logo

నేర వార్తలు

శ్రీకాళహస్తి మున్సిపాలిటీలో పని చేసే పారిశుద్ధ్య మేస్త్రి శ్రీను గత కొన్ని రోజులుగా లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడంటూ ఓ కార్మికురాలు ఆవేదన వ్యక్తం చేసింది.

Published : 24 Jan 2023 01:50 IST

పారిశుద్ధ్య మేస్త్రీ  లైంగిక వేధింపులు

అధికారులకు కార్మికురాలి ఫిర్యాదు

తిరుపతి(నగరం), న్యూస్‌టుడే: శ్రీకాళహస్తి మున్సిపాలిటీలో పని చేసే పారిశుద్ధ్య మేస్త్రి శ్రీను గత కొన్ని రోజులుగా లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడంటూ ఓ కార్మికురాలు ఆవేదన వ్యక్తం చేసింది. సోమవారం కలెక్టరేట్‌లో జరిగిన స్పందన కార్యక్రమంలో కుటుంబ సభ్యులతో వచ్చి ఉన్నతాధికారులను కలిసి కన్నీటి పర్యంతమయ్యారు. మేస్త్రి వేధింపులు ఎక్కువయ్యాయని, తన మాట వినలేదన్న కోపంతో పని కూడా ఇవ్వడం లేదని ఫిర్యాదు చేసింది. అక్కడ సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసినా స్పందన లేదని వాపోయింది. శ్రీకాళహస్తి సీఐ అంజుయాదవ్‌కు ఫిర్యాదు చేయాలంటూ సూచించడంతో వెళ్లిపోయారు.


వేములవాడలో వివాహిత ఫిర్యాదు

యర్రావారిపాలెం: మండలంలోని కోటకాడపల్లి పంచాయతీ, వేములవాడకు చెందిన వివాహిత సోమవారం మండల పోలీస్‌ స్టేషన్‌లో తమ గ్రామానికే చెందిన చిన్న నాగేశ్వరావు తనని కోరిక తీర్చమని వేధిస్తున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది. తాను తిరష్కరించడంతో కోడిపుంజు దొంగతనం చేశానని పదే పదే గొడవ చేస్తూ దుర్భాషలాడుతూ భయబ్రాంతులకు గురి చేస్తున్నాడని ఆరోపించింది. దీనిపై ఎస్సై వెంకటేశ్వర్లును వివరణ అడగగా బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు తెలిపారు.


బ్రేక్‌ దర్శన టికెట్లు అధిక ధరలకు విక్రయించిన దళారీపై కేసు

తిరుమల, న్యూస్‌టుడే: శ్రీవారి వీఐపీ బ్రేక్‌ దర్శన టికెట్లను అధిక ధరలకు విక్రయించిన దళారీపై తిరుమల టూటౌన్‌ పోలీసులు సోమవారం కేసు నమోదు చేశారు. తితిదే విజిలెన్స్‌ వింగ్‌ వీజీవో గిరిధర్‌ తెలిపిన వివరాలమేరకు.. హైదరాబాద్‌కు చెందిన భక్తుడు ప్రమోద్‌కుమార్‌ శ్రీవారి దర్శనార్థం తిరుమలకు చేరుకున్నాడు. దర్శనం కోసం దళారీ శ్రీరామ్‌ అలియాస్‌ బాబీని ఆశ్రయించాడు. ఆరు వీఐపీ బ్రేక్‌ దర్శన టికెట్లను రూ.30 వేలకు విక్రయించాడు. అనంతరం మోసపోయానని గుర్తించిన భక్తుడు తితిదే విజిలెన్స్‌ అధికారులను ఆశ్రయించాడు. వారు భక్తుడి ద్వారా తిరుమల టూటౌన్‌ పోలీసులకు ఫిర్యాదు చేయించారు. కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు.


ట్రాన్స్‌ఫార్మర్‌ దొంగల అరెస్టు

రేణిగుంట: పొలాల్లో ట్రాన్స్‌ఫార్మర్లు అపహరిస్తున్న ఇద్దరిని గాజులమండ్యం పోలీసులు అరెస్టు చేశారు. సోమవారం స్థానిక పోలీసుస్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఎస్సై ధర్మారెడ్డి మాట్లాడుతూ వడమాలపేట మండలం కాయంపేటకు చెందిన బోయినపల్లి రమేష్‌, చంద్రగిరి మండలం పైడిపల్లికి చెందిన గుండ్లూరు ఆదినారాయణ గాజులమండ్యం, ఏర్పేడు, పుత్తూరు, వడమాలపేట తదితర ప్రదేశాల్లో వ్యవసాయ పొలాల్లో ట్రాన్స్‌ఫార్మర్లు చోరీచేసి రాగి తీగలను విక్రయిస్తున్నారన్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టామన్నారు. ఈ క్రమంలో స్థానిక ఆయిల్‌ ఫ్యాక్టరీ వద్ద ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. వీరి వద్ద నుంచి రాగి తీగలను స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించామన్నారు.


కారు ఢీకొని యువకుడి మృతి: ఇద్దరికి తీవ్ర గాయాలు

గంగవరం: బెంగళూరు-చెన్నై జాతీయ రహదారిలోని నాలుగు రోడ్ల సమీపంలో సోమవారం రాత్రి కారు ఢీకొని యువకుడు దుర్మరణం చెందగా మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. మండలంలోని ఎగువ గొర్రెల దొడ్డి, నడింగొర్రెలదొడ్డిలకు చెందిన చెన్నకేశవులు, మధు(20), ఆంజి నాలుగు రోడ్ల సమీపంలోని ప్రైవేటు కంపెనీలో కార్మికులుగా పనిచేస్తున్నారు. పని ముగించుకుని స్వగ్రామాలకు ద్విచక్రవాహనంపై వెళుతుండగా బెంగళూరు వైపు నుంచి పలమనేరు వైపు వస్తున్న కారు అతి వేగంగా ద్విచక్రవాహనాన్ని ఢీకొనడంతో ముగ్గురూ రోడ్డుపై పడ్డారు. మధు అక్కడికక్కడే మృతి చెందగా అంజి, చెన్నకేశవులు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే పలమనేరు ప్రభుత్వాసుపత్రికి తరలించగా అంజి పరిస్థితి విషమంగా ఉండడంతో వేలూరు సీఎంసీ ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఎస్‌ఐ సుధాకర్‌రెడ్డి కేసు దర్యాప్తు చేస్తున్నారు.


బాలుడ్ని కుంటలోకి లాక్కెళ్లిన ఆవు

రెడ్డిబాబు (పాతచిత్రం)

సోమల: నీటకుంటలో విద్యార్థి మృతిచెందిన ఘటన చిత్తూరు జిల్లా సోమల పంచాయతీ ముండ్రివారిపల్లెలో చోటుచేసుకొంది. గంగాధరం కుమారుడు రెడ్డిబాబు(9) స్థానికంగా నాలుగో తరగతి చదువుతున్నాడు. సోమవారం గ్రామ సమీపంలో ఆవును తాడుతో పట్టుకొని వెళ్తుండగా ప్రమాదవశాత్తు నీటికుంటలోకి లాక్కుని వెళ్లింది. బాలుడు నీటమునిగి మృతిచెందాడు.


గుర్తుతెలియని వ్యక్తి రైలు ఢీకొని..

నగరి: ఏకాంబరకుప్పం-వేపగుంట రైల్వే స్టేషన్ల మధ్య రైలు పట్టాలపై సోమవారం ఉదయం గుర్తుతెలియని వ్యక్తి మృతదేహాన్ని గుర్తించినట్లు రేణిగుంట రైల్వే పోలీస్‌స్టేషన్‌ కానిస్టేబుల్‌ కె.రవి తెలిపారు. మృతుని వయసు 30 నుంచి 34 ఏళ్లు ఉంటుందని, కుడిచెయ్యి భుజంపై గేద తల పచ్చబొట్టుగా ఉందని, కుడి రొమ్ముపై రేఖ అని తమిళ అక్షరాలతో పచ్చబొట్టు ఉందని తెలిపారు. మృతదేహాన్ని నగరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, కేసు దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు.


డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్య

గంగవరం: మన్నార్‌నాయనపల్లెకు చెందిన విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. గ్రామానికి చెందిన ఉదయ్‌కుమార్‌ రెండో కుమారై శ్రీవాణి(20) స్థానిక ప్రైవేటు కళాశాలలో బీకాం తృతీయ సంవత్సరం చదువుతోంది. సోమవారం తన ఇంట్లోని ఫ్యానుకు ఉరివేసుకుంది. కుటుంబసభ్యులు గమనించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు మృతదేహాన్ని  పలమనేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తన కుమారై ఆత్మహత్యకు ముందు గుర్తుతెలియని యువకుడు ఫోను చేశాడని, పదే పదే చేయడంతో అతనిపై అనుమానంగా ఉందని కుటుంబసభ్యులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేశారు.దర్యాప్తులో కారణాలు తెలుస్తాయని పేర్కొన్నారు.


చౌటూరులో బాల్యవివాహం..  

పుత్తూరు: స్థానిక 4వ వార్డు పరిధిలోని చౌటూరులో బాల్య వివాహం జరిగింది. స్థానికుల కథనం మేరకు వివరాలు... పుత్తూరు పట్టణ పరిధి చౌటూరు గ్రామానికి చెందిన యువకుడు పట్టణంలోని మద్యం దుకాణంలో సేల్స్‌మెన్‌గా పనిచేస్తున్నాడు. ఎదురింటిలో ఉండే అక్క కుమారై(14) పిళ్లారిపట్టు జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలో 8వ తరగతి చదువుతోంది. వారం రోజుల క్రితం బాలికను తీసుకెళ్లి శ్రీకాళహస్తిలో వివాహం చేసుకుని ఇంటికి వచ్చాడు. వరుడు తల్లికి పెళ్లి ఇష్టలేక వారిని ఇంటిలోకి రానివ్వలేదు. దీంతో వరుడు తల్లిపై చేయి చేసుకున్నాడు. ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ విషయమై వారం రోజులుగా పోలీసు స్టేషన్‌ ఆవరణలో పంచాయతీ జరుగుతోంది. సీఐ లక్ష్మీనారాయణను వివరణ కోరగా తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని, విచారణ చేసి చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని