logo

ఘనమైన ఆశయం..బలమైన సాధన

యవ్వనమంటే చదువులు, సరదాలు మాత్రమే కాదు.. భవిష్యత్‌ లక్ష్యాల సాధనకు దొరికే అనువైన సమయం.. ఆసక్తి ఉన్న రంగాల్లో ప్రతిభ నిరూపించుకునేందుకు విద్యార్థి దశ ఓ మంచి తరుణం..

Published : 09 Jun 2023 03:59 IST

విభిన్న రంగాల్లో రాణిస్తున్న యువత

చిత్తూరు(క్రీడలు), న్యూస్‌టుడే: యవ్వనమంటే చదువులు, సరదాలు మాత్రమే కాదు.. భవిష్యత్‌ లక్ష్యాల సాధనకు దొరికే అనువైన సమయం.. ఆసక్తి ఉన్న రంగాల్లో ప్రతిభ నిరూపించుకునేందుకు విద్యార్థి దశ ఓ మంచి తరుణం.. ఈ విద్యార్థులు పుస్తకాలు, ప్రయోగశాలలకే పరిమితం కాకుండా సహ పాఠ్యాంశాల్లోనూ రాణిస్తున్నారు.. ఆశయాన్ని నెరవేర్చుకునేందుకు బలంగా ప్రయత్నిస్తున్నారు జిల్లాకు చెందిన పలువురు యువత.

జాతీయ ఎంపిక పోటీల్లో ప్రతిభ..

చిత్తూరులోని ఓ కళాశాలలో ఇంజినీరింగ్‌ చివరి సంవత్సరం చదువుతున్నాడు షేక్‌ జహీర్‌. వాలీబాల్‌్ ఆడటంలో దిట్ట. ఆరేళ్లుగా సాధన చేస్తూ ఆట తీరులో నేడు చక్కటి ప్రావీణ్యం సాధించాడు. బంతి పాస్‌ చేయడంలో దిట్ట. గతంలో మూడుసార్లు జిల్లా జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. 2019లో జేఎన్‌టీయూఏ అనంతపురం జట్టుకు ఎంపికై జాతీయ స్థాయిలో కాంస్య పతకం సాధించాడు. గతేడాది మళ్లీ జేఎన్‌టీయూఏ జట్టులో చోటు దక్కించుకున్నాడు. చెన్నైలో జరిగిన అంతర విశ్వవిద్యాలయాల టోర్నీలో సత్తా చాటాడు. జాతీయ స్థాయి ఆటగాడిగా అంతర్జాతీయ పోటీల్లో ప్రాతినిధ్యం వహించడం తన లక్ష్యమని ధీమాగా చెబుతున్నాడీ యువ కెరటం.

వక్తృత్వంలో రజతం..

‘ఈ దేశం నాకేం ఇచ్చింది.. అని కాకుండా దేశానికి నేనేం సేవ చేశా’ అనే ఆలోచన ప్రతి ఒక్క యువతలోనూ రావాలని అంటున్నాడు తవణంపల్లె మం డలానికి చెందిన యువరాజ్‌. నెహ్రూ యువ కేంద్ర ఆధ్వర్యంలో నిర్వహించిన వక్తృత్వ పోటీ ల్లో రజత పతకం సాధించారు. ఎంబీఏ పూర్తి చేశారు. జిల్లా స్థాయిలో జరిగిన వివిధ పోటీల్లో పాల్గొని పతకాలు కైవసం చేసుకున్నాడు. ‘భారతదేశ స్వాతంత్య్ర సంగ్రామం, స్వాత్రంత్య్ర సమరయోధుల త్యాగం గురించి వివరించడంతో పాటు దేశాభివృద్ధికి సమాజం ఎలా ఉండాలి’ అనే విషయంపై తన భావాల్ని వ్యక్తీకరించానని, తనకు పతకం దక్కడం సంతోషంగా ఉందన్నాడు. గ్రూప్‌-1 అధికారిగా సేవలందించడమే తన లక్ష్యమని అంటున్నారు యువరాజ్‌.

దేశం కోసం పాటుపడాలి..

యువత దేశాభివృద్ధికి కృషి చేయాలన్న భావనను విద్యార్థి దశ నుంచే అలవరచుకోవాలని అంటున్నారు కుప్పం మండలం బైరప్పకొట్టాలు గ్రామానికి చెందిన బాలరాజు. డీఈడీ పూర్తిచేసిన ఆయన ప్రస్తుతం దూరవిద్యలో బీఎస్సీ అభ్యసిస్తున్నారు. యువకేంద్ర ఆధ్వర్యంలో జరిగిన వ్యాసరచన పోటీల్లో ‘దేశభక్తి యువ నిర్మాణం’ అనే అంశంలో చక్కగా ఉపన్యసించి కాంస్య పతకం సాధించారు. మున్ముందు మరింతగా కష్టించి ఐఏఎస్‌కు ఎంపికై గ్రామీణాభివృద్ధికి పనిచేయడమే తన ఆశయమని ఘంటాపథంగా చెబుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని