logo

పల్లె మురిసింది.. ప్రేమ కురిసింది

అభిమాన నేత రాకతో పల్లెలు మురిశాయి.. ప్రేమ చూపాయి. మా లోగిళ్లలో కాంతులు నింపాలని ఆహ్వానం పలికాయి. దారులన్నీ     పూల దారాలయ్యాయి... అభినందన మందారాలయ్యాయి.. ఆత్మ బంధువుపై ఆశీస్సుల జల్లు కురిపించాయి.. పలకరింపుతో పులకించాయి. భవితపై ఆశలు చిగురించాయి.

Published : 05 Feb 2023 01:56 IST

రామానాయుడుపాళ్యం వద్ద లోకేశ్‌ను ఆప్యాయంగా పలకరిస్తున్న గ్రామస్థులు

అభిమాన నేత రాకతో పల్లెలు మురిశాయి.. ప్రేమ చూపాయి. మా లోగిళ్లలో కాంతులు నింపాలని ఆహ్వానం పలికాయి. దారులన్నీ     పూల దారాలయ్యాయి... అభినందన మందారాలయ్యాయి.. ఆత్మ బంధువుపై ఆశీస్సుల జల్లు కురిపించాయి.. పలకరింపుతో పులకించాయి. భవితపై ఆశలు చిగురించాయి. శ్రామికుడిపై నమ్మకముంచి పాదం కదిపాయి. తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ పాదయాత్ర తొమ్మిదో రోజు చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం, తవణంపల్లె మండలాల్లోని పల్లెల మీదుగా ఉత్సాహంగా కొనసాగింది.

లోకేశ్‌ పాదయాత్రలో పలు వర్గాల వారు తమ సమస్యలను విన్నవించారు. వీటికి పరిష్కార మార్గాలు సూచించేలా హామీ ఇచ్చారు. పలువురు నాయకులు ఆయన వెంట నడిచారు.  మాజీ మంత్రులు గల్లా అరుణకుమారి, అమరనాథరెడ్డి, సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, ఎమ్మెల్సీలు దొరబాబు, దీపక్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు దొమ్మలపాటి రమేశ్‌, సుగుణమ్మ, చిత్తూరు, తిరుపతి పార్లమెంట్‌ నియోజకవర్గాల ఇన్‌ఛార్జులు పులివర్తి నాని, నరసింహయాదవ్‌, చిత్తూరు మాజీ మేయర్‌ కటారి హేమలత, గీతం విద్యాసంస్థల ఛైర్మన్‌ భరత్‌ తదితరులు పాల్గొన్నారు.

తుంబకుప్పం క్రాస్‌ వద్ద హారతులు పట్టేందుకు నిరీక్షిస్తున్న మహిళలు


యువత కోసమే పోరాటం

తవణంపల్లె మండలం ఎ.గొల్లపల్లె కూడలి వద్ద యువతను ఉద్దేశించి లోకేశ్‌ మాట్లాడారు. రాష్ట్రంలో యువతకు ఉద్యోగాలు లేకపోవడంతో ఇతర రాష్ట్రాలకు వలస వెళ్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తెదేపా ప్రభుత్వం వచ్చాక రాష్ట్రానికి కంపెనీలకు తెచ్చి ఉద్యోగావకాశాలు కల్పిస్తామని, యువతకు బంగారు భవిష్యత్‌ కల్పించడానికే పోరాటం చేస్తున్నాని పేర్కొన్నారు.

ఈనాడు డిజిటల్‌, చిత్తూరు;  న్యూస్‌టుడే,  ఐరాల, తవణంపల్లె


మోసపోయాం.. మీరే ఆదుకోవాలి: ఎస్సీల మొర

సదకుప్పం: లోకేశ్‌కు సమస్యలు విన్నవిస్తున్న ఎస్సీలు

పూతలపట్టు, న్యూస్‌టుడే: దళితులకు మేలు చేస్తాడని మోసపోయి ఓట్లు వేశామన్నా.. కానీ మాకు చేసిందేమి లేదు. మీరే ఆదుకోవాలన్నా అంటూ  నారా లోకేశ్‌ ఎదుట దళితులు వాపోయారు. బంగారుపాళ్యం మండలం సదకుప్పంలో దళితుల ఆవేదనను చూసి చలించిపోయారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గడిచిన మూడున్నరేళ్లలో దళితులపై అనేక దాడులు జరిగాయన్నారు. ఎమ్మెల్సీ అనంతబాబు ఎస్సీ అయిన కారు డ్రైవర్‌ను చంపి ఇంటి ముందు పడేశారు.. పులివెందులలో నాగమ్మ, పుంగనూరులో ఓంప్రతాప్‌, చీరాలలో కిరణ్‌.. ఇలా అనేక మంది దళితులను దారుణంగా హత్య చేసిన ఘనత ఈ ప్రభుత్వానిదేనన్నారు. జడ్జి రామక్రిష్ణ వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని శారీరకంగా, మానసికంగా హింసిస్తున్నారన్నారు. ఎస్సీ కార్పొరేషన్‌ ద్వారా ఒక్క రుణం తీసుకున్నారా? ఎస్సీ ఉప ప్రణాళిక కింద ఒక్కరు లబ్ధిపొందారా? పదవి వచ్చే వరకు ముద్దులు.. వచ్చాకా గుద్దులని ప్రతి ఒక్కరూ గుర్తు పెట్టుకోవాలన్నారు. శుక్రవారం బంగారుపాళ్యంలో పోలీసులు నన్ను ఎంత ఇబ్బంది పెట్టారో మీరే చూశారు. వీటికి నేను భయపడనని,  తెదేపా ప్రభుత్వం వచ్చాక ఎస్సీ, ఎస్టీలకు ఉన్నత స్థానాన్ని కల్పిస్తామన్నారు.


మామిడి రైతులను ఆదుకుంటాం: లోకేశ్‌ హామీ

తుంబకుప్పం కూడలి వద్ద లోకేశ్‌కు వినతిపత్రం అందజేస్తున్న మామిడి రైతులు

తెదేపా అధికారంలోకి వచ్చిన వెంటనే మామిడి రైతులను ఆదుకుంటామని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ రైతులకు హామీ ఇచ్చారు. యువగళం పాదయాత్రలో భాగంగా బంగారుపాళ్యం మండలం తుంబకుప్పం కూడలి వద్ద తనను కలిసిన రైతులకు భరోసా కల్పించారు. అనంతరం మాట్లాడారు. అకాల వర్షాలు, తగ్గిన దిగుబడులు, పెరిగిన పెట్టుబడులతో గిట్టుబాటు ధరలు లేక మామిడి రైతులు నష్టాలపాలవుతున్నారని తెలిపారు. రైతులను ఆదుకోవడంలో జగన్‌ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. కనీస గిట్టుబాటు ధర లేకపోవడంతో పంటను తోటల్లోనే రైతులు వదిలేస్తున్నారని చెప్పారు. దీనికి తోడు పూతలపట్టు నియోజకవర్గంలోని రైతులకు కోతులు, ఏనుగుల బెదడ అధికంగా ఉందన్నారు. దీనిని అధిగమించడానికి తెదేపా ప్రభుత్వం వచ్చిన వెంటనే కందకాలు, సోలార్‌ కంచెలు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.


విశేషాలు

పలు గ్రామాల్లో నిర్వహించిన సమావేశాల్లో లోకేశ్‌ ప్రసంగానికి వివిధ వర్గాలవారు ముగ్దులై చప్పట్లు కొడుతూ, ఈలలు వేశారు.

* నీ పాదయాత్రకు భద్రత కల్పించాం.. నా యువగళం పాదయాత్రను  అడ్డుకుంటున్నావు.. ఏం భయమా? అన్నప్పుడు  కేకలు వేశారు.

నాకు కొందరు కంగ్రాట్్స చెప్పారు.. వంద కిలోమీటర్లు పూర్తి చేసినందుకు చెప్పారనుకున్నా.. నీపై 16వ కేసు పెట్టినందుకన్నారని అనడంతో అందరూ నవ్వారు.

*పసుపు అంటే జగన్‌కు పట్టదు.. మహిళలు పసుపు చీరలు కట్టుకొచ్చారు... అన్నప్పుడు నవ్వులు విరిశాయి.

శాసనసభ సాక్షిగా నా తల్లిని అవమానించారు.. ఇంత మంది తల్లుల మంచి కోసం పాదయాత్ర చేస్తున్నా అనడంతో చప్పట్లు మోగాయి.

మైక్‌ సెట్‌ వినియోగించే వాహనాలతో పాటు నేను ఉపయోగించే స్టూలు కూడా పట్టుకెళ్లారు తల్లీ.. అందుకే చిన్న స్పీకర్‌ పెట్టుకుని మళ్లీ స్టూలు కొనుక్కున్నా అన్నప్పుడు అందరూ నవ్వారు.

జగన్‌ పాలనకు వ్యతిరేకంగా  ప్లకార్డుల ప్రదర్శన


‘పాదయాత్ర చేస్తే పోలీసులకు ఇబ్బందేంటి?’

నారా లోకేశ్‌ పాదయాత్ర చేస్తుంటే పోలీసులకు వచ్చిన ఇబ్బందేంటని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ప్రశ్నించారు. పలమనేరు డీఎస్పీ ఎందుకంత అతిగా ప్రవర్తిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘రాహుల్‌ గాంధీ కన్యాకుమారి నుంచి కశ్మీర్‌ వరకు పాదయాత్ర చేస్తే పోలీసులు పటిష్ఠ బందోబస్తు కల్పించారు. రాష్ట్రంలో మాత్రం ఇందుకు భిన్నంగా జరుగుతోంది. ఇక్కడ నియంత పరిపాలన ఉందా?’  అని సోమిరెడ్డి ధ్వజమెత్తారు.


బంగారుపాళ్యం: నల్లంగారికోటూరులో లోకేశ్‌ వెంట నడుస్తున్న మాజీ మంత్రి అమరనాథరెడ్డి, తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నల్లారి కిశోర్‌కుమార్‌రెడ్డి, ఎమ్మెల్సీ దొరబాబు, తెదేపా చిత్తూరు పార్లమెంటు నియోజకవర్గ అధ్యక్షుడు పులివర్తి నాని, తదితరులు


ఇంజినీరింగ్‌ చదివినా ఉద్యోగాలేవీ..

భార్గవి, బొమ్మాయిపల్లె, బంగారుపాళ్యం

మా పిల్లలు ఇంజినీరింగ్‌ చదివారు. ఉద్యోగాలు దొరకడం లేదు. వైకాపా ప్రభుత్వం జాబ్‌ క్యాలెండర్‌ పేరుతో యువతను మోసం చేసింది. తెదేపా పాలనలో యువతకు ఉద్యోగాలు కల్పించి బడుగు బలహీన వర్గాల సంక్షేమానికి కృషి చేయాలి. పద్మశాలీ కుల ధ్రువపత్రాలు తహసీల్దారు ఇవ్వడం లేదు.

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని