logo

వేసవి పర్యటనలు హుళక్కేనా?

వేసవిలో రైల్వే ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులను యాత్రలకు పంపాలన్న రైల్వే బోర్డు నిబంధనలు గుంతకల్లు రైల్వే డివిజన్‌లో గత ఎనిమిది సంవత్సరాలుగా అమలు కావడంలేదు.

Published : 02 Jun 2023 05:09 IST

రైల్వే అధికారుల తాత్సారం... దూరమవుతున్న అవకాశం

గుంతకల్లు, న్యూస్‌టుడే: వేసవిలో రైల్వే ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులను యాత్రలకు పంపాలన్న రైల్వే బోర్డు నిబంధనలు గుంతకల్లు రైల్వే డివిజన్‌లో గత ఎనిమిది సంవత్సరాలుగా అమలు కావడంలేదు. డీఆర్‌ఎం కార్యాలయంలో పనిచేస్తున్న అధికారులు ఈ విషయంలో ఏ మాత్రం పట్టించుకోకపోవటంతో రైల్వే కేటాయించే నిధులు పేరుకుపోతున్నాయి. ఏటా రైల్వేబోర్డు డివిజన్‌కు యాత్రల కోసం రూ.3 లక్షలకు పైగా కేటాయిస్తోంది. ఎనిమిది సంవత్సరాల కిందటి వరకు దేశంలోని వివిధ పర్యాటక ప్రాంతాలకు వెళ్లారు. ఆ తరువాత అధికారులు పట్టించుకోక ఉద్యోగులు, పిల్లల పర్యాటక ప్రాంతాల సందర్శన ఎండమావిగా మారింది. రైల్వే నిధులను ఆదా చేయాలనే ఉద్దేశంతో కేటాయించిన నిధులను ఉద్యోగులు, వారి పిల్లల వినోదం కోసం వ్యయం చేయకుండా తాత్సారం చేస్తున్నారు.

ప్రత్యేక బోగీల ఏర్పాటుకు వెసులుబాటు

దేశంలోని పర్యాటక ప్రాంతాలకు ఉచితంగా రైల్వే ద్వారా వెళ్లడానికి రైల్వే బోర్డు వెసులుబాటు కల్పిస్తోంది. యాత్రకు వెళ్లేవారికి ప్రత్యేకంగా రైలు బోగీలను ఏర్పాటు చేస్తారు. పదిరోజుల పాటు పర్యటించి యాత్రకు వెళ్లిన వారు తిరిగి డివిజన్‌కు చేరుకునేవారు. పురుషులు, మహిళా ఉద్యోగినులు, పిల్లలు వేర్వేరుగా బోగీల్లో వెళ్లడానికి అవకాశం ఉంది. అన్ని రకాల సౌకర్యాలను రైల్వేనే కలుగజేస్తుంది. అధికారులు మాత్రం ఈ యాత్రల గురించి పట్టించుకోక పోతుండడంతో నిధులు వృథాగా ఉంటున్నాయి. యాత్రల వల్ల బాలబాలికలు స్ఫూర్తిని పొందుతారని, ఉద్యోగుల్లో పని ఒత్తిడి నుంచి ఉపశమనం పొందడానికి అవకాశం ఉంటుందన్న అభిప్రాయంతో రైల్వే బోర్డు ఈ యాత్రలు చేసే సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చింది. అధికారుల తీరుతో వందలాది మంది యాత్రలు చేసే అవకాశాన్ని కోల్పోతున్నారు. ఉద్యోగులు వెళ్లి అధికారులను కలిసి తమకు పర్యాటక ప్రాంతాలకు వెళ్లడానికి అనుమతులు ఇవ్వాలని కోరుతుంటే అధికారులు చూస్తాం, చేద్దాం అంటూ కాలం వెళ్లదీస్తున్నారు. ఇప్పటికైనా డీఆర్‌ఎం కార్యాలయ అధికారులు తమకు యాత్రలకు వెళ్లడానికి అనుమతులు ఇవ్వాలని రైల్వే ఉద్యోగులు కోరుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని