ఆరు మాసాల తర్వాత ఈ వ్యవహారాన్ని ప్రభుత్వం తెరపైకి తీసుకొస్తున్నట్లు సమాచారం. ఆందోళనలో క్రియాశీలకంగా పాల్గొన్న ఉద్యోగుల డిక్లరేషన్‌ను పక్కన (హోల్డ్‌) పెట్టాలన్న సంకేతాలు అందినట్లు చర్చ నడుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో 5 ప్రకారం ఈనెల 30లోపు ప్రొబేషన్‌ డిక్లరేషన్‌ ప్రకటించాలి. ఈ మేరకు గురువారం కలెక్టర్‌, మున్సిపల్‌ ఆర్డీ, సంబంధిత శాఖల జిల్లా అధికారులు ఉత్తర్వులు జారీ చేసే అవకాశం ఉంది.

అందరిలోనూ ఉత్కంఠ

జనవరి నెలలో జరిగిన ఆందోళనలో ఎవరెవరు పాల్గొన్నారో ప్రాథమిక జాబితా తయారు చేశారు. మొత్తంగా 130 మంది పేర్లు సేకరించారు. జాబితా కలెక్టర్‌, ఇతర జిల్లా అధికారులకు చేరినట్లు సమాచారం. 130 మంది ఆందోళనలో కీలకంగా పాల్గొన్నారా లేదా అన్న దానిపై సమాచారం పంపాలంటూ మున్సిపల్‌ కమిషనర్లు, ఎంపీడీఓలకు పంపించినట్లు తెలిసింది. గుట్టుగా సాగుతున్న ఈ వ్యవహారం ఉద్యోగులకు తెలిసింది. జాబితాలో ఎవరి పేర్లు ఉన్నాయన్న దానిపై ఆరా తీస్తున్నారు. ప్రొబేషన్‌ డిక్లరేషన్‌ చేస్తారా లేదా అన్న దానిపై ఉత్కంఠ నెలకొంది.

గుప్పెట్లో పెట్టుకోవడానికేనా?

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 1207 సచివాలయాలు ఉన్నాయి. అందులో పట్టణాల్లో 311, గ్రామాల్లో 896 చొప్పున ఏర్పాటయ్యాయి. అనంత జిల్లాలో 699 గ్రామ వార్డు సచివాయాలు.. శ్రీసత్యసాయి జిల్లాలో 508 ఉన్నాయి. దాదాపు 10వేల మందికిపైగా ఉద్యోగులు పని చేస్తున్నారు. సుమారు 8 వేల మంది ప్రొబేషన్‌ డిక్లరేషన్‌కు అర్హత పొందారు. అనంత జిల్లాలోనే 4,448 మంది అర్హుల జాబితాలో ఉన్నారు. జీవో 5 ప్రకారం వేతన స్కేలును నిర్ణయించారు. 2021 అక్టోబరు నాటికే రెండేళ్లు పూర్తయింది. అప్పటి నుంచే బకాయిలతో కూడిన వేతనం ఇవ్వాలన్న డిమాండు ఉద్యోగుల్లో ఉంది. డిక్లరేషన్‌ తర్వాత బకాయిలు అడుగుతారేమోనన్న భయం ప్రభుత్వాన్ని వేధిస్తోంది. అందుకే ముందస్తు ఉద్యోగులను గుప్పెట్లో పెట్టుకోవడానికే జనవరిలో జరిగిన ఆందోళనను తెరపైకి తెచ్చినట్లు ప్రచారం సాగుతోంది.

అర్హులకు అవకాశం

- కేశవనాయుడు, ఓఎస్‌డీ

ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం అర్హత పొందిన గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు ప్రొబేషన్‌ డిక్లరేషన్‌ ఉత్తర్వులు జారీ చేస్తాం. ఇందుకు అన్నీ సిద్ధం చేశాం. రెండేళ్లు సర్వీసు, నిర్దేశిత పరీక్షలో ఉత్తీర్ణత పొందిన వారికి ఉత్తర్వు జారీ అవుతుంది. గురువారం ఉత్తర్వు ఇవ్వనున్నారు. ఆందోళనలో పాల్గొన్న వారికి ప్రొబేషన్‌పై ప్రభావం ఉంటుందన్న దానిపై మాకు సమాచారం లేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని