logo

నాకు చెప్పకుండా పనులెలా చేస్తావ్‌!

‘మా పంచాయతీలో ఏం జరుగుతుందో చెప్పవా.. నాకు చెప్పకుండా ఏం చేస్తున్నావ్‌? నాకు తెలియకుండా పనులు ఎట్టా చేస్తావ్‌? నీకు దమ్ముంటే.. నా పంచాయతీలోకి రా..’ అంటూ చెన్నేకొత్తపల్లి మండలం పులేటిపల్లి గ్రామ అధికార పార్టీ సర్పంచి భర్త భాస్కర్‌రెడ్ఢి.

Published : 30 Jun 2022 02:43 IST

సచివాలయ ఇంజినీరింగ్‌ అసిస్టెంట్‌పై సర్పంచి భర్త బెదిరింపు

చెన్నేకొత్తపల్లి, న్యూస్‌టుడే: ‘మా పంచాయతీలో ఏం జరుగుతుందో చెప్పవా.. నాకు చెప్పకుండా ఏం చేస్తున్నావ్‌? నాకు తెలియకుండా పనులు ఎట్టా చేస్తావ్‌? నీకు దమ్ముంటే.. నా పంచాయతీలోకి రా..’ అంటూ చెన్నేకొత్తపల్లి మండలం పులేటిపల్లి గ్రామ అధికార పార్టీ సర్పంచి భర్త భాస్కర్‌రెడ్ఢి. ఇంజినీరింగ్‌ అసిస్టెంట్‌ శ్రీకాంత్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. వీటికి సంబంధించిన ఆడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ‘అన్ని విషయాలు చెప్పాను కదా..’ అని సదరు ఉద్యోగి చెప్పినా ‘ఒకసారి చెబితే సరిపోతుందా..’ అంటూ ఊగిపోయారు. ‘నాకు చెప్పకుండా నా పంచాయతీలో మీ కులంవాళ్లకు బిల్లులు చేస్తావా?’ అంటూ గద్దించారు. అనంతరం విధులకు హాజరయ్యేందుకు ఉద్యోగి ద్విచక్ర వాహనంపై వెళుతుండగా ఎదురుగా వచ్చిన అధికారపార్టీ నేత, సర్పంచి భర్త అతన్ని అడ్డగించి భౌతిక దాడికి దిగినట్లు తెలిసింది. విషయం తెలుసుకున్న కొందరు నాయకులు రంగంలోకి దిగి ఉద్యోగిని చెన్నేకొత్తపల్లి ఎంపీడీవో సరస్వతి గదిలోకి తీసుకెళ్లి మాట్లాడారు. అనంతరం ఎంపీడీవో సచివాలయ ఉద్యోగులతో సమావేశం నిర్వహించారు. ఆ సమయంలో అక్కడికి వెళ్లిన విలేకరులను లోపలికి అనుమతించలేదు. సాయంత్రం నాలుగు గంటల సమయంలో తనపై భాస్కర్‌రెడ్డి దాడికి పాల్పడలేదని, సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారిన ఆడియోను ఆపేయాలని ఇంజినీరింగ్‌ అసిస్టెంట్‌ శ్రీకాంత్‌ పేర్కొనడం గమనార్హం. ఈ విషయంపై తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని, అందితే కేసు నమోదు చేస్తామని ఎస్సై శ్రీధర్‌ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని