logo

పండగపూట విషాదం

పండగపూట ఆ ఇంట విషాదం నెలకొంది. విద్యుదాఘాతంతో యువకుడు మృతి చెందాడు. ఈ ఘటన ఉరవకొండ మండలంలో చోటుచేసుకుంది.

Published : 05 Oct 2022 01:56 IST

విద్యుదాఘాతంతో యువకుడి మృతి

మారుతి (పాతచిత్రం)

ఉరవకొండ: పండగపూట ఆ ఇంట విషాదం నెలకొంది. విద్యుదాఘాతంతో యువకుడు మృతి చెందాడు. ఈ ఘటన ఉరవకొండ మండలంలో చోటుచేసుకుంది. స్థానికులు, కుటుంబసభ్యుల వివరాల మేరకు.. నింబగల్లులోని నర్సింహ, భీమక్క దంపతులకు కుమారుడు, కుమార్తె ఉన్నారు. కుమార్తెకు వివాహమైంది. కుమారుడు మారుతిని పదోతరగతి వరకు చదివించారు. కౌలుకు మిరప సాగు చేస్తున్నారు. నీరు పెట్టేందుకు మారుతి(21) మంగళవారం ఉదయం తల్లిదండ్రులతో కలిసి ఉదయం పొలానికి వెళ్లాడు. అనంతరం మోటారుని ఆపేసే క్రమంలో విద్యుదాఘాతానికి గురయ్యాడు. అక్కడున్న తోటి రైతులు గమనించి పక్కకు లాగినా అప్పటికే మృతి చెందాడు. ఒక్కగానొక్క కొడుకు.. కుటుంబానికి బాసటగా నిలుస్తాడనుకున్న తరుణంలో వదిలివెళ్లావంటూ కుటుంబీకులు కన్నీరుమున్నీరుగా విలపించారు.

పోస్టుమార్టంపై గందరగోళం... పోలీసులు మృతదేహాన్ని ఉరవకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు పరిశీలించి మృతి చెందినట్లు నిర్ధారించారు. తమ అనుమతి లేకుండానే పోస్టుమార్టం ఎలా చేస్తారని బాధిత కుటుంబ సభ్యులు, బంధువులు ఆసుపత్రి ప్రాంగణంలో ఆందోళనకు దిగారు. కొద్దిసేపు గందరగోళ వాతావరణం నెలకొంది. పోలీసులు సర్దిచెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని