logo

ఎమ్మెల్సీ లేరని అంబేడ్కర్‌ విగ్రహావిష్కరణ వాయిదా వేస్తారా?

‘డాక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్‌ వర్ధంతి సందర్భంగా మున్సిపల్‌ కార్యాలయంలో ఉద్యోగులు, దాతల సహకారంతో ఏర్పాటు చేసిన విగ్రహాన్ని ఆవిష్కరించేందుకు ఘనంగా ఏర్పాట్లు చేశాం.

Published : 07 Dec 2022 04:15 IST

హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్‌ను అడ్డుకున్న దళిత సంఘాలు

హిందూపురంఅర్బన్‌, న్యూస్‌టుడే: ‘డాక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్‌ వర్ధంతి సందర్భంగా మున్సిపల్‌ కార్యాలయంలో ఉద్యోగులు, దాతల సహకారంతో ఏర్పాటు చేసిన విగ్రహాన్ని ఆవిష్కరించేందుకు ఘనంగా ఏర్పాట్లు చేశాం. ఎమ్మెల్సీ మహ్మద్‌ ఇక్బాల్‌ ఊళ్లో లేరని వాయిదా వేస్తారా..?’ అంటూ హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్‌ను దళిత సంఘాల నాయకులు అడ్డుకున్నారు. హిందూపురం పట్టణం అంబేడ్కర్‌ కూడలిలో మంగళవారం ఉదయం అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించేందుకు ఎంపీ గోరంట్ల మాధవ్‌, మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌ ఇంద్రజ వచ్చారు. విగ్రహానికి పూలమాల వేసేందుకు వెళుతుండగా లైఫ్‌ వరల్డ్‌ ఛారిటబుల్‌ ట్రస్టు వ్యవస్థాపకులు ఉదయ్‌కుమార్‌, దళిత సంఘ నాయకులు సతీష్‌కుమార్‌, ఆంజనేయులు అడ్డుకున్నారు. ముందు మున్సిపల్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన అంబేడ్కర్‌ విగ్రహాన్ని ఆవిష్కరించిన తర్వాతే ఇక్కడ పూలమాల వేయాలని పట్టుబట్టారు. ఖంగుతిన్న ఎంపీ విగ్రహావిష్కరణను ఎవరూ ఆపలేదని, ఆవిష్కరిద్దామని చెప్పడంతో వారు శాంతించారు. ఆ తర్వాత అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. అక్కడి నుంచి మున్సిపల్‌ కార్యాలయానికి చేరుకొని నూతనంగా ఏర్పాటు చేసిన అంబేడ్కర్‌ విగ్రహాన్ని ఆవిష్కరించి, పూలమాలలు వేసి నివాళి అర్పించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని