TTD: కొవిడ్‌ తర్వాత శ్రీవారి హుండీ ఆదాయం గణనీయంగా పెరిగింది: వైవీ సుబ్బారెడ్డి

2023-24 ఆర్థిక సంవత్సరానికి ప్రవేశపెట్టిన బడ్జెట్‌ వివరాలను తితిదే(TTD) విడుదల చేసింది.

Updated : 22 Mar 2023 14:05 IST

బడ్జెట్‌ వివరాలు వెల్లడించిన తితిదే ఛైర్మన్‌

తిరుమల: 2023-24 ఆర్థిక సంవత్సరానికి ప్రవేశపెట్టిన బడ్జెట్‌ వివరాలను తితిదే(TTD) విడుదల చేసింది. రూ.4,411 కోట్ల వ్యయం అంచనాలతో రూపొందించిన ఈ బడ్జెట్‌ వివరాలను తితిదే ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి (YV Subbareddy) వెల్లడించారు. తిరుమలలోని అన్నమయ్య భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. 

గత నెల 17న నిర్వహించిన ధర్మకర్తల మండలి సమావేశంలో తితిదే బడ్జెట్‌తో పాటు మరికొన్ని అభివృద్ది కార్యక్రమాలకు నిధుల కేటాయింపుపై తీర్మానం చేశామని సుబ్బారెడ్డి తెలిపారు. ఫిబ్రవరి 15న నిర్వహించిన తితిదే ధర్మకర్తల మండలి సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నామని.. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉండటంతో ఆ వివరాలను వెల్లడించలేదని చెప్పారు. శ్రీవారి భక్తుల సౌకర్యార్థం తిరుమల లడ్డూ విక్రయశాలలో రూ.5.25కోట్లతో మరో 30 కౌంటర్లను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఇప్పటికే తమిళనాడులోని ఊల్లందూరుపేటలో నిర్మాణంలో ఉన్న శ్రీవారి ఆలయం, ఇతర అభివృద్ధి కార్యక్రమాలకు రూ.4.70 కోట్లు మంజూరు చేస్తున్నామన్నారు. తిరుపతిలోని ఎస్‌జీఎస్‌ ఆర్ట్స్ కళాశాలలో మూడో అంతస్తు ఏర్పాటుకు రూ.4.71 కోట్లు కేటాయించినట్లు చెప్పారు.

ఏప్రిల్‌లోపు శ్రీనివాససేతు పనులు పూర్తి

కొవిడ్‌ తర్వాత శ్రీవారి హుండీ ఆదాయం గణనీయంగా పెరిగిందని సుబ్బారెడ్డి చెప్పారు. కొవిడ్‌కు ముందు ఏడాదికి రూ.1200కోట్ల కానుకలు లభిస్తే.. ఆ తర్వాత అది రూ.1500 కోట్ల వరకు పెరిగిందన్నారు. బ్యాంకుల్లో ఉన్న తితిదే డిపాజిట్లపైనా వడ్డీ రేట్లు రేట్లు పెరిగాయని ఆయన వివరించారు. తిరుపతిలోని శ్రీనివాససేతు పనులను ఏప్రిల్‌లోపు పూర్తి చేస్తామన్నారు అలిపిరి నుంచి వకుళామాత ఆలయం వరకు కొత్త రోడ్డు మంజూరు చేస్తున్నట్లు చెప్పారు. వీఐపీ బ్రేక్‌ దర్శనం సమయాన్ని మార్చడం వల్ల సామాన్యులకు ఎంతో ఉపయోగకరంగా ఉందని.. ఈ విధానాన్ని కొనసాగిస్తామని తెలిపారు. ఏప్రిల్‌ 5న ఒంటిమిట్టలోని శ్రీకోదండరామ స్వామి కల్యాణోత్సవంలో సీఎం జగన్‌ పాల్గొని రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పి్స్తారని వైవీ సుబ్బారెడ్డి చెప్పారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని