logo

సమస్యలు ఇక్కడ.. పోస్టు అక్కడ..!

 ఇనాం భూముల సమస్య ఇప్పటికీ ఓ కొలిక్కి రాలేదు.. రైత్వారీ పట్టాల జారీపై అనేక అక్రమాలు చోటు చేసుకున్నాయి.

Published : 21 Mar 2023 02:51 IST

ఈనాడు-తిరుపతి:  ఇనాం భూముల సమస్య ఇప్పటికీ ఓ కొలిక్కి రాలేదు.. రైత్వారీ పట్టాల జారీపై అనేక అక్రమాలు చోటు చేసుకున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో కీలకమైన ఇనాం డిప్యూటీ తహసీల్దారు పోస్టు చిత్తూరు జిల్లాలోనే కొనసాగుతోంది. తిరుపతిలో ఏర్పాటు చేయాలని  కలెక్టర్‌ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా మార్పు చేయకపోవడంతో సమస్యల పరిష్కారం అధికారులకు తలనొప్పిగా మారింది.

తిరుపతిని ఆనుకుని ఉన్న యర్రంరెడ్డిపాలెం, తిరుచానూరు, దామినేడుతోపాటు పలు ప్రాంతాలు ఇనాం గ్రామాలుగా ఉన్నాయి. వీటికి పట్టాలు మంజూరు చేసే అధికారం కేవలం ఇనాం డిప్యూటీ తహసీల్దారుకు మాత్రమే ఉంది. వీటిని అసలైన వ్యక్తులకు కాకుండా తమకు అనుకూలమైన వారికి కట్టబెట్టారని పెద్ద ఎత్తున ఆరోపణలు ఉన్నాయి. దీనికి సంబంధించి న్యాయస్థానాల్లోనూ కేసులు నడుస్తున్నాయి. వాస్తవానికి పోస్టును తిరుపతికి బదలాయించాల్సిందిగా కలెక్టర్‌ వెంకటరమణారెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. దీంతో తిరుపతి గ్రామీణ డిప్యూటీ తహసీల్దారును ఇనాం డిప్యూటీ కలెక్టర్‌గా గుర్తించాలని అనుకున్నారు. చిత్తూరులో ఉన్న దస్త్రాలను తిరుపతి తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. చివరికి ఆ పోస్టును చిత్తూరులోనే కొనసాగిస్తూ వచ్చారు. తిరుపతిలో జరుగుతున్న అక్రమాలపై అధికారులకు పెద్ద ఎత్తున ఫిర్యాదులు వస్తున్నాయి. దస్త్రాలన్నీ చిత్తూరులో ఉండటం, వాటిని చూసే అధికారి సైతం అక్కడే కొనసాగుతుండటంతో సమస్యలు పరిష్కారం కావట్లేదు. ప్రస్తుతం పలు కేసులు సుప్రీం కోర్టులో ఉన్నాయి. న్యాయస్థానంలో కేసులు నడుస్తున్నా కొందరికి నిబంధనలు అతిక్రమించి పట్టాలు మంజూరు చేశారు. దీనిపైనా భూయజమానులు న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో కొన్ని సందర్భాల్లో న్యాయస్థాన తీర్పులను ఉల్లంఘించారని పేర్కొంటూ అధికారులకు తాఖీదులు వస్తున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో అన్ని దస్త్రాలను పరిశీలించి న్యాయస్థానాల్లో కౌంటర్లు దాఖలు చేయడం ఇబ్బందిగా మారుతోంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు