logo

Anantapur: వివాహిత వేధింపులు భరించలేక యువకుడి ఆత్మహత్య

ఓ వివాహిత వేధింపులు భరించలేక యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన రాయదుర్గంలో శుక్రవారం ఉదయం చోటుచేసుకుంది.

Updated : 13 May 2023 08:25 IST

కుత్తీష్‌

రాయదుర్గం పట్టణం, న్యూస్‌టుడే : ఓ వివాహిత వేధింపులు భరించలేక యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన అనంతపురం జిల్లా రాయదుర్గంలో శుక్రవారం ఉదయం చోటుచేసుకుంది. పట్టణానికి చెందిన కుత్తీష్‌ అలియాస్‌ పృథ్వీ (30) ఫాస్ట్‌ ఫుడ్‌ సెంటర్‌ నిర్వహిస్తున్నాడు. పట్టణానికి చెందిన ఓ వివాహితతో చనువుగా ఉన్నప్పుడు జరిపిన ఫోన్‌ సంభాషణలు, ఇద్దరు కలిసి తీసుకున్న చిత్రాలను చూపించి గత కొద్ది కాలంగా తనను వేధిస్తోందని గతంలో కుత్తీష్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తనను ఇబ్బంది పెడుతున్నాడని సదరు వివాహిత సైతం అతనిపై ఫిర్యాదు చేసింది. పరస్పర ఫిర్యాదులపై పోలీసులు కేసు నమోదు చేశారు.

వారం రోజుల కిందట సదరు వివాహిత ఎస్పీని కలిసి స్పందనలో ఫిర్యాదు కూడా చేసింది. దీంతో పోలీసులు ఇద్దరినీ పిలిపించి విచారణ చేశారు. శనివారం తిరిగి విచారిస్తున్నట్లు ఇద్దరికీ సమాచారం అందించారు. గురువారం రాత్రి వివాహిత కుత్తీష్‌కు ఫోన్‌ చేసి తన ఇంటికి ఆహ్వానించింది. అతను వెళ్లకపోవడంతో మరొక వ్యక్తిని పంపింది. దీంతో తప్పని పరిస్థితిలో వెళ్లాడు. ఇంటికొచ్చాక అక్కడ జరిగిన విషయాన్ని తన భార్య లలితకు చెప్పాడు. శనివారం పోలీసు స్టేషన్‌కు వెళ్లాల్సి ఉందని, ఎవరినీ పంపినా ఆమె వద్దకు ఇంకోసారి వెళ్లొద్దని భార్య చెప్పింది.

బంధువుల వివాహానికి ఉరవకొండకు వెళ్లి వచ్చాక పోలీసులకు ఫిర్యాదు చేద్దామని భార్య కుత్తీష్‌కు నచ్చచెప్పింది. ఉదయాన్నే ఆమె ఉరవకొండకు బయలుదేరింది. అయితే మార్గమధ్యలో వెళ్లగా తన భర్త ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం వచ్చిందని భార్య లలిత బోరున విలపించింది. తన భర్త ఆత్మహత్య చేసుకునేందుకు వివాహిత వేధింపులే కారణమని పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేయకపోవడంతో ఆమె స్టేషన్‌ ముందు కూర్చొని నిరసన తెలిపింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కుత్తీష్‌ వ్యక్తిగతంగా సౌమ్యుడు కావడంతో పెద్ద ఎత్తున స్నేహితులు ఆసుపత్రికి చేరుకోవడంతో రద్దీ నెలకొంది. సదరు వివాహిత బాధితులు పట్టణంలో చాలా మంది ఉన్నారని పోలీసులు చెబుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని