logo

వివాహ వేడుకకు వెళ్తూ.. తిరిగిరాని లోకాలకు

వివాహానికి వెళ్తూ.. కారు అదుపుతప్పిన ప్రమాదంలో ఓ మహిళ దుర్మరణం చెందగా.. కుమారుడు, కుమార్తె గాయాలకు గురయ్యారు.

Published : 02 Dec 2022 06:08 IST

కారు ప్రమాదంలో మహిళ దుర్మరణం

తల్లి మృతదేహం వద్ద రోదిస్తున్న కుమార్తె, కుమారుడు

చెన్నేకొత్తపల్లి, న్యూస్‌టుడే: వివాహానికి వెళ్తూ.. కారు అదుపుతప్పిన ప్రమాదంలో ఓ మహిళ దుర్మరణం చెందగా.. కుమారుడు, కుమార్తె గాయాలకు గురయ్యారు. ఈ ఘటన చెన్నేకొత్తపల్లికి సమీపంలోని కోనక్రాస్‌ వద్ద గురువారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు హైదరాబాద్‌ కొత్తపేటకు చెందిన పద్మశాంతిదుర్గ (59), తన కుమారుడు అరవింద శ్రీమాన్‌ దుర్గ, కుమార్తె దుర్గా అభిలాష, మనువరాలితో కలిసి బెంగళూరులో బంధువుల ఇంట్లో జరిగే వివాహ వేడుకకు హాజరయ్యేందుకు వెళుతున్నారు. చెన్నేకొత్తపల్లికి సమీపంలోని కోనక్రాస్‌ వద్ద కారు అదుపుతప్పి పొలాల్లోకి దూసుకెళ్లింది. పెద్దరాళ్లను ఢీకొనడంతో పూర్తిగా దెబ్బతింది. కారులో ప్రయాణిస్తున్న పద్మశాంతిదుర్గ ఘటనా స్థలంలోనే మృతి చెందారు. స్వల్పంగా గాయపడిన కుమార్తె, కుమారుడిని అత్యవసర వాహనంలో చెన్నేకొత్తపల్లి సీహెచ్‌సీకి తరలించారు. కళ్లముందే తల్లి విగతజీవిగా మారడంతో కుమార్తె, కుమారుడు గుండెలవిసేలా రోదించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని