logo

రైతుల సొమ్ము స్వాహా

ట్రాన్స్‌కోలో పనిచేస్తున్న ఒక ఏఈ తన తెలివితేటలను ప్రదర్శించి అడ్డంగా దొరికిపోయాడు.

Published : 02 Feb 2023 05:24 IST

బాధితుల ఫిర్యాదుతో వెలుగులోకి ట్రాన్స్‌కో ఏఈ బాగోతం

అనంత (విద్యుత్తు), న్యూస్‌టుడే: ట్రాన్స్‌కోలో పనిచేస్తున్న ఒక ఏఈ తన తెలివితేటలను ప్రదర్శించి అడ్డంగా దొరికిపోయాడు. రైతులకు పరిహారంగా ఇవ్వాల్సిన మొత్తాన్ని నిబంధనలకు తిలోదకాలు ఇచ్చి తన ఖాతాలోకి జమ చేసుకున్నాడు. తమ పరిహారం అందకపోవటంతో ఎందుకు విడుదల చేయడం లేదని రైతులు ట్రాన్స్‌కో ఉన్నతాధికారులను ప్రశ్నించటంతో అధికారులు ఆరాతీశారు. దీంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఉమ్మడి అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాలకు సంబంధించిన ట్రాన్స్‌కో ప్రధాన కార్యాలయం అనంతపురంలోని బళ్లారిరోడ్డులో ఉంది. ఇందులో టీఎల్‌సీ విభాగంలో పనిచేసే ఓ ఏఈ నిధులు నొక్కేశాడు.


రూ.25 లక్షలకు పైగా ..

ఉమ్మడి జిల్లా పరిధిలో భానుకోట నుంచి హిందూపురం వరకు 220 కేవీ విద్యుత్తు లైన్‌ను 60 కిలోమీటర్లు ట్రాన్స్‌కో ఏర్పాటు చేస్తోంది. ఈ లైన్‌కు సంబంధించి రమారమి 330 నుంచి 350 మీటర్ల మేర ఒక టవర్‌ ఏర్పాటు చేయాల్సి ఉంది. రైతుల భూముల్లో ఒక్కో టవర్‌ (ఫోర్‌లెగ్స్‌) ఏర్పాటు చేస్తే రూ.99 వేలు పరిహారం అందజేస్తారు. అలాగే భూమిలో ఏదైనా పంట సాగుచేసి ఉంటే అందులో టవర్‌ ఏర్పాటుకు అయ్యే భూమి వివరాల ప్రకారం వ్యవసాయ అధికారుల నివేదికకు అనుగుణంగా నష్టపరిహారం ఇస్తారు. నేరుగా కర్షకుల పేర్ల మీదనే పరిహారం మొత్తం చెక్కుల రూపంలోనే అందజేస్తుంది. వాటిని రైతులు తమకు ఖాతాలున్న బ్యాంకుల్లో అందజేస్తే బ్యాంకు అధికారులు పరిశీలించి నిధులు జమ చేస్తారు. అయితే సదరు ఏఈ రైతుల పేర్లమీద వచ్చిన చెక్కులను తన ఖాతాలోకి మళ్లించుకుని వాడుకున్న విషయంపై సర్వత్రా చర్చ జరుగుతోంది. ఈ వ్యవహారంలో ఏఈ ఒక్కడే ఉన్నాడా, లేక బ్యాంకు ఉద్యోగుల సహకారం ఉందా అనే అంశాలపై ట్రాన్స్‌కో అధికారులు ఆరా తీస్తున్నారు. విషయాన్ని బయటకు పొక్కకుండా చర్యలు తీసుకుంటున్నట్లు సమాచారం. సదరు ఏఈ విధుల్లో చేరినప్పటి నుంచి తన సహచర ఉద్యోగులతో కొంత మొత్తం అప్పు తీసుకోవటం, తిరిగి చెల్లించకపోవటంతో చెడ్డపేరు తెచ్చుకున్నాడు. రూ.15 లక్షలపైగా అప్పులు చేసినట్లు ట్రాన్స్‌కో ఉద్యోగులు తెలుపుతున్నారు.


అంతా గోప్యత..

రూ.25 లక్షలకు పైగా స్వాహా చేసినా ట్రాన్స్‌కో అధికారులు మాత్రం గోప్యత పాటించటంపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. అక్రమాలకు పాల్పడిన అధికారిపై చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులు ఆదేశాలు ఇచ్చినా.. వాటిని వెలుగులోకి రాకుండా కొంతమంది అధికారులు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసింది. ఏఈ వ్యవహారంపై అనంతపురం, కర్నూలు ఉమ్మడి జిల్లాల కన్‌స్ట్రక్షన్‌ ఎస్‌ఈ రామకృష్ణ, అనంతపురం ట్రాన్స్‌కో టీఎల్‌సీ విభాగం డీఈఈ ఉమమాహేశ్వర్‌ దృష్టికి ‘న్యూస్‌టుడే’ తీసుకెళ్లగా సమాచారం ఇచ్చే అధికారం తమకులేదని తెలిపారు. కార్యాలయ విషయాలను వెల్లడించలేమని పేర్కొనటం గమనార్హం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని