logo

వైరల్‌గా మారిన బాలిక పెళ్లి వీడియో

బాలికకు ప్రేమికుడు తాళి కట్టిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఇందుకు సంబంధించి విశ్వసనీయ సమాచారం ఇలా.. మండలంలోని ఓ గ్రామానికి చెందిన ఎనిమిదో తరగతి చదువుతున్న ఓ బాలికతో స్థానిక యువకుడు కొంతకాలం ప్రేమాయణం నడిపాడు.

Published : 20 Jan 2023 05:37 IST

విచారణ చేపట్టిన ఐసీడీఎస్‌ అధికారులు

ఉరవకొండ, న్యూస్‌టుడే: బాలికకు ప్రేమికుడు తాళి కట్టిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఇందుకు సంబంధించి విశ్వసనీయ సమాచారం ఇలా.. మండలంలోని ఓ గ్రామానికి చెందిన ఎనిమిదో తరగతి చదువుతున్న ఓ బాలికతో స్థానిక యువకుడు కొంతకాలం ప్రేమాయణం నడిపాడు. పెళ్లి చేసుకుంటానని బాలికను నమ్మించి శారీరకంగా లొంగదీసుకున్నాడు. కొందరు గ్రామస్థులు యువకుడిని నిలదీయడంతో రెండురోజుల క్రితం బాలికకు ఇంటివద్దే అందరూ చూస్తుండగా తాళికట్టాడు. ఆ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది. విషయం తెలుసుకున్న ఐసీడీఎస్‌ అధికారులు గురువారం గ్రామంలో విచారణ జరిపారు. మైనర్‌ను వివాహం చేసుకున్న యువకుడిపై పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని బాలిక తల్లిదండ్రులకు సూచించారు. చైల్డ్‌లైన్‌కు కూడా ఫిర్యాదు చేశారు. బాలిక చదువు కొనసాగించేలా కేజీబీవీలో ప్రవేశం కల్పించడానికి చర్యలు చేపడతామని సీడీపీఓ డాక్టరు శ్రీదేవి చెప్పారు.


ప్రభోదానంద కేసులో తెదేపా కౌన్సిలర్‌ అరెస్టు

తాడిపత్రి, న్యూస్‌టుడే: తాడిపత్రి మండలంలోని చిన్నపొలమడ గ్రామంలో 2018 సంవత్సరంలో గ్రామస్థులు, ప్రభోదానంద భక్తులు పరస్పరం దాడులు చేసుకున్న కేసులో అరెస్టుల పరంపర ఇంకా కొనసాగుతోంది. నాలుగు సంవత్సరాల కాలంలో ఇప్పటికే వందల సంఖ్యలో జేసీ అనుచరులైన తెదేపా నాయకులను అరెస్టు చేసి రిమాండుకు పంపిన విషయం తెలిసిందే. తాజాగా గురువారం పురపాలక 26వ వార్డు తెదేపా కౌన్సిలర్‌ షేక్షావలిపై ప్రభోదానంద కేసుకు సంబంధించి హత్యాయత్నం, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ సహా పలు కేసులు నమోదు చేసి రిమాండుకు పంపినట్లు పోలీసులు చెప్పారు.


ఏఆర్‌ మాజీ కానిస్టేబుల్‌ ప్రకాష్‌ హత్యకు కుట్ర కేసులో నలుగురిపై కేసు

అనంత నేరవార్తలు, న్యూస్‌టుడే: ఏఆర్‌ మాజీ కానిస్టేబుల్‌ ప్రకాష్‌ హత్యకు కుట్రపన్నిన కేసులో అతని భార్య నాగమణి, ప్రణాళిక రచించిన ఖమ్మంకు చెందిన నిజాముద్దీన్‌ అలియాస్‌ స్వామీజీ, మరో ఇద్దరిపై అనంతపురం టూటౌన్‌లో గురువారం కేసు నమోదైంది. ఇటీవల శ్రీసత్యసాయి జిల్లా నల్లమాడ మండలంలో నమోదైన గుప్తనిధుల కేసులో ప్రధాన నిందితుడు నిజాముద్దీన్‌ను అక్కడి పోలీసులు విచారించే క్రమంలో ప్రకాష్‌ హత్యకుట్ర కోణం బయటపడింది. అక్కడి పోలీసులు కేసును అనంతపురం టూటౌన్‌కు బదిలీ చేశారు. టూటౌన్‌ పోలీసులు నాగమణితో పాటు నిజాముద్దీన్‌ను గురువారం విచారించినట్లు తెలిసింది. ‘తన భర్త వివాహేతర సంబంధం పెట్టుకుని తనను, కుటుంబాన్ని నిర్లక్ష్యం చేస్తుండటం, డిస్మిస్‌ అయిన తర్వాత వేధింపులకు గురి చేయడంతో హత్య చేయాలని నిర్ణయించుకున్నట్లు ఆమె విచారణలో వెల్లడించినట్లు సమాచారం. మూడు నెలలుగా హత్యకు ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది. ఈ క్రమంలో స్వామీజీ నిజాముద్దీన్‌తో హత్య విషయమై చర్చించింది. రెండు నెలల క్రితం అతను క్షుద్రపూజలు చేశాడు. ఫలితం లేకపోవడంతో విషమిచ్చి హతమార్చాలని పన్నాగం పన్నారు. ఈ నెల 1న కానిస్టేబుల్‌ ప్రకాష్‌ అనంతపురంలో అంబేడ్కర్‌ విగ్రహం ఎదుట నిరసనకు దిగడంతో అదే రోజు పోలీసులు రిమాండుకు పంపారు. జైలు నుంచి రాగానే చంపాలని పథకం రచించారు. ఇందుకు శ్రీనివాస్‌, రామ్‌రాజ్‌ అనే వ్యక్తులకు సుపారీ ఇచ్చినట్లు తెలిసింది. ఇంతలో గుప్తనిధుల కేసులో అరెస్టు కావడంతో కుట్ర బహిర్గతమైంది. ఈ కేసులో పైనలుగురిని అరెస్టు చేసి గురువారం రిమాండ్‌కు పంపినట్లు టూటౌన్‌ సీఐ శివరాముడు తెలిపారు.


 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని