logo

కాలనీ దాటితే రాయితీ గల్లంతే..?

ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు ప్రతి నెలా లభించే విద్యుత్తు రాయితీ ప్రభుత్వం భరిస్తుంది. వారు వినియోగించుకున్న మొత్తాన్ని విద్యుత్తు సంస్థకు ప్రభుత్వం సర్దుబాటు చేస్తుంది. కాలనీలు, తాండాల్లో నివసించే ఎస్సీ, ఎస్టీ వినియోగదారులే రాయితీకి అర్హులంటూ 2020లో

Published : 24 May 2022 05:29 IST

ఎస్సీ, ఎస్టీ విద్యుత్తు వినియోగదారులపై సర్వే

అసలే పెరిగిన విద్యుత్తు ఛార్జీల భారంతో అన్ని వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. ఈ పరిస్థితుల్లో నిరుపేద ఎస్సీ, ఎస్టీలకు ఇచ్చే రాయితీకి మంగళం పాడేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇప్పటివరకు ఎస్సీ, ఎస్టీలకు నెలకు 200 యూనిట్లలోపు విద్యుత్తు వినియోగించుకుంటే డబ్బు చెల్లించాల్సిన అవసరం లేదు.. రెండేళ్ల కిందట జారీ చేసిన ఉత్తర్వులకు అధికారులు ఇప్పుడు మళ్లీ పదును పెడుతున్నారు.. ఆంక్షల పేరుతో రాయితీని కుదించేందుకు, అర్హులెందరో లెక్క తేల్చేందుకు ప్రత్యేక సర్వే చేపడుతున్నారు.

చిత్తూరు (మిట్టూరు), న్యూస్‌టుడే: ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు ప్రతి నెలా లభించే విద్యుత్తు రాయితీ ప్రభుత్వం భరిస్తుంది. వారు వినియోగించుకున్న మొత్తాన్ని విద్యుత్తు సంస్థకు ప్రభుత్వం సర్దుబాటు చేస్తుంది. కాలనీలు, తాండాల్లో నివసించే ఎస్సీ, ఎస్టీ వినియోగదారులే రాయితీకి అర్హులంటూ 2020లో ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కానీ ఎక్కడా ఇది బయటకు పొక్కలేదు. కిందిస్థాయి అధికారులకు ఆదేశాలు ఇవ్వడంతో వెలుగులోకి వచ్చింది. ఇప్పటివరకు ఎస్సీ, ఎస్టీ వినియోగదారులు కేవలం వారి కుల ధ్రువపత్రాన్ని విద్యుత్తు శాఖ అధికారులకు అందజేస్తే రాయితీ వర్తించేది. కొత్త నిబంధనల కారణంగా కాలనీలు, తండాల్లో కాపురం ఉండేవారే అర్హులు. వేరేచోట నివాసం ఉంటూ 200 యూనిట్ల లోపు వినియోగించుకున్నా రాయితీ వర్తించదు. బిల్లు అందరిలా చెల్లించాల్సిందే. దీనిపై ఎస్సీ, ఎస్టీ వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాలనీల్లో సరైన వసతి లేక ఇతర ప్రాంతంలో చిన్నఇల్లు నిర్మించుకుని జీవిస్తున్నా వారిని అనర్హులుగా గుర్తిస్తారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలో 1.62 లక్షల మంది ఎస్సీ, ఎస్టీ వినియోగదారులు ఉన్నారు. తాజా నిర్ణయంతో చాలామందిని అనర్హుల జాబితాలో చేర్చే అవకాశం ఉందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఛార్జీల భారాన్ని దించుకునేందుకే ప్రభుత్వం ఎత్తుగడలు వేస్తోందన్న విమర్శలున్నాయి. గతంలో ఎస్సీ, ఎస్టీలు నివసించే ఇళ్లలో ఇప్పుడు వేరేవారు ఎవరైనా నివసిస్తున్నారా? వారి పేరిట వీరు లబ్ధి పొందుతున్నారా? లబ్ధిదారుడి ఆధార్‌ కార్డుతో విద్యుత్తు కనెక్షన్లు అనుసంధానమై ఉన్నాయా? తదితర పూర్తి వివరాలు సమగ్రంగా సేకరిస్తున్నారు. గ్రామ, వార్డు సచివాలయాల్లోని విద్యుత్తు సహాయకులతో సర్వే చేయిస్తున్నారు. కేవలం ఎస్సీ, ఎస్టీ కాలనీలు, తండాల్లో నివాసం ఉండేవారికి సంబంధించిన వివరాలు మాత్రమే ప్రస్తుతానికి సేకరిస్తున్నారు. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత ఉచిత విద్యుత్తును వీరికే వర్తింపజేసే అవకాశం ఉందని భావిస్తున్నారు. 

* పది రోజుల్లో సర్వే పూర్తి 
ఉచిత విద్యుత్తు అర్హులు ఎంత మంది..? అనర్హులెందరు తేల్చనున్నాం. అధికారులు, సిబ్బందితో సర్వే చేస్తున్నాం. 10 రోజుల్లో లెక్క తేలనుంది. 
- హరి, చిత్తూరు జిల్లా ప్రత్యేక అధికారి, విద్యుత్తు శాఖ  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని