logo

ఇంకుడు గుంతనూ వదల్లేదు..

భూ ఆక్రమణదారులు రెచ్చిపోతున్నారు. ప్రభుత్వభూమి కనిపిస్తే చాలు కలిపేసుకుంటున్నారు. ప్రభుత్వభూమిని యథేచ్ఛగా ఆక్రమించుకుంటున్నా సంబంధిత యంత్రాంగం కన్నెత్తి చూడకపోవడం విమర్శలకు తావిస్తోంది.

Published : 27 Mar 2023 05:22 IST

రెచ్చిపోతున్న భూఆక్రమణదారులు..
మొద్దు నిద్రలో అధికారులు

చెక్‌డ్యామ్‌ను ఆక్రమిస్తూ కంచె ఏర్పాటు

కదిరి పట్టణం, న్యూస్‌టుడే: భూ ఆక్రమణదారులు రెచ్చిపోతున్నారు. ప్రభుత్వభూమి కనిపిస్తే చాలు కలిపేసుకుంటున్నారు. ప్రభుత్వభూమిని యథేచ్ఛగా ఆక్రమించుకుంటున్నా సంబంధిత యంత్రాంగం కన్నెత్తి చూడకపోవడం విమర్శలకు తావిస్తోంది. భూగర్భ జలాలను పెంచే క్రమంలో లక్షలాది రూపాయలు వెచ్చించి నిర్మించిన చెక్‌డ్యామ్‌లు, ఇంకుడు గుంతలనూ ఆక్రమిస్తున్నా రెవెన్యూ అధికారులు మొద్దునిద్రలో ఉన్నారు. నల్లచెరువు మండలం అల్లుగుండు రెవెన్యూ పొలంలోని సర్వేనంబరు 556లోని ప్రభుత్వం భూమిని గతంలో కొందరు రైతులకు పట్టాలు ఇచ్చారు. ఆ తరువాత అవి భూములు చేతులు మారాయి. సర్వేనంబరు 556లో 6 లెటర్లుగా విభజించి పట్టాలు పంపిణీ చేశారు. 3, 4, లెటర్లలో రెండెకరాలకుపైగా ప్రభుత్వ భూమి ఉంది. ఇటీవల భూమిని కొనుగోలు చేసినవారు ఆనుకుని ఉన్న వంకను ఆక్రమించుకునేశారు. ప్రభుత్వ భూమిని కబ్జా చేసేందుకు యత్నిస్తున్నారని స్థానికులు అంటున్నారు. ఇప్పటికే వందల ఎకరాల కొండలను ఆక్రమించుకుని కంచె ఏర్పాటుచేసుకున్నా పట్టించుకోవడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి కబ్జాదారులపై చర్యలు తీసుకుని ప్రభుత్వ భూమిని కాపాడాలని కోరుతున్నారు. కదిరి- మల్లయ్యగారిపల్లికి వెళ్లే రోడ్డుకు ఆనుకుని ఉన్న వంక దాదాపు ఒకటిన్నర కిలోమీటరు వ్యాపించి ఉంది. కారెడ్డిపల్లి, మల్లయ్యగారిపల్లి, కొత్తపల్లి వైపునుంచి వచ్చే వర్షపునీరు వంక ద్వారా ప్రవహించి సమీపంలోని ఇందుకూరిపల్లి వాగులో కలుస్తుంది. గతంలో ఈవంకపై చెక్‌డ్యామ్‌ నిర్మించి, ఇంకుడు గుంతలను తవ్వారు. వంకకు ఆనుకుని ఉన్న రైతులు భూమిని చదునుచేసి బండరాళ్లతో కొన్నిచోట్ల వంకను పూడ్చివేశారు. మిగతా ప్రాంతాన్ని ఆక్రమించుకుంటూ కంచెను ఏర్పాటు చేశారు. దాదాపు నాలుగు నెలలుగా ఈతంతు కొనసాగుతోందని, అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదంటూ స్థానికులు వాపోతున్నారు.

ఇంకుడు గుంతనూ కలిపేసుకున్నారిలా..


చర్యలు తీసుకుంటాం

అల్లుగుండు పంచాయతీలో గతంలో భూపంపిణీ చేసిన వివరాలను పరిశీలించాలని నల్లచెరువు తహసీల్దార్‌ను ఆదేశిస్తాం. వంకలు, కొండలు, దారులు ఆక్రమించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సూచిస్తాం. వంక, ప్రభుత్వభూమిని ఆక్రమించిన వారిపై చర్యలతో పాటు ముళ్లను కంచెను తొలగిస్తాం.

రాఘవేంద్ర, ఆర్డీవో, కదిరి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని