logo

తీపి కబురు చెప్పేదెన్నడో...?

మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని చిత్తూరు కలెక్టర్‌ సమీక్షలు నిర్వహిస్తున్నా ధరలు పెరగకపోగా రోజురోజుకు తగ్గుతున్నాయి.

Updated : 30 May 2023 06:03 IST

పెరగని మామిడి ధర
ఆందోళనలో రైతులు
దృష్టిపెట్టని జిల్లా అధికారులు

పుత్తూరు, న్యూస్‌టుడే: మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని చిత్తూరు కలెక్టర్‌ సమీక్షలు నిర్వహిస్తున్నా ధరలు పెరగకపోగా రోజురోజుకు తగ్గుతున్నాయి. కొద్ది రోజుల క్రితం వరకు ఓ మోస్తరు ధర పలికన బేనీషా, చందూర, తోతాపురి తదితర రకాల ధరలు అమాంతంగా పడిపోయాయి. ఫలరాజుగా పిలిచే బేనీషా కాయలు కొనుగోలు చేసేందుకు వ్యాపారులు ముందుకు రావడంలేదు. గతంలో ఇలాంటి పరిస్థితులు ఎన్నడూ లేవు. చిత్తూరు కలెక్టర్‌ షన్మోహన్‌ పల్ప్‌ వ్యాపారులు, రైతు సంఘాల నేతలతో సమావేశం నిర్వహించి తోతాపురి రూ.19వేలకు తక్కువ కాకుండా కొనుగోలు చేయాలని ఆదేశించారు. ఈ ధరలు రెండు మూడ్రోజులు రైతులకు చెల్లించారు. అనంతరం కాయలు నాణ్యత లేదని సాకు చూపి తగ్గించుకుంటూ వస్తున్నారు. ప్రస్తుతం తోతాపురి రకం పల్ప్‌ ఫ్యాక్టరీల యజమానులు టన్ను రూ.11వేలకు కొనుగోలు చేస్తున్నారు. అది పూర్తి స్థాయిలో గ్రేడింగ్‌ చేపడుతున్నారు. గతంలో గ్రేడింగ్‌ లేకుండా తీసుకునే వారు. గతంలో ఎన్నడూ బేనీషా రకాన్ని పల్ప్‌ ఫ్యాక్టరీలు కొనుగోలు చేసిన దాఖలాల్లేవు. ప్రస్తుతం టన్ను రూ.6 వేల నుంచి రూ.10 వేలకు కొనుగోలు చేస్తుండటం గమనార్హం. ఓవైపు రైతులు దిగుబడులు లేక పెట్టిన పెట్టుబడులు దక్కవని కన్నీటిపర్యంతమవుతున్న తరుణంలో ధరలు తగ్గిపోవడంతో కంటిపై కునుకు లేకుండా గడుపుతున్నారు.

నూజివీడు మార్కెట్‌ నుంచి..

ప్రస్తుతం కృష్ణా జిల్లా నూజివీడు నుంచి తోతాపురి కాయలు జిల్లాలోని పల్ప్‌ ఫ్యాక్టరీలకు తెప్పించుకుంటున్నారు. అక్కడ వాటిని టన్ను రూ.6వేలకు కొనుగోలు చేస్తున్నారు. దీంతో జిల్లాలోని మామిడికి ధరలు దక్కడం లేదని వ్యాపారులు చెబుతున్నారు. నూజివీడు నుంచి వస్తున్న సరకు నాణ్యత లేకపోవడంతో పల్ప్‌ ఫ్యాక్టరీల యజమానులు చేసేదిలేక వాటిని బయటపడేస్తున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా యంత్రాంగం మామిడి రైతుల అవస్థలు దృష్టిలో ఉంచుకుని చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది.

కలెక్టర్‌ గారూ.. పట్టించుకోరూ..!

తిరుపతి జిల్లా పరిధిలో పుత్తూరు, తిరుచానూరు, దామలచెరువుల్లో మామిడి కొనుగోళ్లు జరుగుతున్నాయి. సీజన్‌ ప్రారంభమై నెల రోజులు గడుస్తున్నా తిరుపతి కలెక్టర్‌ మామిడి రైతులతో ఒక్క సమావేశం నిర్వహించలేదు. పుత్తూరు, తిరుచానూరు, పాకాల యార్డుల్లోని వ్యాపారులు చిత్తూరు కలెక్టర్‌ ఆదేశాలు తామెందుకు పాటించాలని రైతులతోనే నేరుగా చెబుతున్నారు. ఈ నేపథ్యంలో తిరుపతి కలెక్టర్‌ చొరవ తీసుకుని మామిడి రైతుల సమస్య పరిష్కరించాలని రైతులు కోరుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని