Naralokesh-Yuvagalam: యువత కోసం ప్రత్యేక మేనిఫెస్టో ప్రకటిస్తాం: నారా లోకేశ్‌

యువతకోసం త్వరలో ప్రత్యేక మేనిఫెస్టో ప్రకటిస్తామని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ తెలిపారు. యువగళం పాదయాత్ర ప్రారంభం సందర్భంగా కుప్పంలో నిర్వహించిన బహిరంగ సభలో లోకేశ్‌ ప్రసంగించారు.

Updated : 27 Jan 2023 19:23 IST

కుప్పం: యువగళం పేరు ప్రకటించగానే వైకాపా నాయకులకు వణుకు పుట్టిందని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ విమర్శించారు. 4వేల కిలోమీటర్లు చేపట్టనున్న  యువగళం పాదయాత్రను ఇవాళ ఉదయం కుప్పం నుంచి లోకేశ్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ.. ‘‘యువగళం పాదయాత్ర ప్రకటించగానే  10మంది మంత్రులు నాపై మాటల దాడికి దిగారు. ఏ అర్హతతో పాదయాత్ర చేస్తున్నావని ప్రశ్నించారు.  గతంలో పంచాయతీరాజ్‌ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా దేశంలో ఏ రాష్ట్రంలో చేయని విధంగా అభివృద్ధి చేశాను. ఐటీ మంత్రిగా.. వేలాది మంది నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాను. ఆ అర్హతతోనే పాదయాత్ర చేస్తున్నా. నన్ను విమర్శించే మంత్రులను ప్రశ్నిస్తున్నా.. ఈ మూడేళ్లలో మీరు ఈ రాష్ట్రానికి ఏం చేశారు. . వీధుల్లో డ్యాన్సులు వేస్తే, క్యాసినో ఆడిస్తేనో పరిశ్రమలురావు’’

‘‘పొట్టి శ్రీరాములు త్యాగంతో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. దేశంలోనే తెలుగు జాతి గర్వ పడేవిధంగా  ఎన్టీఆర్‌కృషి చేశారు. ఆంధ్రుల సత్తా ఏంటో చంద్రబాబు చేసి చూపించారు. కానీ, ఒక్క ఛాన్స్‌ ఇస్తే జగన్‌ రాష్ట్రాన్ని నాశనం చేశారు. ఈ మూడేళ్లలో వైకాపా చేసిందేమిటి? జగన్‌రెడ్డి అంటే జాదూరెడ్డి గుర్తొస్తున్నాడు. మైసూర్‌ బోండాలో మైసూర్‌ ఉండదు.. జాదూరెడ్డి జాబ్‌ క్యాలెండర్‌లో ఉద్యోగాలు ఉండవు. 2.30 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదిలోనే ఇస్తామన్నారు.. ఏమయ్యాయి ఉద్యోగాలన్నీ? ఏటా జాబ్‌ క్యాలెండర్‌ ప్రకటిస్తామన్నారు ఏమైంది? మెగా డీఎస్సీ ఏమైందని జాదూరెడ్డిని ప్రశ్నిస్తున్నా. దిల్లీ మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తామని చెప్పిన జాదూరెడ్డి.. దిల్లీలో తెలుగువారి ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టారు. దానికి కారణం నీపైన ఉన్న కేసులే. యువత, రైతులు.. ఇలా అన్ని వర్గాలు ఈ ప్రభుత్వం బాధితులే. ఈ  మూడేళ్లలో రాష్ట్రాన్ని 67ఏళ్లు వెనక్కి తీసుకెళ్లారు. 3 రాజధానుల్లో ఎక్కడైనా ఒక్క ఇటుకైనా వేశారా జాదూరెడ్డి? పారిశ్రామిక వేత్తలు పక్క రాష్ట్రాలకు పారిపోయే పరిస్థితి. జే ట్యాక్స్‌ కట్టలేదని పక్క రాష్ట్రానికి పంపించేశారు. మహిళలపై దాడులు జరిగితే గన్‌ కంటే ముందు జగన్‌ వస్తాడని ప్రగల్భాలు పలికారు. కానీ, అది బుల్లెట్లు లేని గన్‌ అని ప్రజలకు అర్థమైంది’’ అని లోకేశ్‌ విమర్శించారు.

భయం నా బయోడేటాలోనే లేదు: లోకేశ్‌

‘‘యువతకు హామీ ఇస్తున్నా.. త్వరలోనే యువతకు ప్రత్యేకంగా మేనిఫెస్టో తీసుకు రాబోతున్నాం. ప్రభుత్వ ఉద్యోగాలు ఎన్ని? ప్రైవేటు రంగం నుంచి ఎన్ని? స్వయం ఉపాధి ద్వారా ఎన్ని ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామో స్పష్టంగా అందులో ప్రకటిస్తాం. ఏటా డీఎస్సీ ద్వారా ఖాళీగా ఉన్న టీచర్‌ పోస్టులు భర్తీ చేస్తాం. ఖాళీగా ఉన్న అన్ని ఉద్యోగాలు భర్తీ చేస్తాం. కౌలు రైతులకు ప్రత్యేక కార్యాచరణ తీసుకొచ్చి ఆదుకుంటాం. ప్రభుత్వ వైఫ్యలాలను విమర్శిస్తే.. నాకు చీరలు, గాజులు పంపుతామని ఓ మహిళా మంత్రి అన్నారు. పంపించండి చీర, గాజులు.. మా అక్కలు, చెళ్లెల్లకు ఇస్తా. చీర కట్టుకుని గాజులు వేసుకునే వాళ్లు చేతగానివాళ్లా? అని అడుగుతున్నా. మీ జగన్‌ మాదిరిగా తల్లీ, చెల్లిని బయటకు గెంటలేదు. మంత్రి పదవిలో ఉన్న వాళ్లు ఎలా మాట్లాడాలో నేర్చుకోవాలి. ఏ1 తెచ్చిన జీవో1తో అడ్డుకోవాలని చూస్తారా? పవన్‌ కల్యాణ్‌ పోరాటాన్ని అడ్డుకోవాలని చూస్తున్నారు. పవన్‌ వారాహి వాహనానికి ఆంక్షలు పెడుతున్నారు. యువగళం ఆగదు, వారాహి ఆగదు. భయం నా బయోడేటాలోనే లేదు. అడ్డొస్తే తొక్కుకుని వెళ్లి పోతాం. మంచి కోసం పోరాడే ధైర్యం ఉంది. సైకో పాలనలో అప్పులు.. ఆత్మహత్యలు. సైకిల్‌ పాలనలోనే సంక్షేమం, అభివృద్ధి. 400 రోజుల పాదయాత్రలో ఇది తొలిరోజు. నిరుద్యోగ యువతకు పిలుపినిస్తున్నా.. కలిసికట్టుగా ఉద్యమించి జాదూరెడ్డిని ఇంటికి పంపిద్దాం’’ అని లోకేశ్‌ అన్నారు. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని